Wednesday 27 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 54 వ భాగం



సంహారం చేసాడంటే బాగానే ఉంది కాని మహావిష్ణువునకు పరిపాలించడమే ప్రధాన కృత్యమైనపుడు ఉపదేశం చేయవచ్చా? ఆ బాధ్యత పరిపాలించే రాజుకు పూర్తిగా లేదని భావించకూడదు. రాజు పాలనతోబాటు ప్రజలలో వినయాన్ని నేర్పాలని కాళిదాసు, రఘువంశంలో రాజులను గురించి "వినయా ధానాత్" అని అన్నాడు. అంటే జ్ఞానోపదేశమూ అతనిలో భాగమే.


అయితే అది అతని ప్రధాన కృత్యము కాదు. రాజు శాస్త్రాలను, శాస్త్రజ్ఞులను, జ్ఞానులను పోషించి నిర్వహింపచేస్తూ ఉంటాడు.


పురాణాలలో పెక్కుమందిరాజులు పెక్కు సందర్భాలలో ఉపదేశించినట్లున్న మాట వాస్తవమే. అయినా క్షత్రియుడు ధర్మాన్ని రక్షించాలే గాని ఉపదేశానికి అతడు పరిమితుడు కాకూడదు. అది బ్రాహ్మణ ధర్మము, యోగులు, జ్ఞానుల పని.


రాముడు క్షత్రియుడు, అయినా సాత్త్వికమైన లక్షణాలున్నవాడు. పరశు రాముడు బ్రాహ్మణుడైనా రాజసిక లక్షణాలున్నవాడు. ఇద్దరూ అధర్మాన్ని పోగొట్టారు. వామనుడు బ్రాహ్మణునిగా వచ్చి దానం పట్టాడు. అసురుని నెత్తిపై కాలు పెట్టాడు. అసుర రాజ్యానికి అతణ్ణి అధిపతిని చేసాడు. అయినా అక్కడ క్షత్రియ ధర్మాన్ని అనుసరించాడు. అది వేరే కథ.


మత్స్య, కూర్మ, వరాహ, నరసింహావతారాలకు వర్ణాలను అంట గట్టలేం. అయినా అవతారాలు క్షత్రియ ధర్మాన్నే అవలంబించారు. కూర్మావతారం, దేవతలు అమృతం సంపాదించుకొని మృతులు అవకుండా ఉండడానికి తోడ్పడింది. బలరామావతారం, కృష్ణునితో సంబంధం కలిగి ఉంది. కృష్ణావతారానికి బలం చేకూరుస్తూ బలరాముడూ దుష్టులను సంహరించాడు. కృష్ణుడు, సంహారంతో బాటు బ్రాహ్మణ ధర్మమైన ఉపదేశం చేసాడు. అదైనా అవతారం చివరి దశలోనే.


No comments:

Post a Comment