Wednesday 13 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 42 వ భాగం



ఆయన సామాన్య మానవునిగా ఉంటే కూడా ఆయన పనులను మనం పట్టించుకోం. ఈనాటికీ ధార్మికులనేకులున్నారు. వారిని పట్టించుకుంటున్నామా? ఇతరులపై వారు ప్రభావాన్ని చూపలేరు. మొత్తం జాతికంతటికీ ఉపయోగించే పనులు చేసే గాంధీ వంటి వారక్కడక్కడ ఉంటారు. అందువల్ల అవతారమూర్తిలో కొన్ని మానవ లక్షణాలుంటాయి. దైవ లక్షణాలు, దైవీశక్తుల ప్రదర్శన కూడా ఉంటుంది. అందువల్లనే అవతారం చాలించినా అట్టివాని ప్రభావం తరతరాల వరకూ ఉంటుంది. అందుకే చిన్ననాటినే శ్రీరాముడు తాటకను వధించడం, సుబాహువును చంపడం, రాజ్యాన్ని త్యాగం చేయడం, అరణ్యాలకు వెళ్ళమంటే సంతోషంతో వెళ్ళడం జరిగింది. ఆయనో దేవుడు, మనకు చాలా దూరంగా ఉన్నాడని జనులు భావించకుండా సీతాపహరణంలో విలపించాడు. మీరు సీతను చూసారా అని చెట్టును, పుట్టనూ అడిగాడు. ఇట్లా ఒక్కొక్కప్పుడు మానవునిగా, మరొక సందర్భంలో దేవునిగా ప్రవర్తిస్తూ ఉంటాడు.


ఆయన దేవుడు కదా, గొప్ప పనులు చేసాడు. మనమేమి చేయగలం? అని నిరుత్సాహ పడనవసరం లేదు. ఇంద్రియాలను నియమించి పవిత్ర జీవనం గడిపే వారు కూడా కొన్ని అద్భుత కృత్యాలు చేయగలరు. వారు యోగేశ్వరులైతే దేవతల కంటె మిన్నగా పనులు చేస్తారు కూడా. అట్టివారెందరో ఉన్నారు. ఇట్లా ప్రోత్సాహమీయడానికే దేవుడవతరిస్తాడు.


ప్రజలతో కలిసి మెలిసి యుండాలని తపన


సంకల్పం వల్ల ధర్మ సంస్థాపనం కాదు. తాను సృష్టించిన ప్రాణులతో కలిసి మెలిసి యుండాలనే తపనతో ఉంటాడు. ఈ సృష్టి అంతా అతని సంతానమే. పిల్లలతో తల్లిదండ్రులుండడానికి ఇష్టపడరా? అట్లాగే పరమాత్మ కూడా. పిల్లలెట్లా ఉన్నా వారితో ఉండాలనే ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారు. అతనికట్టి కోరిక కలిగియుంటే అతడు నిర్గుణ బ్రహ్మమైతే ఎట్లా మనం తెలిసికోగలం? మనకు తెలియని బ్రహ్మముతో మన కలయిక ఎట్లా? నాల్గు చేతులతో శంఖ చక్రాలతో కనిపిస్తే మనమాతనిని సమీపించగలమా? అట్టి మూర్తిని చూడగానే వరాలనడుగుతాం. లేదా వెంటనే మూర్చపోతాం. అందువల్ల మానవాకారాన్ని ధరించి వస్తాడు. అట్టి అవతారాన్ని ఒక బోయగాని, ఒక కోతిగాని, లేదా ఒక గొల్ల వనితగాని సమీపించగలరు. అతడు మానవుడని దగ్గరకు చేరుతారు. ఆ అవతారాలలో క్రోధం, దుఃఖం కూడా మానవుల మాదిరిగానే ప్రదర్శిస్తాడు. కనుక వీరు సమీపించగలరు. అంతకంటే అనంతమైన ప్రేమ, జ్ఞానం, సత్యం చూపుతూ ధర్మస్థాపన చేస్తాడు. ధర్మం క్షీణించినపుడవతరిస్తాడు.


No comments:

Post a Comment