Monday 11 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 40 వ భాగం



అసలు సృష్టే లేకుండా సంకల్పం వల్ల చేయవచ్చు. ఆదిలో సచ్చిదానందుడై లేడా? అతడాతృప్తితో ఉండకుండా లీలగా మాయ యొక్క సాయంతో ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ప్రలయంలో లీనమైన జీవులను మరల సృష్టించడం, వారు జనన మరణ ప్రవాహంలో ఇరుక్కోవడం ఏమిటి? అయినా అతని సంకల్పాన్ని, చేష్టను అర్థం చేసుకోలేం. ఏదో ఒక కారణం వల్ల సృష్టిస్తున్నాడు. ఏం జరిగింది? వేదాంతంలో, చివరి మాట ప్రకారం అసలు సృష్టే లేదు. అంతా కల్పనే. (దీనిని అజాత వాదం అంటారు) మాయా విలాసం ఎందుకుండాలి? వీటినన్నిటికీ లీలయని చెప్పగలం.


భగవానుని స్వభావం తెలియదు. శాంతంగా ఉండిపోవచ్చు. శాంతంతో ఉంటూనే ఆట ఆడిస్తున్నాడు. సృష్టికి అంతం అంటూ లేదు. దానిని ముగించడు. ప్రలయం వచ్చేవరకూ ఆట సాగుతూనే ఉంటుంది.


సంకల్పంతోనే ధర్మ సంస్థాపనం చేయవచ్చు. లేదా సృష్టికి చాపచుట్టవచ్చు.


అధర్మం ప్రబలి, ధర్మం నాశనమవుతూ ఉంటే ధర్మ సంస్థాపనం కొనసాగాలనుకున్నాడు. ఈ పని, శాశ్వతంగా ఉంటుందా? ఇట్లా జరిగితే ఈ నాటకం భిన్న భిన్న రసాలతో, సన్నివేశాలతో ఉండకుండా విసుగు కల్గిస్తూ ఉంటుంది. ఒక పెద్ద త్రాటిని అటూ ఇటూ కొంతసేపు లాగుతూ ఉంటారు. ఒక్కసారి ఒక పక్షమే లాగితే ఇంక వినోదమేమిటి? అటూ ఇటూ లాగుతూ ఉంటేనే ఆట. అందరూ ధర్మాన్ని ఆచరించి మోక్షం పొందితే ఇక సృష్టేమిటి? అసలు ప్రపంచం మిశ్రలోకం. అంటే ఇందులో మంచి, చెడు, రెండూ ఉంటాయి. అసుర లోకం అంతా కశ్మలంగా, దేవగంధర్వ లోకాలు సంతోషమయంగా; తపోలోక సత్యలోకాలు శాంతిమయంగా ఉంటాయి. దానికి భిన్నంగా ఈ మిశ్ర లోకాన్ని సృష్టించాడు. ఈ జీవులకు కొంత స్వేచ్ఛను ప్రసాదించాడు. ఆట సాగించాడు. ఈ మిశ్ర లోకం, అమిశ్రలోకమై ధర్మలోకమైనపుడు ఇక నాటకాన్ని శాశ్వతంగా మూయవేయవలసి వస్తుంది.


అందరూ మోక్షాన్ని పొందితే ఇక సృష్టి సాగడమేమిటి? నేను సృష్టించిన దానిని ప్రాణులే మూసేస్తారా అని అనుకోడా? నేనే ఆ పని ఎందుకు చేయకూడదని భావించడా?


No comments:

Post a Comment