Thursday 14 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 43 వ భాగం



మానవకారం చూసి మనకు సందేహాలు రాగా, మీ మాదిరిగా మాయలో పడనని, మాయనే తన ఆధీనంలో ఉంచుకొన్నానని చూపిస్తాడు. "ప్రకృతిం స్వామధిష్ఠాయ" అన్నాడు కదా! నేను పరబ్రహ్మనైతే మాయ, నా దగ్గర రాదు. అదైనా నా చెప్పు చేతలతో ఉంచుకుంటాను" అని అంటాడు.


ప్రళయానంతరం, జీవులు పుట్టాలి. పుట్టించాలి కదా! సత్త్వ రజస్తమో గుణాలతో ఉన్న మాయను సాయంగా చేసుకొని అవతారంగా వస్తానంటాడు.


మానవాకారంతో ఉన్నాడంటే, మాయతో ఉన్నాడని కాదు. దీనితో ఏదైనా చేస్తాడు. దీనిని పొమ్మని ఆత్మారాముడై యుండగలదు. కోపం ప్రదర్శిస్తాడేమిటి? అవి వస్తే రానీ, పోతే పోనీ, ఉంటే ఉండనీ, అవి లోనున్న నిజరూపంపై ప్రభావాన్ని చూపించగలవా అనే ధోరణిలో ఉంటాడు.


ఆత్మజ్ఞాని, దేహం గురించి ఏమీ పట్టించుకోలేదని వింటాం. లోనున్న ఆత్మను శీతోష్ణాదులేమీ చేయలేవని శాంతంగా ఉంటాడు. అయితే ఆత్మకంటె, మనస్సు భిన్నంగా ఉంది. బాధపడనీ, కోపబడనీ అని మనస్సనుకోదు. భగవానుడు కూడా మాయకు లోబడి యున్నట్లుగా జీవునిగా నున్నాడు. అయినా మనస్సును నియమించి ప్రత్యేకంగా మాయతో నున్న జీవునిగా ఉండకుండా, జ్ఞాని గానే ఉంటాడు. అటువంటప్పుడు మనస్సునెట్లా ఆహ్వానించి తన దగ్గరే ఉంచుకుంటాడు? కోపం, దుఃఖం మొదలగు లక్షణాలు కలిగిన మనస్సు నెట్లా తనంతట తాను ఇష్టం వచ్చినట్లుగా వెళ్లేదానినిగా చేస్తాడు? అతడు మాయకు అతీతుడు కనుకనే మాయకు లోబడకుండా తన అదుపులో ఉంచుకోగలడు. పరమాత్మ అనే స్థితినుండి ఎప్పుడూ దూరంగా ఉండదు. మహామాయ, జ్ఞానులను కూడా లోబరుచుకొంటుందని, దుర్గాసప్తశతిలో ఉంది. అట్టిది కూడా, అవతారం దగ్గర తలవంచవలసిందే. అందుకే మాయను (మనస్సును) రమ్మనగలడు, పొమ్మనగలడు కూడా.


No comments:

Post a Comment