Sunday 10 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 39 వ భాగం



అవతార రహస్యం - సూచన


'ప్రకృతిం స్వామధిష్టాయ' ప్రకృతిని వశం చేసుకొని అని ఎందుకన్నాడు? మరొక చోట గీతలో 'ప్రకృతిం స్వాం అవష్టభ్య' అని ఉంది. దాని అర్థమూ పై మాదిరిగానే. ఆ రెండింటికీ 'వశీకరించుకొని' అని శంకరులు వ్యాఖ్యానం చేసారు. ముందు తానట్లా జన్మ నెత్తినట్లు, రెండవచోట జన్మలను ప్రాణులకు ప్రసాదిస్తున్నానని అన్నాడు. ప్రకృతి యొక్క సాయంతో ప్రకృతి యొక్క స్వాధీనంలో ఉన్న ఈ సమస్త భూత సముదాయాన్ని మళ్ళీ మళ్ళీ పుట్టిస్తున్నాడు.


ఇక్కడ ధర్మం కోసం జన్మల నెత్తుతున్నాని చెప్పి ఊరుకోవచ్చు. లేదా ప్రలయంలో అన్నీ లీనమైన జీవులు, తమ తమ కర్మలననుభవించడానికి మరల పుట్టిస్తున్నానని చెప్పవచ్చు. రెంటిలోనూ ప్రకృతినే వశం చేసుకొని అని ఎందుకన్నట్లు?


ఇక్కడే అవతార రహస్యం వస్తుంది. అందువల్ల దానిని తెలియజేయడం కోసం, అట్లా అన్నాడు.


కేవలం సంకల్పం వల్ల సృష్టించవచ్చు కదా! అని మరొక ప్రశ్న. ధర్మం క్షీణించింది, ప్రజలు బాధ పడకూడదని ప్రజలు ధార్మికులుగా జీవించాలని అనుకోవచ్చు. సంకల్పం చేస్తే చాలు కదా! జన్మలేనివాడు జన్మనెత్తడమేమిటి? నామ రూపాలు లేనివాడు, నామరూపాలతో అవతరించడమేమిటి? అతడు సచ్చిదానందుడైనా మన మాదిరిగా కోపతాపాలు, శృంగారం, మొదలైనవి ఏమిటి? ఏ వైకుంఠంలోనో కూర్చొని సంకల్ప బలం ఉపయోగించవచ్చు కదా! ఇట్టి ప్రశ్నలు వస్తాయి.


No comments:

Post a Comment