Sunday 18 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 195 వ భాగం



గురు సన్నిధి - సన్న్యాసదీక్ష - వ్యాఖ్యానం


శంకరులు, నర్మదా తీరం వెళ్ళి గోవింద భగవత్పాదులను కలిసారు. వారు యోగనిష్టలో ఉన్నారు. ఇంతలో నర్మదకు, వరదలు రాగా ప్రజలు వచ్చి రక్షించండని శంకరులను ప్రార్ధించారు. వీరు తమ దివ్యశక్తిచే నర్మదను, తన కమండలువులో బంధించారు. బాహ్య ప్రపంచంలో అడుగిడిన గురువుకు వీరు సాష్టాంగ నమస్కారం చేయగా ఆయన నువ్వు ఎవరని అడిగారు.


తాను అవతారాన్నని పది శ్లోకాలలో పరోక్షంగా పేర్కొన్నారు. దీనిని దశశ్లోకియని అంటారు. "తదేకోఽవశిష్ఠః శివః కేవలోఽహం" అని చివర ఉంటుంది. 'అవశిష్టం' అనగా అదే మిగిలినది. మిగిలినదంతా మాయ, అది 'కేవలం', అనగా పవిత్రం, మిశ్రితం కానిది. తత్ ఏవో అది ఒకటే - నేనే శివుని రూపాన్ని.


శివావతారం నీ దగ్గరకు రాబోతుందని గోవిందులతో లోగడ వ్యాసుడన్నాడు. లోకాచారం ప్రకారం ఉపదేశమీయాలి కనుక శాస్త్రాచారాన్ని పాటించి ఉపదేశించారు. సన్న్యాస దీక్షనిచ్చారు.


మహా వాక్యాలను గురువు ఉపదేశిస్తాడు. దాని అర్ధంపై దృష్టి పెట్టి శిష్యుడు దానితో తాదాత్మ్యం చెందాలి. ఆ మహావాక్యాలు వేదశాఖ చివరలో ఉంటాయి. సర్వజ్ఞాత్మ మునియనే ఒక మహానుభావుడు సంక్షేప శారీరకం అనే గ్రంథాన్ని వ్రాసేడు. అందులో శిష్యుడు ఏ శాఖను లోగడ అధ్యయనం చేసాడో లేదా దానికి చెందినవాడో, అట్టివానికి అతని వేద శాఖలోని మహావాక్యాన్ని అందీయాలని, అది నిజ వేదశాఖ మహావాక్యమౌతుందని వ్రాసేడు. అట్లాగే మధుసూదన సరస్వతి కూడా అన్నారు. ఆ పుస్తకానికి వీరే వ్యాఖ్యానం చేసారు.


వేదాలలో అనేక మహావాక్యాలున్నాయని శంకరులనగా, అందు ముఖ్యంగా నాల్గింటిని ప్రధానంగా పేర్కొంటారు.


"మహావాక్య శతేన కథ్యతే

బ్రహ్మాత్మనో రైక్య మఖండ భావః" (వివేక చూడామణి 249)


No comments:

Post a Comment