Monday 4 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 33 వ భాగం



చిత్రమేమిటంటే దేవుణ్ణి గురించి మాట్లాడని బుద్ధుణ్ణి దేవతగా చేసి పూజించడం మొదలు పెట్టారు. ఈ మూర్తులను చూస్తే శాంత భావం మనలో ఉదయిస్తుంది. పూజలతో వారు ఆగలేదు. తరువాత భిక్షు సంఘాలు వచ్చాయి. ఎంతమంది సన్న్యాసులుంటే అంత ఘనతగా భావించారు. అర్హత, పరిపక్వమైన మనస్సు లేనివారు సన్న్యాసం తీసుకొంటే రకరకాల వికారాలు పుట్టడం సహజం. (స్త్రీలకూ సన్న్యాస దీక్ష మొదలైంది కూడా) కోరికలను తీర్చుకోవడంకోసం తాంత్రిక పూజలను మొదలు పెట్టారు. పూజలేని మతంలో పూజలు ప్రారంభమయ్యాయి. వీరిని చూసి మన మతంలో మనవారూ ప్రవేశపెట్టారు.


పాశుపతమతం, వైదికమని, అవైదికమని చీలింది. వైదిక పాశుపతంలో అసభ్యకరమైన పూజలు లేవు. అట్లాగే వైష్ణవ, భాగవత, పాంచరాత్రంలోనూ అసభ్యం లేదు. ఇక కాశ్మీర శైవ సిద్ధాంతంలోనూ వామాచారం లేక పోయినా పూర్తిగా వైదిక మతం కాలేకపోయింది. భక్తి ద్వారా ఏకాగ్రతను సంపాదించి అద్వైత జ్ఞానాన్ని పొందవచ్చని చెప్పింది. ఇది ఆద్వైతానికి దగ్గరగా ఉంటుంది. పూర్తిగా అద్వైతంలో ఉండదు.


వైదికం అంటే పూర్తిగా వేదాలను నమ్మితేనే


వేదంలో కొంత భాగాన్ని నమ్మి, కొంత దానిని నమ్మని మతాన్ని పూర్తి వైదిక మతమని అనలేం. ఇందు శివసూక్తాలున్నాయని పాశుపత మతాన్ని వృద్ధి చేసామని; విష్ణు సూక్తాలను గ్రహించి భాగవత పాంచ రాత్రాన్ని వృద్ధి చేసామంటే అది సరియైన వాదం కాదు. వేదంలో శివ, విష్ణువులని అన్నా అవి పరబ్రహ్మ వాచకములే, శివుడే పరమ దైవమన్నా, విష్ణువే పరమ దైవమన్నా ఇబ్బంది లేదు. కాని ఒకరికంటే మరొకరు తక్కువని నిందించుకోవడం వేద సమ్మతం కాదు. అందువల్ల ఆ మతాలు, అవైదికాలని పిలువ బడతాయి.


No comments:

Post a Comment