Tuesday 5 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 34 వ భాగం



వేదాలలో యజ్ఞాలు, వాటిలో హవిస్సుల నర్పించుట; అవి వివిధ దేవతలకు చెందుట అనే ప్రక్రియ వైదికము. ఇందొక దేవతకే అర్పిస్తాను, ఇంకొక దేవతకు అర్పించననడం అవైదికం. ఒక దేవతను ఇష్టదైవంగా ఆరాధించడంలో తప్పులేదు. ఇక కర్మకాండ దగ్గరకు వచ్చేటపుడు శ్రుతి, స్మృతులలలో చెప్పబడినట్లే చేయాలి. ఒక దేవత పట్ల ప్రత్యేకాభిమానము, మరొక దేవత పట్ల దురభిమానాన్ని ప్రకటించడానికి వీలు లేదు.


40 సంస్కారాలే స్మృతులలో చెప్పబడ్డాయి. దానికి మించి అనుసరిస్తే అది అవైదికమే. శంఖం, చక్రం, త్రిశూలం, ఋషభం వంటి ముద్రలను శరీరంపై ముద్రాధారణం, వైదికం కాదు. అవైదికమే అనాలి. ముద్రాధారణ జరిగితేనే శైవునిగానో, వైష్ణవుని గానో పరిగణిస్తామని అనడం శాస్త్రసమ్మతం కాదు.


నాకు భక్తే ప్రధానం, వర్ణాశ్రమాలలో పని లేదన్నా ఆ పద్ధతి కూడా అవైదికమే.


కేవలం తత్త్వాన్నే గ్రహిస్తాం, మిగిలిన వాటిని పట్టించుకోం అని కొందరంటారు. కర్మకాండ, భక్తి, తత్త్వవిచారణ మొదలైన అంశాలన్నీ ఎవరికి ఏ దశలో, ఏ స్థితిలో చెప్పారో గ్రహించుకొని నిర్ణయానికి రావాలే గాని, తమ కిష్టం కాని దానిని విసర్జిస్తామని, మాకా వేదాంతమే ప్రధానమని, అందలి వర్ణాశమ్రాలు నేటి సమాజంలో పనికిరావని వాదించేవారిని వైదికులని ఎట్లా అనగలం? వేదం అందించిన మార్గాన్ని పట్టుకోలేకపోతే అదీ అనవసరం అనడం సబబు కాదు.


ఏది వైదికమో, ఏది అవైదికమో భారతమే నిర్ణయించింది. వివరాలకై అమృతవాణి-1, పుట 55 చూడండి) అయినా సూక్ష్మంగా అందిస్తా.


No comments:

Post a Comment