Sunday 30 June 2024

శ్రీ గరుడ పురాణము (221)

 


మూడేళ్ళకు సరిపడునంత బియ్యమును పండించి దాచగలిగినవాడు సోమరసపానానికి అర్హతను సంపాదించుకుంటాడు. ఒక్కయేడాది అన్నానికి సరిపడు బియ్యం లేదా ధాన్యమును దాచగలిగిన వారు ముఖ్యంగా సోమయాగం యొక్క ప్రాక్ క్రియను చేయవలసి వుంటుంది. అనగా సోమయాగానికి పూర్వం చేయవలసిన అగ్నిహోత్ర, దర్శపూర్ణమాస, ఆగ్రాయణ, చాతుర్మాస్యాది కర్మలను అనుష్ఠించాలి. ద్విజుడు ప్రతియేటా సోమయాగం, పశుయాగం, చాతుర్మాస్యయాగం, ఆగ్రాయణేష్ఠి (అనగా కొత్తగా ధాన్యపుగింజలు కనబడగానే చేయుయాగం) లను ప్రయత్న పూర్వకంగా శ్రద్ధగా చేయాలి. ప్రతియేటా చేయలేనివారు రెండుసంవత్సరాలలో ఒకమారు అదే వేళకు వైశ్వానరీ యిష్టిని చేయాలి.


ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలందుకొని మోక్ష ప్రాప్తిని కోరు బ్రాహ్మణుడు జీవించవలసిన విధానం వేరు. స్వాధ్యాయ విరోధియైన అర్థ సంపాదనం చేయరాదు. ఎవరి వద్దా ధనమును పుచ్చుకొనరాదు. చిన్న చిన్న పనులకూ వ్రతాలకూ ప్రతి ఫలాన్ని స్వీకరించరాదు. నృత్య గీతాదుల ద్వారా కూడా ధన సంపాదన చేయరాదు. శూద్రుని చేత యజ్ఞాన్ని చేయించి డబ్బును పుచ్చుకున్న బ్రాహ్మణుడు మరుజన్మలో చండాలునిగా పుడతాడు. యజ్ఞం కోసం తీసుకువచ్చిన అన్నాన్ని దానం చేసుకున్నవాడు కోడి, గ్రద్ధ, కాకి యోనుల్లో పుడతాడు.


ఆధ్యాత్మికాశయాలను కలిగి శరీరాన్ని ధర్మమోక్షాలకొక సాధనంగా వాడుకోదలచిన బ్రాహ్మణుడు రెండు మూడు రోజులకు సరిపడు బియ్యాన్ని మాత్రమే ఉంచుకోవాలి. మోక్ష సాధకునికి అన్నిటికంటె *శిలోంఛవృత్తి పరమ శ్రేష్ఠము. (* శిలవృత్తి అనగా పంట కోతలైనాక పొలములో మిగిలియున్న ధాన్యపు గింజల నేరుకొని వాటితోనే అన్నం వండుకొని కడుపు నింపుకొనుట. ఉంఛవృత్తి యనగా ధాన్యపు బస్తాలనుండి రహదారిపై రాలిన ఒక్కొక్క గింజ నేరుకొని తెచ్చుట. ఈ రెండిటినీ కలిపి శిలోంఛవృత్తి అని వ్యవహరిస్తారు.)


అతనిని గుర్తించి రాజుగానీ, శిష్యుడుగానీ, యజ్ఞాలను నిత్యకృత్యంగా చేయించే యజమానిగాని ముందుకివచ్చి పోషణ భారాన్ని వహిస్తే అంగీకరించవచ్చును అప్పుడయినా ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసంమే తినాలిగాని భోగద్రవ్యాలను స్వీకరించుట తగదు.


