Friday 15 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 44 వ భాగం



మామూలు మానవుల మాదిరిగా కోపతాపాలను ప్రదర్శించగలడు. వేషం వేసినపుడు దానికి తగ్గట్టు చూపించాలి కదా! శరీరం ఫలానా రీతిలో ఉండాలని జ్ఞాని, దాని నెట్లు నియమించడో, అవతార పురుషుడు మనస్సు పట్ల కూడా అట్లా ప్రవర్తిస్తాడు. అతడు భావావేశానికి లోబడినట్లు కన్పిస్తాడు. ఇక మనం వాటికి లోబడతాం. కాని వాటికి అతడు లోబడడు, అదీ తేడా. తన పరమాత్మ స్థితిపై భావావేశాలు, ఆటంకాలు ఉండలేవు. అతడు మన మాదిరిగా క్రింద మీద పడుతున్నట్లు కనబడినా నిలద్రొక్కుకునే యుంటాడు.


అవతారం గురించి సందేహమేల?


అవతార పురుషుడు, దీనునిగా ఉన్నట్లు కన్పిస్తాడు. ఆ సందేహం రాకూడదని, మాయను ఆధీనంలో ఉంచుకొన్నానని గీతలో అన్నాడు. కాలడిలో నదీ గమనాన్ని మార్చినా, నర్మద వరదలను అడ్డుకున్నా, జ్ఞానం విషయంలో సర్వజ్ఞులైన శంకరులు మామూలు మనిషిలా ఎందుకు ప్రవర్తించారు? కాశీలో విశ్వనాథుడు, పంచముడిగా రాగా, అతడు స్వామియే యని శంకరులెందుకు గుర్తించలేకపోయారు? పొమ్మని ఎందుకన్నారు? తరువాత అతనికి నమస్కరించి ఉపదేశాన్ని ఎందుకు పొందారు? అట్టి సందర్భాలలో గీతా సూక్తులను గుర్తుంచుకోవాలి.


అవతార పురుషుని ఆధీనంలో మాయయున్నా, మాయ గుప్పిట్లో తానున్నట్లు కన్పిస్తాడు. అనుకుంటే వెంటనే దానిని తరమగలడు. సీతకోసం విలపించిన రాముడు, రావణుని సంహరించి నా ధర్మం నేను నిర్వర్తించాను. నీకూ నాకూ ఏ సంబంధం లేదని, ఇష్టం వచ్చిన చోటుకు పొమ్మని సీతతో అన్నాడు. అనగా ఒక తీవ్రదశనుండి మరొక తీవ్రదశకు చేరుకున్నట్లుగా కన్పిస్తాడు. ఇట్లా ఎందుకని మనం అవతారాన్ని ప్రశ్నించకూడదు.


ధర్మక్షయం


కృష్ణుడెందుకు అవతరించాడో శంకరులూ అందుకే అవతరించారు. క్రీ.పూ. 2500 నాటి భారత స్థితి, అవతరించడానికి అనువుగానే ఉంది. కృష్ణుని కాలంలో ప్రవృత్తి నివృత్తి ధర్మాలెట్లా క్షీణించాయో అట్టి పరిస్థితే, శంకరుల కాలంలోనూ ఉంది. కృష్ణుని కాలం కంటె, అవి ఎక్కువగా క్షీణించాయి. కృష్ణుని కాలంలో స్వర్గం నిమిత్తమై కర్మానుష్టానం ఉండేది. కర్మల విషయంలో వేదాలలో చెప్పిన వాటికి తగిన గౌరవం ఉండేది. శంకరుల కాలంలో వేదాన్ని విడిచి పెట్టారు. ఇక నివృత్తి మార్గంలో శూన్య సిద్ధాంతము చోటు చేసుకుంది. అది ఒక త్రిశంకు స్థితి వంటిది. అట్టి శూన్యబోధ, కృష్ణుని కాలంలో లేదు. అందువల్ల శంకరులవతరించవలసి వచ్చింది.


No comments:

Post a Comment