Tuesday 20 October 2015

చందోలు శాస్త్రి గారు - బాలా అమ్మవారు

ఒక 50 ఏళ్ళ క్రితం మాట. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారనే గొప్ప బాలా త్రిపురసుందరి ఉపసాకులు గుంటూర్ జిల్లా చందోలులో నివసించేవారు. వారినే చందోలు శాస్త్రి గారని కూడా అనేవారు. తరుచూ వీరు గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చెప్తూ ఉంటారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు వారి గురించి ఒక ప్రవచనంలో చెప్పిన మాట. 'శాస్త్రి గారు ఒక కాలంలో తీవ్రమైన పేదరికం అనుభవించారు. తినడానికి తిండి లేని పరిస్థితి. అటువంటి పరిస్థిలో కూడా వారు అమ్మవారి ఉపాసనను విడిచిపెట్టలేదు. రోజుకు 27 సార్లు లలితా సహస్రనామం పారాయణ చేసి, అమ్మవారికి నివేదన చేయడానికి ఏమీ లేకపోతే, చెంచాతో మంచినీళ్ళు నివేదన చేసేవారు. ఎంతటి తీవ్రమైన వ్యతిరేక పరిస్థితులు ఎదురుకొన్నా, అమ్మవారి యందు నిశ్చలమైన, అచంచలమైన భక్తిని వీడలేదు. ఇది చూసి అమ్మ పొంగిపోయింది. ఒకానొకనాడు బాలా అమ్మవారు శాస్త్రిగారికి ప్రత్యక్షమై "శాస్త్రి! ఇంకా చాలు. ఎన్నాళ్ళు అనువభిస్తావు. ఇక అయిపోయిందిలే" అన్నది. అక్కడితో వారి పేదరికం అంతరించింది. అటు తర్వాత వారు మరణించేవరకు వారి ఇంట అనేకమందికి అన్నదానం చేశారు. బాలా త్రిపురసుందరి దేవి పై వారికి ఎంత భక్తి అంటే, ఆయన పనిలో ఉన్నప్పుడు, వారి ఇంటికి ఎవరైనా వచ్చి, శాస్త్రీగారిని పిలిస్తే, బాలా అమ్మవారు చిన్న పిల్లా రూపంలో ఇంట్లోంచి బయటకు వచ్చి, 'మా నాన్న గారు పనిలో ఉన్నారండి. కాసేపు ఆగండి' అని చెప్పేది. ఆఖరికి వారి మరణం తర్వాత దేహం చితిలో కాలుతున్న సమయంలో, ఆ చితి మంటలపై అమ్మవారు కనిపించింది. ఇది ఫోటో తీసి పత్రికలలో కూడా వచ్చింది.

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే మాటకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. అమ్మవారిని ప్రేమతో, నిశ్చల భక్తితో, అచంచల విశ్వాసంతో పూజిస్తే, పొందలేనిదంటూ ఏం ఉంటుంది?

ఓం శ్రీ మాత్రే నమః 

No comments:

Post a Comment