Sunday 7 November 2021

శ్రీ హనుమద్భాగవతము (69)



ఇట్లా యువరాజైన అంగదునకు ధైర్యము చెప్పిన తర్వాత మహాపరాక్రమశాలీ, రామదూత అయిన హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు మొదలైన వానరులతో కలిసి సీతా దేవిని అన్వేషిస్తూ మెల్లమెల్లగా దక్షిణ సముద్ర తటముపై గల మహేంద్రపర్వతము యొక్క లోయలోనికి చేరుకొన్నాడు. అచట ఎదురుగా అగాథమైన హద్దులేని మహాసాగరంలో భయంకరమైన అలలను చూసి వానరులు భల్లూకములు భయపడిపోయారు. సీతాన్వేషణార్థమై సుగ్రీవుడు ఇచ్చిన ఒక మాసము గడువు కూడా పూర్తి అయ్యింది. ఎదుట మహాసముద్రము. వీరులైన వానర భల్లూకముల బుద్ధి పనిచేయడం ఆగిపోయింది. అందువలన వానరరాజైన సుగ్రీవుని కఠోర దండనమును గురించి ఆలోచించి వారు ఇలా పలికారు.


"రాజైన సుగ్రీవుడు. దుర్దండుడు. ఆయన తప్పక మనలను చంపగలడు. సుగ్రీవుని చేతిలో మరణించుట కంటే ప్రాయోపవేశనమునందే (అన్నమును, నీటిని వదలి మరణించుటయందే) మనకు శ్రేయస్సు ఉన్నది" అని నిర్ణయించుకొని వారందఱు దర్భలను పఱచుకొని మరణింపదలచి అక్కడే కూర్చున్నారు.


వానరుల కోలాహలమును విని గృధ్రరాజయైన సంపాతి వింధ్యగిరికందరము నుండి బయటకు వచ్చి అన్న పానీయములను వదలి మరణించుటకు నిశ్చయించి కుశాసనములపై కూర్చుని ఉ వానర భల్లూకములను చూసి హర్షాతిరేకముతో ఇలా పలికాడు :


విధిః కిల నరం లోకే విధానేనానువర్తతే | 

యధాయం విహితో భక్ష్యశ్చిరాన్మహ్యముపాగతః ||

పరంపరాణాం భక్షిష్యే వానరాణాం మృతం మృతమ్ |


(వా. రా. 4-56-4-5) 


లోకంలో పూర్వజన్మకర్మఅను అనుసరించి మానవునకు తాను చేసుకొన్న ఫలము లభించినట్లు నేడు దీర్ఘ కాలానంతరము ఈ భోజనము నాకు దానియంతటదే లభించినది. ఇది నేను చేసుకొన్న కర్మఫలమై ఉండవచ్చు. ఈ వానరులలో ఎవరెవరు చనిపోతారో వారిని నేను క్రమంగా భక్షిస్తాను.


No comments:

Post a Comment