Tuesday 13 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 190 వ భాగం



వ్యాసాచలీయం


"శంకరులనే వృక్షం బాగా ఎదిగియుంది. విద్వాంసులనే తుమ్మెదలు, ఆ మకరందాన్ని ఆస్వాదింతురుగాక, నా బుద్ధికి తగ్గట్లు అందినంత మేర ఆ పువ్వులను కోసి మాలగా కూర్చి ఈ సంక్షేప శంకర విజయాన్ని అందిస్తున్నానని" మాధవీయంలో ముందు ఉన్న మాటలను తిరిగి వ్యాసాచలీయంలో వినయంతో అన్నారు.


గోవిందనాథుడు కూడా తన శంకర విజయంలో ఈ అలంకారాన్నే వాడాడు:


అత్యున్నతస్య కావ్యతరోః వ్యాసాచల భువోంఽఖిలం 


అర్ధ ప్రసూనాధ్యా ధాతుం అసమర్ధఽహం అద్భుతం


వ్యాసాచలంపై ఆచార్య చరితమనే పెద్ద వృక్షం ఉంది. అందలి అర్ధమనే పువ్వులను కోయలేకపోతున్నానని అన్నాడు.


వ్యాసాచలుడైన నేనూ అదృష్టవంతుణ్ణి, దానిని చదివినవారు అదృష్టవంతులే అన్నాడు. "ధన్యో వ్యాసాచల కవివరః తత్ కృతిజ్ఞాశ్చ"


ఆనంద గిరీయం


దీనిని ప్రామాణికంగా చాలామంది భావిస్తారు. మాధవీయ వ్యాఖ్యానంలో పేర్కొన్న గ్రంథాల విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇందు శంకరులు, చివరి కాలంలో కంచిలో ఉన్నట్లుంది. ఈ గ్రంథం, బృహత్ శంకర విజయమే. మాధవీయానికి ధనపతి సూరి వ్యాఖ్యలో శంకరులు దిగ్విజయ యాత్ర విపులంగా వివరింపబడింది. ఆనందగిరీయ పంక్తులూ చాలా ఇతని వ్యాఖ్యలో ఉన్నాయి.


కాశీ లక్ష్మణ శాస్త్రి వ్రాసిన గురు వంశ కావ్యంలో, వారే దానికి వ్రాసిన వ్యాఖ్యానంలో ఆనందగిరి యతీంద్రుని పేర్కొన్నారు.


సేండ్రకోటస్ అని ముందుగా పరిచయం చేసిన హెచ్. హెచ్. విల్సన్ కూడా ఆనందగిరీయం ప్రామాణికమైనదని అన్నాడు. అయితే సంస్కృతం తాళ ప్రతుల పట్టీని వ్రాసిన 'బర్నల్' దొర, దీనిని ప్రామాణికం కాదన్నాడు. శంకరులు చాలా చోట్ల మఠాలను స్థాపించిన విషయాన్ని ఆనంద గిరీయం పేర్కొనినదని, పెక్కు మఠాలను వారు స్థాపించలేదని అన్నాడు. అసలా మాట ఆనందగిరీయంలో లేదు. చాలా సిద్దులున్నట్లు ఆనందగిరీయం వ్రాసిందని, అయినా ప్రామాణికమే అని విల్సన్ దొర వ్రాసేడు.

No comments:

Post a Comment