Sunday 3 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 32 వ భాగం



ఆనాటి పూజా పద్ధతులు


ఒక ప్రక్క కాపాలికం, కాలాముఖం, భైరవం లాంటి క్రూర పూజావిధానాలు విజృంభించాయి. శక్తి ఉపాసనలో వామాచారం మధువు, మత్స్యము, మాంసము, ముద్ర, మైథునాలతో సాగేవి. అసహ్యకరమైన ఈ చర్యలకు కొత్త కొత్త అర్థాలను చూపించి సమర్థించినవారూ ఉండేవారు.


సాత్వికపూజలతో బాటు తామసిక పూజలూ చాలాకాలం నుండి వస్తున్నాయి. కల్లు, మాంస నైవేద్యం, భయంకర నృత్యాలు మొదలైనవి నేటికీ సాగుతున్నాయి. ఇప్పటికీ ఆదివాసులు ఇట్టి నైవేద్యాలను అర్పిస్తూ పండుగలు జరుపుకుంటూ ఉంటారు.


దేవతారాధన పేరుతో కొన్ని భయంకరాచారాలు తంత్ర గ్రంథాలలో కన్పిస్తాయి. అందు సాధన, చేసినవారికి కొన్ని సిద్దులూ సంప్రాప్తిస్తాయి. ఈ ఉగ్ర లేదా క్షుద్ర దేవతలను ఆరాధించే సమయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా ఆ దేవతయే ఆ సాధకునికి హాని చేస్తుందని అంటారు. యోగాభ్యాసంలో కూడా సరిగా చేయకపోతే హాని కలగడం ఖాయం. మనసుకెట్టి వికారాలూ అంటకుండా, క్షోభ లేకుండా వీటిని ఆచరించడం, కత్తి అంచుమీద నడవడం వంటిది. బ్రహ్మవిద్య కూడా అట్టిదేయని ఉపనిషత్తులున్నాయి. రామకృష్ణ పరమహంస లక్ష్యాన్ని సాధించడానికి ఇవి కూడా మార్గాలే కాని ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రధాన ద్వారం గుండా కాక దొడ్డిదారి ద్వారా ప్రవేశించడం లాంటిది" అని అన్నారు. కనుక దొడ్డిదారి బాగుందని అనేవారు భయంకర ఆచారాలను బాహాటంగా ఆచరించకుండా ఉంటే మంచిది. కానీ తామాచరించడమే కాకుండా ప్రచారం చేయడం చేసిన కాలమది.


No comments:

Post a Comment