Friday 20 March 2015

ఉగాది ఎలా జరుపుకోవాలి?

ఉగాది ఎలా జరుపుకోవాలి?

ఉగాది నాడు తెల్లవారుఝామునే (సూర్యోదయానికి గంటన్న ముందు) నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్వచ్ఛమైన నువ్వుల నూనెను శరీరానికి, తలకు పట్టించుకుని, నలుగు పిండితో అభ్యంగన స్నానం చేయాలి.

స్నానం చేశాక కొత్త బట్టలు/కొత్త బట్టలు కొనే పరిస్థితులు లేకపోతే ఉతికిన బట్టలు, ఆభరణాలు ధరించాలి. కొత్తబట్టలు ధరించాక మీ ఇష్టదైవాన్ని(వినాయకుడు, శివుడు, కృష్ణుడు, రాముడు........ఇలా మీకు ఎవరంటె ఇష్టమో వారిని) పూజించాలి. పూజ చేయడం రాకపోతే ఒక స్తోత్రం చదవండి, అది రాకపోతే ఆ దేవుడి నామం/ పేరును చెప్పినా చాలు. భక్తితో ఒక్క నమస్కారం చేసినా చాలు, దేవుడు ఆనందిస్తాడు.  

ప్రజలంతా ఉగాది రోజు తమ కుటుంబసభ్యులతో కలిసి వేపచెట్టుకు పసుపుకుంకుమ పూసి, దాని చుట్టు ప్రదక్షిణ చేసి దానినుండి వచ్చే ప్రాణవాయువును తృప్తిగా, దీర్ఘంగా పీలుస్తూ ఆ చెట్టునుండి వేప పువ్వును సేకరించుకుని ఇంటికి తెచ్చుకోవాలి. వేపగాలి పీల్చడం వలన గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మెదదు మొదలైన ప్రధాన భాగాలు చైతన్యవంతమై వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

వేప పచ్చడి/ఉగాది పచ్చడిని పరకడుపున (అంటే ఖాళీ కడుపున) ఉదయం 8 గంటలలోపు సేవిస్తేనే దాని ఔషధ గుణాలు శరీరాన్ని రోగరహితం చేస్తాయని ఆయూర్వేద గ్రంధాలు చెప్తున్నాయి.

సాయంత్రం స్థానిక దేవాలయంలో కానీ, లేక ఇతర పవిత్ర ప్రదేశంలో కానీ పంచాంగశ్రవణం చేయాలి. శ్రవణం అంటే వినడం అని అర్దం. కొత్త ఏడాదిలో దేశం ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఏలాంటి ఫలితాలుంటాయి, పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా పడతాయి...... మొదలైఅనవన్నీ పంచాంగశ్రవణం లో చెప్తారు. పంచాంగశ్రవణం చేయడం వల్లనే అనేక దోషాలు తొలగిపోతాయి. గంగా స్నానం చేసిన పుణ్యం వస్తుంది.

దేవాలయంలో కానీ, సాంస్కృతిక కూడలిలో కానీ పంచాంగ శ్రవణం చేయాలి. జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించి తిధి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనే 5 ని "పంచ అంగములు" అంటారు. వీటిని వివరించేదే పంచాంగం. పంచాంగం ఉత్తరముఖంగా కూర్చుని వినాలని శాస్త్రం.

పంచాంగశ్రవణంలో సంవత్సర ఫలితాలు, సంక్రాంతి పురుషుడు, నవనాయకులువంటి వారితో పాటు వివిధ రాశులవారి ఆదాయ, వ్యయాలు, రాశిఫలాలు చెప్తారు. పంచాంగ శ్రవణంలో నవగ్రహాలను స్మరించడం వలన చాలా రకాలుగా సత్ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోంది.

పంచాంగ శ్రవణం ఫలితంగా సూర్యుడివల్ల శౌర్యం, చంద్రుని వల్ల వైభవం, కుజుడి వల్ల సర్వ మంగళాలు, బుధుడివలన బుద్ధి వికాసం, గురువు వలన జ్ఞానం, శుక్రుడి వలన సుఖం, శని వలన దుఖఃరాహ్యితం, రాహువు వలన ప్రాబల్యం, కేతువు వలన ప్రాధాన్యత లభిస్తాయి.
Originally posted: 30-03-2014
1 St Edit : 20-03-2015

No comments:

Post a Comment