Monday 18 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 47 వ భాగం



కృష్ణుడు, సన్న్యాసి కాకపోయినా ఉపదేశం ఇచ్చాడు. కృష్ణుడు అనేక కార్యాల చేసాడు. ఆయన ద్వారకు రాజై ఏలాడు. పాండవులను అనేక పర్యాయాలు రక్షించాడు. అర్జునికి రథ సారథి అయ్యాడు. నరకునితో బాటు అనేక రాక్షసులను సంహరించాడు. ఇట్లా కృష్ణుడు చేసిన అసంఖ్యాకమైన పనులలో గీతోపదేశం ఒకటి. కలిలో ఇది సరిపోదని జీవితాంతము జ్ఞానానికే అంకితమైన సన్న్యాసి గురువే కావాలనుకున్నాడు. 


అనేక కార్యాలలో మునిగే గృహస్థులవల్ల ఈ పని సాగదు. ఎట్టి బాదరబందీ లేని సన్న్యాసియే జ్ఞానియై జ్ఞానోపదేశం చేయగలడని భావించాడు.

భారతదేశంలో అలుముకున్న అవైదిక మతాలను ఎదుర్కొని నిజమైన వేదాంతాన్ని బోధించవలసిన అవసరం ఏర్పడింది. దేశాటన చేయాలి. వాదాల నెదుర్కొనాలి. ఇట్టిది గృహస్థు చేయగలడా? అతడు తిరిగే పరివ్రాజకుడు కాగలడా? బ్రహ్మచారి అంతే వాసిగా గురువు దగ్గరే ఉండాలి. ఇక వాన ప్రస్థుడు, అరణ్యంలోనే ఉండాలి. అందుకే సన్యాసి అవతారం.


కృష్ణుడు, దేశం అంతా తిరిగి ఉపదేశించలేదు. అర్జునునకు, ఉద్ధవునకు మాత్రమే ఉపదేశించాడు. అన్నిటికీ ప్రభువునని తన విశ్వ రూపాన్ని చూపించాడు. అతడు పరమ పదాన్ని పొందిన తరువాత భగవంతునిగా అందరూ గుర్తించారు. ఇది భారత, భాగవతాదుల ద్వారా వెల్లడైంది. కనుక ఆ అవతారాన్ని ఏ ఆశ్రమానికి చెందినవాడని ప్రశ్నించనవసరం లేదు. అవసరం లేకపోయింది కూడా. తాను అవతరించినప్పుడు తాను దేవుడనని అన్నివేళలా ప్రకటించలేదు. మామూలు మనిషిగానే చాలా సందర్భాలలో ప్రవర్తించాడు.


No comments:

Post a Comment