Thursday 31 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 29 వ భాగం



తాత్కాలిక సత్యం గురించి చెప్పేటపుడు మంచి చెడు కర్మలు, దానికి తగిన ఫలాన్ని ఈశ్వరుడిస్తాడనే మాట కుదురుతుంది. అందువల్ల సత్కర్మలు చేయండని, దానికి తగిన ఫలాన్ని ఈశ్వరుడిస్తాడని, చిత్త శుద్ధి కల్గుతుందని, తరువాత అతని అనుగ్రహం లభిస్తుందని, తద్వారా జ్ఞాన మార్గంలో ప్రవేశించి అతనిలో లీనం కావచ్చని చెబుతారు. ఈ మంచి కర్మలు, ధర్మశాస్త్రం విధించిన కర్మలు.


అంతా శూన్యమని దీనినందుకొనుటయే మోక్షమని చెప్పే బౌద్ధమతం, సత్యాహింసలను పాటించాలని అంటుంది. హింసను పాటిస్తే తప్పేమిటి? మంచి నడవడిక ఎందుకుండాలని ప్రశ్నించవచ్చు. అటువంటివారికి వారి దగ్గర సమాధానం దొరకదు. శంకర సిద్ధాంతంలో సమాధానం దొరుకుతుంది. మాయా జగత్తు మిథ్యయని చెప్పినపుడు ఇది పూర్తిగా సత్యము కాదు. అసత్యమూ కాదని చెప్పినపుడు ఈ మధ్యలో సత్కర్మలకు మంచి ఫలాన్ని ఇస్తాడని, మనిషికి చిత్తశుద్ధి ఏర్పడుతుందని, జ్ఞాన మార్గాన్ని అవలంబించుటకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడనే మాటకు ఆస్కారం ఉంటుంది. అందుకే మీమాంసకుల కర్మ మార్గాన్ని వీరు స్వీకరించారు. బౌద్ధుల మాయావాదాన్ని ఒక దశలో స్వీకరించారు. జైనుల అహింసామార్గాన్ని గ్రహించారు. ఆయా స్థానములలో అన్నిటినీ గ్రహించారు.


అన్నీ అబద్ధమని చెప్పిన బౌద్ధమతం గాని, ఏదీ స్పష్టంగా నిర్వచించని జైన మతంగాని కర్మ - దాని ఫలాలు నిర్వహించుటలో విఫలం పొందాయి. సాధారణంగా ఈశ్వర సంబంధం లేని మతానికి ప్రజలు మ్రొగ్గు చూపరు.


బౌద్ధ జైనాలు - ప్రజల మనః ప్రవృత్తి

 

సాధారణ ప్రజలు తత్త్వాన్ని గూర్చి ఆలోచించరు. ఏదో ఒక శక్తి, ఈ జగత్తు నంతటినీ నడుపుతోందని భావిస్తారు. ఏదో మహాత్ముణ్ణి ఆదర్శంగా తీసుకొని అతడు చెప్పినది సత్యమని నమ్మి పాటిస్తూ ఉంటారు. అతడు చెప్పిన తత్త్వం ఒంటబట్టిందా లేదా అనే విచారణ లేకుండా అతణ్ణి పూజిస్తూ ఉంటారు. ఏ మతస్థులైనా కొంతైనా ఆచరిద్దామని భావిస్తారు.


No comments:

Post a Comment