Saturday 29 June 2024

శ్రీ గరుడ పురాణము (220)

 


ద్విజులు అమృతతుల్యమైన భోజనాన్ని పాత్రలో ఆకుమూతపెట్టి వుంచినదాన్ని తినాలి. అతిథికోసం భోజనం ఎప్పుడూ కూడా ఎంత సాయంకాలమైనా సిద్ధంగావుండాలి. రోజులో ఎప్పుడైనా ఇంటికి వచ్చిన అతిథి అన్నంతినకుండా పోరాదు. బ్రహ్మచారులకూ సన్యాసులకూ (వారు లభిస్తే, వాళ్ళు దొరకడమే అదృష్టం) రోజూ భిక్షవేయాలి. స్నాతకులనూ, ఆచార్యులనీ, రాజునీ ప్రతియేటా పూజించాలి. అలాగే మిత్రులూ, అల్లుళ్ళూ, ఋత్విజులూ ప్రతి వర్షమూ ఆతిథ్య పూజలకు అర్హులు. బాటసారిని అతిథియనీ వేదపారంగతుని శ్రోత్రియుడనీ అంటారు. బ్రహ్మలోక ప్రాప్తిని కోరుకొనేవారు ఈ రెండు రకాల వారిని పూజించాలి.


ఎవరైనా మిక్కిలి వినయంగా, ఆదరంగా, గౌరవంతో ఆహ్వానిస్తేనే బ్రాహ్మణుడు, ఒకరియింటి పక్వాన్నాన్ని స్వీకరించాలి. గృహ మితంగా భుజించాలి. నోటిని అనవసరంగా వాడకూడదు. ఏ విషయంలోనూ అతిచాంచల్య చాపల్యాలు కూడదు. అతిథులను సగౌరవంగా ఊరిపొలిమేరదాకా దిగబెట్టి సముచితంగా వీడ్కోలు పలకాలి.


తనకు ఇష్టులైన మిత్రులతో విద్వత్సంపన్నులతో గోష్ఠులు సలుపుతుండాలి. సాయంకాలం మరల సంధ్యవార్చి అగ్నిహోత్రం పనిచూసుకొని భోంచేయాలి. భోజనం తరువాత బుద్ధిమంతులైన భృత్యులతో ఇంటి వ్యవహారాలనూ, రాబోయే కార్యాలనూ ముచ్చటించాలి.


వైశ్యులకూ, క్షత్రియులకూ కూడా యజ్ఞానుష్ఠానమూ, అధ్యయనమూ, దానమూ ముఖ్య విహిత కర్మలే. బ్రాహ్మణునికి యజ్ఞమును చేయించుట, అధ్యాపనం, దానగ్రహణం అనేవి అదనపు ధర్మ కర్మలు.


క్షత్రియునికి ప్రజాపాలనమే ప్రధానధర్మము. వైశ్యవర్ణులకు అప్పులిచ్చుట, వ్యవసాయము, వాణిజ్యము, పశుపాలన ముఖ్య కర్మలుగా విధింపబడ్డాయి. శూద్ర వర్ణం వారు పై మూడు వర్ణాల వారికీ సాయపడాలి. ద్విజులు యజ్ఞాదికర్తవ్యాలను మానరాదు. అహింస, సత్యం, అస్తేయం, శౌచం, ఇంద్రియ సంయమనం, దమం, క్షమ, సరళత, దానం- మానవులందరికి అవశ్యాచరణీయ ధర్మాలు. అందరూ కుటిల, దుష్టప్రవృత్తులను పరిత్యజించాలి.


ప్రధానం క్షత్రియం కర్మ ప్రజానాం పరిపాలనం ॥ 

కుసీదకృషి వాణిజ్యం పశుపాల్యం విశః స్మృతం | 

శూద్రస్యద్విజ శుశ్రూషా ద్విజోయజ్ఞాన్ నహాపయేత్ ॥ 

అహింసా సత్యమస్తేయం శౌచమింద్రియ సంయమః | 

దమం క్షమార్జవం దానం సర్వేషాం ధర్మసాధనం ॥

ఆచరేత్ సదృశీం వృత్తమజిహ్మామశరాం తథా ।


(ఆచార 96 (27-30))


Friday 28 June 2024

శ్రీ గరుడ పురాణము (219)

 


ఇక గృహస్థధర్మాన్ని గూర్చి మాట్లాడుకుందాం.


