Thursday 4 November 2021

శ్రీ హనుమద్భాగవతము (66)



తపః పూతయైన ఆ యోగిని హనుమంతునితో ఇట్లా పలికింది - 'నేను చాలా ధన్యురాలను. తపస్సు ఫలించినది, నా ఆనందమునకు అవధులు లేవు. పూర్తిగా శంకారాహితులై మీరు మొదట యథేచ్ఛగా మధురఫలములను భుజించండి. అమృతమయమైన జలమును త్రాగండి, తృప్తులై నా సమీపమున కూర్చుని విశ్రాంతి తీసుకోండి. అప్పుడు మీకు నా వృత్తాంతమును చెబుతాను.


హనుమంతుడు వానరులతో కలిసి మధుర ఫలముల భక్షించి, శీతలజలమును త్రాగి తృప్తులు ప్రసన్నులయ్యారు. తర్వాత వారు యోగిని దగ్గఱకు వెళ్ళి చాలా వినయముగా  కూర్చున్నారు. 


భక్తురాలైన ఆ యోగిని వానరసహితుడైన హనుమంతునితో ఇలా చెప్పసాగింది- 'పూర్వకాలమునాటి విషయము, విశ్వకర్మకు హేమ అనే ఒక లావణ్యవతి యైన పుత్రిక ఉండింది. ఆమె అద్భుత నృత్యమునకు సంతుష్టుడై శివుడు దివ్యము, విశాలము అయిన ఈ నగరం ఆమెకు నివసించుటకై ఇచ్చాడు. ఇచట ఆమె వేలకొలది సంవత్సరములు నివసించింది. ఆమె నాకు ప్రాణసఖి, బ్రహ్మలోకమునకు వెళుతూ ఆమె నన్ను నిజమైన ముముక్షురాలనీ, క్షీరాబ్ధి శాయి మహావిష్ణువును ఉపాసించు దానిని అని తెలుసుకుని ప్రేమ పూర్వకముగా నాతో నీవీ ఏకాంతము శాంతమైన స్థానంలో ఉండి తపస్సు చేసుకో. త్రేతాయుగంలో స్వయముగా నారాయణుడు భూభారహరణార్థమై అయోధ్యాధిపతి యైన దశరథునకు ఆయన ధర్మపత్నియైన కౌసల్యకు పుత్రరూపమున జన్మిస్తాడు. ఆయన ధర్మసంస్థాపనమునకు, దుష్టవినాశమునకు వనంలో సంచరిస్తాడు. ఆయన యొక్క భార్యను అన్వేషిస్తూ కొందఱు వానరులు ఈ గుహలో నున్న నీ దగ్గరకు వస్తారు. నీవు భక్ష్య భోజ్యములతోను, మధుర ఫలములతోను వారికి స్వాగతమిచ్చి పరమప్రభువైన ఆ శ్రీ రాముని దగ్గరకు వెళ్ళు. ఆయనను దర్శించి, ప్రేమపూర్వకముగ ప్రార్థించు. ఆయన దయచే యోగులకు దుర్లభమైన విష్నుధామానికి వెళ్ళగలవు."


కృతజ్ఞతాపూర్వకముగా హనుమంతుని చుస్తూ ఆమె మఱల ఇలా పలికినది- “నేను దివ్యుడనే గంధర్వుని పుత్రికను. నా పేరు స్వయంప్రభ. నేడి ఇచట మీ పవిత్రచరణములు సోకటంతో నా భాగ్య భానుడు ఉదయించినాడు. ఇపుడు నేను భగవానుడైన శ్రీరాముని దర్శనమునకై తహతహలాడుతున్నాను. మీరు మీమీ నేత్రములను మూసుకొనండి, వెంటనే ఈ గుహ నుండి బయటకు వెళ్ళగలరు. సీతా దేవిని దర్శించగలరు. నిరాశ చెందవలదు. ”


స్వయం ప్రభ ఆదేశమును అనుసరించి భల్లూక వానరులందఱు నేత్రములను మూసుకొనగా వెంటనే వారు గుహకు బయటగల అరణ్యములోనికి వెళ్ళారు.

No comments:

Post a Comment