Friday 1 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 30 వ భాగం



జైన బౌద్ధాలందించిన సత్యాహింసలను అన్ని మతాలూ చెప్పాయి. మనుస్మృతిలో ఇవి లేవా? వీటిని చెప్పడానికి ప్రత్యేక శాస్త్రాలంటూ అక్కర్లేదు. అయితే ఆచరణలో పెట్టినపుడు కోరికలు బుస కొడతాయి. తత్త్వ విచారణ చేసేవారు వీటిని అదుపులో పెట్టగలరు. మిగిలినవారు చెడునుండి దూరంగా ఉండాలని కోరుతూ మంచిని ప్రసాదింపుమని ఈశ్వరుని వేడుకుంటారు.


బౌద్ధ జైనాలలో ఈశ్వరుడూ లేడు. వాటి తత్త్వాలు సామాన్యులకు బోధపడవు. వారు చెప్పిన నీతి సూత్రాలను పాటించడమూ కుదరదు. అందరికీ అన్ని నియమాలంటే కుదురుతుందా? సమానమైన హక్కులన్నారు. హిందూ మతంలో పక్షపాతంతో కూడిన వర్గ విభజన ఉందని ప్రచారం చేసారు. అయితే జినుడు, బుద్ధుడు తమ నడవడికల ద్వారా ఆనాటి ప్రజలనాకట్టుకున్నారు.


అయితే జినుడు, బుద్ధుడు తనువులు చాలించిన తర్వాత, వట్టి నడవడిక ప్రజలను ఆకట్టుకొనలేకపోయింది. సిద్ధాంతాలు, ఎట్లాగూ పట్టుబడవు. ఆ తర్వాతి వారు ఈశ్వరుణ్ణి నమ్మకపోయినా జైన, బౌద్ధ, జ్ఞాన సిద్ధుల విగ్రహాలని మలిచి ప్రజలముందుంచారు. ఇట్లా మూర్తి పూజ నేర్పాటు చేసారు. చివరకు మిగిలిందేమిటి? బుద్ధుడు, బోధి సత్వ విగ్రహాలు, జైన తీర్థంకరుల విగ్రహాలూ వెలిసి వాటిని ఆసరాగా తీసుకొని నడవండని, ఆ మతనాయకుల అనుయాయులు ప్రచారం చేసారు. పెద్ద పెద్ద విహారాలు, పెద్ద పెద్ద విగ్రహాలూ వచ్చాయి. ఇంతవరకూ హిందూ దేవతలను మ్రొక్కనివారు వీటికీ మ్రొక్కడం మొదలు పెట్టారు. అవి ప్రసాదించు, ఇవి ప్రసాదించు అనే మాటలు కూడా మామూలే. జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదింపుమని అడిగినా బాగుండేది. సామాన్యులకు అవి కావాలా? ఆ మూర్తులందించిన ఆదర్శాలపై దృష్టి పెడతారా? పెట్టరు. చివరకు వారి మందిరాలలో వాటినీ పూజించడం మొదలు పెట్టారు. దేవుడు లేడు, దెయ్యమూ లేదనే మతాలు, వారి మత నాయకులనే దేవతలుగా భావించిన పరిస్థితి వచ్చింది. ఇదంతా 2500 సంవత్సరాల వెనుక.


No comments:

Post a Comment