Saturday 23 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 52 వ భాగం



పరమేశ్వరుణ్ణి ఈశ్వరుడని అనడం చాలా కాలం నుండి యుంది. అమర కోశంలో "ఈశ్వరః శర్వ ఈశానః" అని యుండగా; కాళిదాసు, రఘువంశంలో


"హరిర్యధైకః పురుషోత్తమః స్మృతః 

మహేశ్వరః త్ర్యంబక ఏవ నాపరః"


విష్ణువును పురుషోత్తముడని అన్నట్లు, ముక్కంటిని మహేశ్వరుడని అంటున్నారని వ్రాసేడు. కాని పరమశివుణ్ణి పురుషోత్తముడని అనం. పురుషోత్తముడు విష్ణువు. భగవానుడు విశ్వరూపాన్ని చూపించేటపుడు విష్ణువుగా, రక్షకునిగా, పోషకునిగా కనబడ్డాడా? లేదు. ప్రలయకాలంలోని రుద్రరూపంతోనే కనబడ్డాడు.


"కాలోఽస్మి క్షయకృత్ ప్రవృద్ధః" (11-32)


అనగా నేను కాలుణ్ణి, లోకాలను నాశనం చేయగలవాడని అన్నాడు. ఇది అతిశయోక్తి. ప్రపంచాన్ని దగ్ధం చేశాడా? కృష్ణ అవతార సమాప్తికి ముందు కౌరవనాశం, తరువాత యాదవనాశం జరిగినా మిగిలియున్నాడు. ఎందుకిట్లా అన్నాడంటే యుద్ధం చేయనని భీష్మించుకొన్న అర్జునునకు ప్రోత్సాహం కల్గించడానికే. నీవు లేకపోయినా నేను ఈ పనిని చేయగలనని, నీకు కీర్తి రావడం కోసం నిన్నొక సాధనంగా వాడుకుంటున్నానని అన్నాడు. అందుకై అట్లా అతిశయోక్తితో చెప్పవలసి వచ్చింది. మనమేదైనా పుణ్యకార్యం తలబెట్టి, దానికి ఒక వెయ్యి రూపాయలను కావాలనుకుని చందాకై వెడితే, ఎవరైనా ఇవ్వనంటే నీవీయకపోతే వెయ్యికాదు, లక్ష రూపాయలను నేను ఇవ్వగలను అంటాము. ఇక్కడ కావలసింది వేయి కాని లక్ష కాదు. అట్లాగే కొంతమంది దుష్టులను సంహరించవలసి వచ్చినపుడు, మొత్తం నేనే సంహరిస్తానని అనడం అటువంటిది. సంహారకృత్యం, రుద్రునిదైనా ఇందులో భేదాన్ని సూచించాడు. 'యోగమైశ్వరం' అనినపుడు ఈశ్వరయోగాన్ని చూపిస్తానని సంహార కృత్యాన్ని చేస్తానని అన్నాడు.


No comments:

Post a Comment