Saturday 16 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 45 వ భాగం



గీత ఇచ్చిన అభయం- సమస్య పరిష్కారం -


గీతలో సాధువుల్ని రక్షించడం, దుష్టులను శిక్షించడం అవతార ప్రయోజనమని యుంది.


శంకరుల కాలంలో సత్పురుషులను రక్షించనవసరం లేకపోయింది. పూర్వకాలంలో సత్పురుషులెక్కువగా ఉండేవారు కనుక వారిని ఈశ్వరుడు రక్షించవలసి వచ్చింది. కాని కలిలో సత్పురుషులే తక్కువ. వీరిని రక్షించడం తేలికే. ఇక దుష్టులను సంహరించడమేమిటి? పూర్వావతారాల కాలంలో అసుర రాక్షసులు, క్రూరమైన రాజులు, వారి సహచరులూ చాలామంది ఉండేవారు కనుక విడిగా గుర్తించి వారిని సంహరించడం జరిగింది.


మరీ శంకరుల కాలంలో ఆనాడు రాక్షసులులేరు. కంస, జరాసంధుల వంటివారు లేరు. అసుర లక్షణాలు కలిగిన దుర్యోధనుని వంటివారు కృష్ణుని కాలంలో కంటె శంకరుల కాలంలో ఎక్కువగా ఉన్నారు. మంచిగా కనబడుతూ అధర్మాన్ని పాటించేవారే ఎక్కువగా ఉండేవారన్నమాట. కొంతమందిని మినహాయిస్తే అధర్మమే ఎక్కువగా ప్రబలియుంది కనుక ఇట్టి వారిని విడదీసి సంహరించడం అంటూ కుదరదు. దుష్టులను సంహరించడం అనే మాటను పాటిస్తే అందర్నీ సంహరించవలసి వచ్చేది. అపుడు ధర్మ సంస్థాపనమెట్లా అవుతుంది? రాబోయే ప్రలయాన్ని ముందే ఆహ్వానించినట్లే కదా!


విశ్వామిత్రుడు యాగం చేసేటపుడు కొందరు రాక్షసులు రావడం, రాముడు సంహరించడం, యాగ సంరక్షణ జరిగింది. ఆ విశ్వామిత్రుడే కలియుగంలో పుడితే అతనికి యాగం చేయాలనే సంకల్పమే ఉండదు.


కనుక కలిలో దుర్మార్గులను చంపడం కాదు. దుర్మార్గ ప్రవృత్తిని సంహరించాలని పరమేశ్వరుడు భావించాడు. చెడ్డ వారనుటకు బదులు చెడ్డ పనులను అని సవరించాలి.


No comments:

Post a Comment