Wednesday 20 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 49 వ భాగం



పుట్టినప్పటి నుండీ సన్న్యాసి యైతే ఇక వేదకర్మలతో సంబంధం ఎట్లా వుంటుంది? ప్రజలకు వైదిక కర్మలపట్ల ఆసక్తిని కల్గించవద్దా? వర్ణ విభజన తప్పని వైదిక కర్మానుస్థానాలు అక్కరలేదనే కాలమది. పరిపక్వమైన మనస్సులు లేనివారికి ఒక్కమాటే జ్ఞానోపదేశం చేయడమా? ఒంటబడుతుందా? వేదశాస్త్ర ధర్మాలు ప్రజలందరికీ తెలియపర్చాలి. శాస్త్ర కర్మల పట్ల వారిలో అనురక్తిని కల్గించాలి. పుట్టుకతోనే సన్న్యాసి, ఆదర్శంగా ఉండలేదు కదా?

కనుక బ్రహ్మచర్మాశ్రమంలో ఉన్నారు. వేదాధ్యయనం, సమిధానం, భిక్షాచర్య, గురుసేవ, శాస్త్రాభ్యాసం మొదలైనవి చేసి సన్న్యాసం పుచ్చుకున్నారు. ఇట్లా బ్రహ్మచారి ఎట్లా ఉండాలో చూపించారు. ఇది లోకానికి ఆదర్శంగానే ఉంటుంది.


బ్రహ్మచర్య ఆదిగాగల నాలుగు ఆశ్రమాలు తప్పనిసరియని శాస్త్రాలనలేదు. బ్రహ్మచర్య దశలోనే నైష్టిక బ్రహ్మచారిగా ఉండి జీవితాంతం వేదాధ్యయనం చేస్తూ ఉండవచ్చు. లేదా తీవ్ర వైరాగ్యం ఉన్నవారికి సన్న్యాసం పుచ్చుకోవచ్చని జాబాలశ్రుతిలో ఉంది. కనుక బ్రహ్మచారిగా ఎనిమిది సంవత్సరాలుండి సన్న్యాసం గ్రహించారు.


బ్రాహ్మణ వంశంలో జన్మ


పూర్వావతారాలలో క్షేత్రధర్మం అవలంబించి శత్రు సంహారం చేయడానికి రామ, బలరామ, కృష్ణావతారాలలో క్షత్రియవంశంలో జన్మించి దుష్టులను సంహరించాడు.


కలిలో ఉపదేశం ప్రధానం కనుక, సాత్వికాచార్యునిగా ఉండాలి కనుక బ్రాహ్మణ వంశంలో జన్మించారు. పూర్వావతారాలలో క్షత్రియ ధర్మం, ఈ అవతారంలో బ్రాహ్మణ ధర్మం. కృష్ణుడెన్నో చిలిపి పనులు చేసాడు. అట్టిది జ్ఞానావతారంలో కుదురుతుందా? ఏ అవతారమైనా ధర్మ సంస్థాపనమే లక్ష్యం.


No comments:

Post a Comment