Sunday 17 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 46 వ భాగం



'దుష్కృతాం' బదులు 'దుష్కృత్యానాం' అనాలి. అసంఖ్యాకమైన దుష్ట స్వభావాలుంటే వాటిని సంహరించవలసిన అవసరం లేదని అనిపించవచ్చు. ఇట్టి పర్యవసనాలకు దుష్ట భావాలనే విత్తనాలు మనసులో పుడుతున్నాయి. అవి కార్య రూపాన్ని ధరిస్తున్నాయి. వీటిని పెకలించగలగాలి. అపుడు ధర్మ మార్గం వైపు ప్రజలు నడుస్తారు. అపుడు ధర్మ సంస్థాపనం జరుగుతుంది. ' 


మనస్సును సరిదిద్దడం ఎలా? మంచి ఉపదేశాల వల్ల. వట్టి ఉపదేశం సరిపోతుందా? చెప్పే వాని ఆచరణ కూడా ఉండాలి. అందువల్ల పరమాత్మ, జ్ఞానిగా అవతరించాడు.


సన్న్యాసావతారం ఎందుకు?


సన్న్యాసులొక్కరే జ్ఞానులు కానవసరం లేదు. చండాలుడు, జ్ఞానియైతే అతడే గురువని శంకరులనలేదా? జ్ఞాని ఎక్కడోగాని ఉండదు. వారికి గురువుతో నిమిత్తం లేదు. ఇతరులకు ఒక పద్ధతి ప్రకారం ఉపదేశ గురువు బోధించి అర్హులుగా తీర్చిదిద్దాలి. అతడు ఉపనిషత్తులలోని మహావాక్యాలనందిస్తూ ఉండాలి. అన్నీ శాస్త్ర విరుద్ధంగా కన్పిస్తున్నప్పుడు శాస్త్రోపదేశం ద్వారా, క్రమశిక్షణాయుతులైన వారిని, శాస్త్రప్రకారం తీర్చిదిద్దాలి. శాస్త్రాలతో సంబంధమే లేకుండా ఎక్కడో ఒక జ్ఞాని యున్నా అట్టివానికి అవతారంతో సంబంధం లేకుండా ఉంటుంది. అట్టివారిని ఆదర్శంగా చూపితే అవతార ప్రయోజనం సిద్ధించదు. ఒక మూల వేదశాస్త్రాలపై దండెత్తేవారు కత్తులు నూరుతున్నారు. వారిని ఎదుర్కొనాలంటే వేదశాస్త్ర జ్ఞానం కలిగిన వారిని తీర్చి దిద్దవలసిందే. వేదశాస్త్ర పరిరక్షణ ముందుగా ప్రధానం. వేద తత్త్వమైన అద్వైతాన్ని అందించాలి. అందువల్ల అవతారమూర్తి సన్న్యాసం పుచ్చుకొన్న తరువాత జ్ఞానం సంపాదించినవాడుగా ఉండాలి.


జ్ఞానానికి అంకితమైనవారే భిక్షువులుగా ఉండాలని బౌద్ధ జైనాలలోనూ ఉంది.


No comments:

Post a Comment