గృహస్థు ప్రతిదినం స్మార్తకర్మా, వైశ్వదేవాది అగ్నికార్యాలూ సంపన్నం చేయాలి. దీనికి వివాహాగ్నిని కానీ సంపద్విభాగసమయంలో స్వయంగా తానే తెచ్చుకున్న సుసంస్కృతమైన అగ్నిని కానీ ఆరాధించాలి. శ్రౌతకర్మానుష్ఠానానికి అగ్నిహోత్రం వైతానాగ్ని (ఆహవనీయ మున్నగు అగ్నులలో నేదో ఒకటి) తో సంపన్నం చేయాలి. శరీర చింతలను (విసర్జనాలను) ఉదయసాయం కాలాలలో శాస్త్రోక్తంగా తీర్చుకోవాలి. గంధలేపనివృత్తి పర్యంత శుద్ధిని పొంది దంతధావన, స్నానాదికములను గావించి ప్రతి ద్విజుడూ ప్రాతఃకాల సంధ్యో పాసనను ముగించి అగ్నిహోత్ర కార్యాన్ని నిర్వర్తించుకోవాలి. హవనం చేసి సమాహిత చిత్తంతో సూర్యమంత్రాలను, అనగా ఉదుత్యం జాతవేదసం... మున్నగు వాటిని జపించాలి. తరువాత వేదార్థాలనూ అనగా నిరుక్త వ్యాకరణాదులనూ ఇతర శాస్త్రాలనూ అధ్యయనం చేయాలి. యోగ క్షేమాది సిద్ధికై ఈశ్వరో పాసనను కూడా చేయాలి. 

గృహస్థధర్మంలో మరొక ముఖ్యమైన అంశం తర్పణాలు. ప్రతి గృహస్థు ప్రతిరోజూ దేవతలకూ పితరులకు స్నానానంతరం తర్పణాలివ్వాలి. పూజ కూడా చేయాలి. వేదపురాణేతిహాసాలలో కొంతమేర, యథాశక్తి, పారాయణం చేయాలి. జపంచేసుకొని భూత, పితర, దేవ, బ్రహ్మ, మనుష్య జాతులకు బలికర్మ*ను గావించాలి.


(* భూతయజ్ఞం, స్వధా - పితృయజ్ఞం, హోమ- దేవయజ్ఞం, స్వాధ్యాయ- బ్రహ్మయజ్ఞం, అతిథి సత్కారం - మనుష్యయజ్ఞం. ఈ యజ్ఞాలన్నిటినీ బలికర్మగా వ్యవహరిస్తారు.)


తరువాత స్వధా, హోమ, స్వాధ్యాయ, అతిథి సత్కారాలు చేయాలి. దేవతలనుద్దేశించి అగ్నిలోహవనాలిచ్చి కుక్కలు, చండాలురు, కాకులు మున్నగు ప్రాణులకై వండిన అన్నాన్ని భూమిపై వేయాలి. పితృగణాలకూ మనుష్యులకూ అన్నంతో బాటు జలదానం కూడా చేయాలి. అన్నమును తన కుటుంబమునకు మాత్రమే సరిపడునంత వండుట సరికాదు. పక్వాన్న మెల్లప్పుడూ అవసరానికి ఎక్కువగానే ఇంట్లో వుండాలి. స్వవాసిని, (పెళ్ళయినా కూడా ఏవోకారణాలవల్ల ఆనాటికి పుట్టింట్లో వున్న స్త్రీ) వృద్ధులు, గర్భిణులు, వ్యాధి పీడితులు, కన్యలు, అతిథులు, భృత్యులు- వీరందరికీ భోజనాలు పెట్టాకనే ఇంటి యిల్లాలు, ఇంటి యజమాని అగ్నిలో పంచప్రాణాహుతులనిచ్చి అన్నానికి గౌరవ భక్తి ప్రపత్తులతో నమస్కరించి భోజనం చెయ్యాలి. భోజనానికి ముందూ వెనకా అవపోసన పట్టాలి.


