Friday 20 August 2021

శ్రీ హనుమద్భాగవతము (16)



అందుకు శ్రీమన్నారాయణుడు “ భక్తవశంకర ! నీవు లింగస్వరూపుడవు, నీవీ రూపమున నుండ నేను నీ చేత సేవలను పొందలేను. రాబోవు కల్పములలో నేను దుష్టశిక్షణార్థమై అవనిపై శ్రీరామచంద్రునిగా అవతరిస్తాను, ఆయా అవతారములలో నా శక్తి యగు సీత నా నుండి దూరమవుతుంది. ఆమె లేని నేను అవతార కార్యం పూర్తి చేయలేను. ఆ అవతారములో నీవు ఆదిపరాశక్తి సహితముగా నా అంశను పొంది శ్రీ ఆంజనేయుడవై అవతరించి నీ ప్రతిజ్ఞాపాలన ఒనరించు. శక్తి దూరమైన నాకు నీ నవ్యశక్తిని ప్రసాదించి నన్ను పరిపూర్ణునునిగా చేయుము. దుష్టశిక్షణలో శిష్టరక్షణములో నాతో కలసి పాల్గొను. భగవంతుడవైన నీవే భక్తునిగా అవతరించి పరమభక్తుల ఆచరణ ఇలా ఉంటుందని ఆచరించి సకల విశ్వములకు చూపించు. సకలవిశ్వములందు గల భక్తులకు రక్షకుడు, సకల దుష్టసంహారకుడవై, మోక్షప్రదాతవై, ఐశ్వర్యదాయకుడవై, సచ్చిదానంద స్వరూపుడవై, శ్రీహరిహరుల ఏక రూపుడవై ప్రకాశించు, మమ్ములనందరిని రక్షింపు' అని ప్ర్రార్థించెను.


శ్రీహరి పలికిన వచనముల నాలకించి ఆశుతోషుడైన శివుడు తథా స్తనిపలి కెను. సకల దేవతలు మహర్షులు పరమా నందభరితులై జయజయ మధ్వానముల నొనరించిరి.


కాలాగ్ని రుద్రావతారుడు శ్రీ ఆంజనేయుడు


శివలోకములో సతీశివులు రామనామ మాధుర్యమును ఆస్వాదించుచున్నారు. ప్రసంగ మాధుర్యంలో పరమేశ్వరుడు సతీ దేవితో ఇట్లు పలికెను. ‘మహమాయా! ఎవని నామస్మరణముచే నా శరీరన్ పులకిస్తుందో ఆ నాస్వామి భూమి పై దుష్టశిక్షణార్థము అవతరించనున్నాడు. దేవతలందరూ భగవంతుని సేవించుటకు అవనిపై అవతరిస్తారు. నేను కూడ శ్రీరామ సేవకుడనై నా మనోరథాన్ని సఫలము చేసుకుంటాను'.     


శంకరుని వచనములను ఆలకించి జగజ్జనని కొంచం ఆలోచించి ఇట్లా పలికాడు - 'నాథా! రావణుని సంహరించుటకు భగవంతుడు అవతరించనున్నాడు. రావణుడు మీకు అనన్య భక్తుడు, ధన్యజీవి, అలాంటి పరమభక్తుని సంహార కార్యములో మీరెలా పాల్గొంటారు?


అప్పుడు శంకరుడు మందహాసము చేసి ఇలా పలికెను. 'దేవీ రావణాసురుడు నా భక్తుడైనా నా యొక్క కాలాగ్ని రుద్రాంశను మఱచాడు. దేవీ! నేను పదకొండు రూపాలలో ఉంటాను. రావణుడు తన పది తలలును అర్పించి నా పదిరూపాలను మాత్రమే ఆరాధించాడు. కానీ కాలాంతకమైన నా కాలాగ్ని రుద్రాంశను మఱచాడు. రావణుడు పూజించక వదలిన కాలాగ్ని రుద్రాంశతో నేను అవతరించి శ్రీరామచంద్ర ప్రభువును సేవిస్తాను. రావణునితో యుద్ధం 'చేస్తాను.


పరమేశ్వరుడే ఆదిపరాశక్తితో కూడి, శ్రీమన్నారాయణాంశను పొంది అవనిపై అంజనేయుడై అవతరించాడు. అనేక కల్పములలో ఆ సదాశిపుడు అనేకావతారములను ధరించాడు. ఆయన అవతారములలో తొమ్మిది అవతారములు సుప్రసిద్ధములు. 

No comments:

Post a Comment