Tuesday 20 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 197 వ భాగం



ఏదైనా కష్టమైన విషయం ఉంటే ఇదేమైనా సూత్రభాష్యమా అని ప్రశ్నిస్తూ ఉంటారు. కాశిలో శంకరులే భాష్య ప్రవచనం చేస్తూ ఉంటే ఇక చెప్పేదేముంది?


అంగ, వంగ, కళింగాది 56 దేశాలనుండి విద్వాంసులు పాల్గొన్నారు. వీరి ప్రతిభను చూసి సాష్టాంగ వందనాలనర్పించారు. వారు తమ ప్రాంతాలకు వెళ్ళి అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేసారు. ఇట్లా మన మతం పునరుద్ధరింపబడింది. అనేక దేశాలు హిట్లర్ కి కూడా మోకరిల్లాయి. అది భౌతికశక్తి, వీరిది ఆత్మశక్తి, అనుగ్రహశక్తి సాత్వికమైనది కూడా.


శంకరుల వాఙ్మయ సేవ


ఉపనిషత్తులపై, గీతపై భాష్యం వ్రాసేరు. సూక్ష్మాతి సూక్ష్మ విషయాలను కూడా బహుస్పష్టంగా వివరించారు. ఉపనిషత్తులలో ఒకదానికి మరొకదానికి సరిపడనట్లుండే ఘట్టాలను, గీతలో కూడా ఒక మూల చెప్పినదానికి, మరొక మూల చెప్పినదానికి సంఘర్షణ వచ్చే సందర్భాలలోనూ వీరు సమన్వయం చేసిన తీరు మేధావంతులను ఆశ్చర్యచకితులయేటట్లుగా చేస్తుంది.


సిద్ధాంతం మాట అటుంచండి, సంస్కృత భాషకే వన్నె తెచ్చారని, క్లిష్టమైన విషయాలనూ సరళ సంస్కృతంలో విశదీకరించవచ్చని వీరు నిరూపించారని విద్వాంసులు పొగుడుతారు.


ఈనాడేది జాతీయ భాష అని తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈ దేశంలో పెక్కు భాషలున్నా ఆసేతు హిమాచలంలో నున్న ప్రజలను కలిపేది సంస్కృతమే. అందువల్ల దానిలోనే రచనలు చేసారు.


No comments:

Post a Comment