Saturday 9 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 38 వ భాగం



అర్జునుడడగకపోయినా మనవంటివారికి అట్టి సందేహాలు కలిగాయని కృష్ణుడు ఇట్లా జవాబిచ్చాడు "నాకు జన్మ లేకపోయినా, అనంత శక్తులతో కూడిన స్వభావం కలవాడినై అన్ని ప్రాణులను నియమిస్తూ, స్వీయ ప్రకృతిని వశం చేసుకుని నా మాయవల్లనే అవతరిస్తున్నా"నని అన్నాడు.


అజోఽపిసన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపిసన్

ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా   

ఇక ఎందుకు జన్మనెత్తాడో సమాధానం చెబుతున్నాడు. ఎపుడు ధర్మానికి పతనం, అధర్మానికి అభివృద్ధి ఉంటుందో అపుడు నేను నా శరీరాన్ని సృష్టించుకుంటానని అన్నాడు.


ధర్మం పతనమైతే సత్పురుషులకు రక్షణ ఉండదు కనుక, వారిని రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం అవతరిస్తానని అన్నాడు:


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే


ఇట్లా ధర్మాన్ని స్థాపించినా మరల అసుర శక్తులు విజృంభిస్తూ ఉంటాయి. కనుక స్థాపనంతో సరిపెట్టక సంస్థాపనమన్నాడు. అంటే బాగుగా స్థాపించుట. అది కొంతకాలం ఉంటుంది. మరల అసురల శక్తుల విజృంభణం. అందుకే యుగ యుగాలలోనూ ఉన్నాడు. అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం కాదు. ఎన్ని యుగాలు రానీ, ఎన్ని సృష్టులు రానీ, విసుగు చెందకుండా మళ్ళీ మళ్ళీ అవతరిస్తానని అర్థం చేసుకోవాలి. శ్లోకం, యుగంతో ఆరంభం కాలేదు. ఎప్పుడు ధర్మానికి పతనం అధర్మానికి అభివృద్ధి ఉండవో అన్నవాడు, ఒక్క యుగంలోనే అంటాడా? ప్రకృతికి బద్ధులై మిగిలినవారు పుడతారు. తానేమో ప్రకృతిని వశం చేసుకొని పుడతానన్నాడు. అదీ తేడా.


No comments:

Post a Comment