Monday 1 November 2021

శ్రీ హనుమద్భాగవతము (64)



ఇట్లు పవనకుమారుని గుణములను కీర్తిస్తూ సర్వ వానరులను సీతాన్వేషణార్థమై ఆదేశించి సుగ్రీవుడు శ్రీ రాముని సమీపమున కూర్చున్నాడు. వీరులైన వానరులు, భల్లూకములు కమలనయనుడైన శ్రీరాముని చరణములకు ప్రణమిల్లి పయనమయ్యాడు. చివరకు హనుమానుడు ప్రభువు సమీపమునకు చేరాడు. అప్పుడు శ్రీరాముడు వానితో ఇట్లు పలికాడు – 'వీరవరుడా! నీ ప్రయత్నము, ధైర్యము, పరాక్రమము సుగ్రీవుని సందేశము అనే విషయములను బట్టి నీ వలన నా పని తప్పక నెఱవేరునని నాకు తోచుచున్నది, నీవు నా ఈ ఉంగరమును తీసుకో. దీనిపై నా నామాక్షరములు చెక్కబడియున్నవి. దీనిని నా గుర్తుగా ఏకాంతమున సీతా దేవికి ఇవ్వు. కపిశ్రేష్ఠా ! ఈ కార్యమునకు నీవే తగిన వాడవు. నీ బుద్ధిబలము గూర్చి నాకు చక్కగా తెలుసు. మంచిది, వెళ్ళు, నీకు శుభము కలుగుగాక !


(అభిజ్ఞానార్థ మేతన్మే అంగులీయకముత్తమమ్ | 

మన్నామాక్షరసంయుక్తం సీతాయై దీయతాం రహః || 

అస్మిన్ కార్యే ప్రమాణం హి త్వమేవ కపిసత్తమ | 

జానామి సత్త్వం సర్వం గచ్ఛ పంథాః శుభ స్తవ || (వా. రా. 4-6-28,29)


పవనకుమారుడు ఎంతో ఆదరముతో రాముని ముద్రికను తీసుకుని, ఆయన చరణకమలములకు నమస్కరించాడు. భక్తవత్సలుడైన శ్రీ రాముని కరకమలము స్వయముగా హనుమానుని శిరముపైకి వెళ్ళినాయి. అతికష్టముతో హనుమానుడు లేచాడు. పవిత్రమైన ప్రభువు చరణధూళిని అతడు తన శిరమున ఉంచుకొని, ఆయన దివ్యమూర్తిని తన హృదయములో నిలుపుకొని అతడు ఉత్సాహముతో బయలుదేరాడు. అతడు నిరంతరము శ్రీరామ నామమును జపించుచుండేవాడు.


హనుమానుడు స్వయంప్రభను గలిసికొనుట


ఆంజనేయుడు వానరసమూహముతో కలిసి సీతా దేవిని వెదకుతూ గహనమైన వింధ్యారణ్యమునకు వెళ్ళాడు. దట్టమైన ఆ అరణ్యమున ముళ్ళతో కూడి ఎండిపోయిన చెట్లు తప్ప నీరనునది ఎక్కడ కూడా కనబడలేదు. వానర భల్లూక సమూహము ఇటునటు తిరుగుట చేత ఎంతో దప్పికను పొందాయి. వారికి నీరెక్కడ కనిపింపలేదు. దప్పిక చేత వారికంఠములు ఎండిపోతున్నాయి. కాని జ్ఞానులలో శ్రేష్ఠుడు, సంకట మోచనుడైన ఆంజనేయుడు వారి వెంట ఉన్నాడు. ఆయన ధైర్యముతో నలువైపుల చూశాడు. కొద్ది దూరములో ఆయనకు తృణగుల్మలతాదులచే కప్పబడిన ఒక విశాలమైన గుహ కనిపించింది. ఆయన దాని నుండి హంసలు, క్రౌంచపక్షులు, బెగ్గురు పక్షులు, చక్రవాకములు మొదలైన పక్షులు బయటకు రావటం చూశాడు. ఆ పక్షుల రెక్కలు తడిసియున్నాయి. దానివలన అక్కడ నీరున్నట్లు ఆయనకు అనుమానము కలిగింది. వెంటనే అందఱు అక్కడికి వెళ్ళవలసిందని ఆయన వారితో చెప్పాడు, దుర్గమములైన అరణ్యముల విషయము తెలిసిన ఆ హనుమంతునితో కలిసి వానర భల్లూక వీరులు ఒకరి చేతినొ ఒకరు పట్టుకొని మెల్లమెల్లగా గుహలోనికి ప్రవేశించారు. 

No comments:

Post a Comment