Saturday 14 August 2021

శ్రీ హనుమద్భాగవతము (10)



సూర్య భగవానుడు మేషరాశిలో నుండెను. ఆనాడు చిత్రానక్షత్రం కలిగిన పూర్ణిమాతిథి. అంజనా దేవి చేయు కఠోరతపస్సునకు సంతసించి వాయు దేవుడు ప్రత్యక్షమై ‘అంజనా దేవీ! నీ తపస్సునకు నేను మిక్కిలి ప్రసన్నుడనయ్యాను. అభీష్టమగు వరమడుగు, తప్పక నెరవేరుస్తానూ అని పలికెను.


ప్రత్యక్షుడైన వాయుదేవుని దర్శించి, ప్రసన్నురాలైన అంజన ఆయన చరణాలకు నమస్కరించి 'మహాత్మా! నాకు ఉత్తమపుత్రుడు జన్మించు వరము ఇవ్వమని తన మనోరథాన్ని వెళ్ళడి చేసినది. 


సంతుష్టుడైన వాయు దేవుడు ‘సుముఖీ! నేనే నీకు పుత్రుడనై నీనామమును విశ్వవిఖ్యాతము చేయుదు’నని పలికెను. 


వరమును బొందిన అంజనయొక్క సంతోషమునకు అంతులేదు. తన ప్రియురాలునకు వరము లభించిందన్న వార్తను విని కపిరాడైన కేసరి కూడా ఎంతో ఆనందపరవశుడయ్యాడు - స్కందపురాణం వైష్ణవఖండం 


ఒకనాటి విషయము. పరమలావణ్యవతి, విశాలలోచన అయిన అంజన చక్కగ అలంకరించుకొని ఉంది. ఆమె యొక్క సుందరశరీరము పై పచ్చనివస్త్రము శోభిల్లుతూ ఉంది, చీర యంచు ఎఱుపురంగు. ఆమె వివిధములైన సుగంధపుష్పాభరణాలతో దివ్య సౌందర్యము మూర్తీ భవించినట్లుగా కనిపిస్తూ ఉంది.


అంజన పర్వత శిఖరముపై నిలుచుండి ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించుచు ముగ్ధురాలవుతూ ఉండేది. 'నాకొక యోగ్యుడైన పుత్రుడు కలిగిన ఎంత బాగుండునో అనే కోరిక ఆమె మనస్సులో ఆ సమయంలో ఉద్భవించింది.


వెంటనే వాయుతరంగ మొకటి వేగముగ వచ్చినది. అంజనా దేవిచీరకొంగు కొంచం జారెను. ఆమె వక్షోజాలు కనబడసాగినాయి. అపుడు తననెవరో స్పృశించుచున్నట్లు ఆమెకు తోచింది.

No comments:

Post a Comment