Wednesday 18 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 74 వ భాగం



ఇప్పుడు మంచి చేసినా చెడు చేసినా ప్రయోజనం లేదు గాబట్టి నిష్క్రియత్వాన్ని బోధించడమే మంచిదని సంకల్పించాడు. దానికై శంకరావతారం వచ్చింది. అయితే, ఎన్నో వ్రతాలు, ఉపవాసాలు చేసి శంకరులు తల్లిదండ్రులు వీరిని కన్నారు. కాని విధవయైన తల్లిని వదిలి సన్న్యాసం పుచ్చుకొనవలసి వచ్చింది. తరువాత మండన మిశ్రులను ఓడించడం, శిష్యునిగా చేసుకుని సన్న్యాసిగా అతణ్ణి మార్చడం వల్ల అతని భార్యకు దుఃఖాన్ని కలిగించడం జరిగింది. కనుక ఇందులోనూ మంచి చేయడం వల్ల కొందరికి కష్టాలెదురయ్యాయి. అందువల్ల నిష్క్రియాన్ని ఉపదేశ రూపంలో ఇచ్చారు. మేము చెప్పేదే సత్యం, మంచి జరుగుతుందని అనేక మతాలను చాలామంది బోధించారు. అనేక సిద్ధాంతాల వల్ల ప్రజలలో సంశయాలేర్పడ్డాయి. దేనిననుసరించాలో తెలియని స్థితి. నిష్క్రియంగా ఉండడమే అన్నిటికంటే మేలని అదే మోక్షానికి దారి తీస్తుందని ఉపదేశించారు.


ఒకనికి మంచి చేద్దామనుకున్నాం. మనం అనుకున్నది చేయగలమా? ఫలదాతయైన ఈశ్వరుడున్నాడు. అతడు సంకల్పించకపోతే మనమా పనిని చేయగలమా? ఇతరుల కర్మ గురించి మనకు తెలియదు. పాప కృత్యాల వల్ల అతడట్లా బాధపడవలసి వచ్చిందేమో! కనుక ఎంత మంచి చేద్దామన్నా ఒకప్పుడు సాధ్యం కాదు.


నిత్య జీవితంలో సత్కర్మ ఫలాలు


మరొక విధంగా అనుకుందాం. అవతలివాని సమస్య మన సాయం వల్ల ఎందుకు పరిష్కారం కాకూడదు? నిత్య జీవితంలో పరస్పర సహకారం ఉండాలి కదా! కొన్ని సందర్భాలలో చేయవలసినది చేయకపోయినా చాలా వాటిల్లో కృతకృత్యులమౌతున్నాం. కనుక నిరాశానిస్పృహలతో ఉండేకంటె ప్రేమను, దయను చూపించవద్దా? బాధపడనీ నాకేమిటి సంబంధం అని ఊరుకుంటామా?


No comments:

Post a Comment