Friday 8 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 37 వ భాగం

 

అసలవతార తత్త్వం


కృష్ణుడు తాను సూర్యునకు 'సనాతన ధర్మాన్ని' ఉపదేశించినట్లు అది చాలాకాలం సాగి క్రమక్రమంగా క్షీణించినట్లు దానిని మరల అర్జునునకు ఉపదేశిస్తున్నట్లు చెప్పాడు. ఇదేమిటయ్యా! నీవు నాకు కన్పిస్తున్నావు, యుగాల వెనుక ఉపదేశమిచ్చానంటావేమిటని అర్జునుడన్నాడు. 


"అపరం భవతో జన్మపరం జన్మ వివస్వతః

కథ మే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి"


దానికి సమాధానంగా “నీకూ నాకూ అనేక జన్మలు గడిచాయని, నేను వాటినన్నిటినీ ఎరుగుదనని, నీవెరుగవని" కృష్ణుడు అన్నాడు.


"బహూని మే వ్యతీతాని జన్మాని తవార్జున

తాన్యహం వేద సర్వాణి నత్వం చేత పరంతప"


అర్జునుడు తిరిగి ప్రశ్నించాడా? నాకున్నట్లే ఇతనికీ బహు జన్మలున్నాయని ఊరుకున్నాడా? అతడు గుర్తు పెట్టుకున్నాడులే అని ఊరుకున్నాడా?. ఎందుకు? ఎప్పుడు జన్మనెత్త వలసి వచ్చిందని అడిగాడా? గత జన్మల గురించి ఇప్పటికీ ఎట్లా గుర్తుందని అడిగాడా? ఇట్లా శంకించి భగవంతుణ్ణి ప్రశ్నిస్తాడా? మనకైతే సందేహం కల్గుతుంది. అర్జునుడు మానవుడు కనుక, గత జన్మ కర్మలు వెంటబడడం, జన్మలనెత్తడం ఉంటుంది కాని, భగవంతునకు కర్మలు - జన్మలూ ఉంటాయా? కర్మల వల్ల పుట్టుక ఉంటుందా? ఎందువల్ల భగవానుడు జన్మనెత్తవలసి వచ్చింది? ఇపుడు లీలగా జన్మనెత్తినట్లు అప్పుడూ లీలగా ధరించాడా? అనే ప్రశ్నలు మనవంటి వారికి వస్తాయి. 

No comments:

Post a Comment