Tuesday 2 November 2021

దీపావళి - దివిటీలు - పితృ ఆరాధన




దీపావళి అమావాస్యలో లక్ష్మీపూజ ఎంత ముఖ్యమో పితృదేవతా స్మరణ కూడా అంతే ముఖ్యం. అమావాస్య అంటేనే పితృదేవతలకు సంబంధించిన తిథి. సంక్రాంతికి కూడా పితృదేవతలతో సంబంధం వుంది. అందునా ఇది దక్షిణాయనం, అంటే పితృదేవతల కాలం. 


పితృ ఆరాధన అంటే అశుభం అనుకోవడమే పెద్ద మూఢనమ్మకం. పితృదేవతల అనుగ్రహం లేకుండా కుటుంబంలో శుభకార్యాలు జరగవు. కనుక ప్రతి శుభకార్యానికి ముందు వారిని స్మరించాలి. పెళ్ళిలో కూడా ముందుగా నాందీ శ్రాద్ధం అని క్రతువు ఉంటుంది. అందులో పెళ్ళికి పితరులను ఆహ్వానిస్తారు. కనుక పితృకర్మలు అశుభం అనే అపోహను హిందువులు వీడాలి.


దీపావళి నాడు పితృదేవతలకు తర్పణాలు తప్పకుండా వదలాలి. 

తర్పణాలు ఎవరైనా వదలవచ్చా అని అడుగుతున్నారు. తర్పణాలు కేవలం తల్లిదండ్రులు లేనివారు మాత్రమే వదలాలి. మిగితవారు పితృదేవతలను మనఃస్ఫూర్తిగా స్మరించాలి.

దీపావళి సాయంకాలం పితృదేవతల ప్రీత్యర్ధమై దివిటీలను వెలిగించి చూపించే ఆచారముంది. దీన్ని దివిటీలి కొట్టడమంటారు. కొన్ని ప్రాంతాల్లో కర్రలకు, కొన్ని చోట్ల గోంగూర కాడలకు వస్త్రం చుట్టి నూనెతో వెలిగించి వెలిగించి చూపించాలి. ఇది పితృదేవతలకు ప్రీతిని కలిగిస్తుంది. కాకరపువ్వొత్తులు కాల్చామా, చిచ్చుబుడ్డీలు కాల్చామా అన్నది ప్రధానం కాదు, దీపావళి నాడు దివిటీలు వెలిగించామా లేదా అన్నది ప్రధానం. ఈ దివిటీలను కూడా పురుషులే కొట్టాలని, స్త్రీలు పక్కన నిల్చుని చూడాలని నండూరి శ్రీనివాస్ గారి విడియోలో చూశాను.


అలాగే దీపావళి పండుగ రోజు సూర్యోదయవేళ కూడా దీపాలు వెలిగించి ఇంటి ముంగిట పెట్టాలి. మా చిన్నప్పుడు మా పెద్దలు ఇంట్లో ఇలా చేయడం మేము చూసాము. కార్తీకమాసంలో కూడా ఇప్పుడు అందరూ సాయంకాల వెళ మాత్రమే కార్తీకదీపాలు వెలిగిస్తున్నారు గానీ ఈ నరకచతుర్దశి మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రతి రోజు ఉదయం వేకువఝామునే దీపాలను వెలిగించి ఇంటి గడపల వద్ద, తులసిచెట్టు వద్ద పెట్టాలి.


నరకచతుర్దశి సాయంకాల వేళ కాళీమాతను, దీపావళి అమావాస్య సాయంకాలం వేళ మహాలక్ష్మీని పూజించాలి. 


వీటి గురించి అనేక విషయాలను తెలుసుకొనుటకు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు, చాగంటి కోటేశ్వర రావు గారు, నండూరి శ్రీనివాస్ గార్ల ప్రవచనాలను వినవచ్చు.

No comments:

Post a Comment