Friday 20 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 76 వ భాగం



కర్మలో మునుగుట లక్ష్యము కర్మరహిత స్థితి


చాలా పనులు చేయవలసి వస్తే వాటిని క్రమపద్ధతిలో చేస్తాం. ఉన్నది. ఒక్కటే అయినపుడు క్రమ పద్ధతి యొక్క అవసరమే ఉండదు. ఆ ఒక్కటే ఉన్న స్థితిలో రెండవవాడు లేడు, సాధనం లేదు, క్రియ లేదు. అయితే నిత్య వ్యవహారమంతా క్రియలతో కూడింది. క్రియ లేకుండా ఎట్లా ఉండగలమని ప్రశ్నించడం కాదు. ప్రాథమిక దశలో కర్మయోగం ఉండాలని గీతలో ఉంది కదా! ఉన్నతస్థితిలో ఏ పనీ లేదనీ ఉంది. "తస్య కార్యం నవిద్య తే" అయితే చివరి మాటను మొదటినుండీ మరిచిపోకూడదని, క్రియారహిత స్థితిని గీతలో ముందే వివరింపకపోలేదు.


లోకంలో మనం మంచి పనులు చేస్తున్నాం. తగిన లాభాన్ని పొందుతున్నాం అంటారు. అది అహంకారాన్ని సూచించడం లేదా? ఆ అహంకారాన్ని అణచడం కోసం ఏ మంచి చేసినా కొంత చెడు జరుగుతూ ఉండడాన్ని పరాశక్తి ఏర్పాటు చేసింది. లేకపోతే చేసేవాడి అహంకారాన్ని పట్టుకోలేం. మంచి చెడులు, సాపేక్షికం. ఓటములు తటస్థిస్తున్నాయి. సాయంలో కొందరికి అపకారాలు అందుకే జరుగుతున్నాయి.


ఇట్టి మాటలు నిరాశావాదాన్ని కల్గించడం కోసం కాదు. చేసే కర్మలవల్ల ఇట్టి లోపాలు రావడం వల్ల కర్మ రహిత స్థితి కొంతవరకూ ఏర్పడుతుంది. లేకపోతే ద్వంద్వ ప్రపంచంలో కూరుకొని పోతాం. అపజయాలు, ఎదురౌతున్నకొద్దీ ఈశ్వరుడే నడిపిస్తున్నాడని, మనచేత అతడు సాయం చేయిస్తాడనే భావన కల్గుతుంది. జ్ఞానికి, ఏ పని లేదని చెబుతూ జనకుడు మొదలైనవారు, వారే జ్ఞానులైనా లోక సంగ్రహం కోసం మంచి పనులు చేసారని గీతలో చెప్పాడు. కర్మ, మనచేత చేయిస్తే చేద్దాం. మనం చేస్తున్నామని కాక మన చేత చేయిస్తున్నాడనే భావనతోనే చేస్తూ ఉండాలి. ఏదో సేవ చేయడం, త్యాగం అని పైపైన కనబడినా ఏదో ఒకమూల అహంకారం పొడసూపుతూనే ఉంటుంది. అది పోనంతవరకూ మోక్షమనే మాట కల్ల. 


No comments:

Post a Comment