Thursday 27 June 2024

శ్రీ గరుడ పురాణము (218)

 


వర్ణసంకరమంటే వివాహ విషయంలో మాత్రమే చేయబడేదని కాదు. వృత్తి విషయంలో కూడా జరుగుతుంది. యాజన, అధ్యయన, అధ్యాపనాలను చేయవలసిన బ్రాహ్మణుడు పరిస్థితుల ప్రభావం వల్ల ఆ వృత్తి ద్వారా జీవించలేక, బతుకు గడవక క్షత్రియ, వైశ్య లేదా శూద్రవృత్తి నవలంబించవచ్చు. ఇలా ఏ వర్ణం వారు మరొక వర్ణం పనిని చేసినా అది కర్మ వ్యత్యయమవుతుంది. అదీ వర్ణ సంకరంవంటిదే. అయితే పరిస్థితులు మెరుగు పడగానే ఎవరి అసలు పనిలోకి వాళ్ళు వెళ్ళకుండా తమ వర్ణం కన్నా హీనవర్ణానికి చెందిన కర్మను నిర్వహిస్తూ వుండి పోతే వారు వర్ణసంకరులుగానే పరిగణించబడతారు. వారు క్రమంగా ఏడవ, ఆరవ, అయిదవతరంల దాకా ఆ హీనవృత్తిలో వుండిపోవలసినదే.


ఇక సంకరజాతులను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి సంకర, సంకీర్ణ, సంకర, వర్ణ సంకీర్ణ సంకర విభాగాలు.


అనులోమజులు, ప్రతిలోమజులు అనగా నిదివఱకు చెప్పబడిన మూర్ధవసిక్త నుండి ఆవయోగ జాతి దాకా గల పన్నెండు రకాలవారూ సంకరజాతి విభాగానికి చెందినవారు.


ఈ సంకరజాతిలో మరల సంకరం జరుగగా పుట్టినవారు అనగా మాహిష్య-కరణ సంయోగం వల్ల పుట్టిన రథకార జాతి వంటి వారు సంకీర్ణ సంకరజాతి వారవుతారు.


మరింత లోతైన సంకరం జరిగిన చోట వర్ణ సంకరజాతి వారు పుడతారు. ఉదాహరణకి మూర్ధావసిక్త స్త్రీకి క్షత్రియ, వైశ్య లేదా శూద్ర పురుషుని ద్వారా పుట్టినవారు, అంబష్ఠ స్త్రీకి వైశ్య లేదా శూద్ర పురుషుని ద్వారా కలిగినవారు అలాగే పారశవ నిషాద స్త్రీకి శూద్రుడు కన్న పిల్లలూ ఈ జాతిలోకి వస్తారు. వీరిని అధరప్రతిలోమజులంటారు.


ఇటువంటి సంకరజాతి స్త్రీలకే బ్రాహ్మణ బీజం ద్వారా కలిగినవారు, మాహిష్య, ఉగ్రజాత్యాది స్త్రీలకు బ్రాహ్మణ లేదా క్షత్రియ పురుషుని ద్వారా పుట్టినవారు, కరణజాతి స్త్రీయందు అగ్రవర్ణుని ద్వారా కలిగినవారు ఇటువంటి వారిని ఉత్తర ప్రతిలోమజులంటారు. వీరినే అధర - అసత్, ఉత్తర- అసత్ వర్ణ సంకీర్ణ జాతుల వారని వ్యవహరిస్తారు.


Wednesday 26 June 2024

శ్రీ గరుడ పురాణము (217)

 


వర్ణసంకర జాతుల ప్రాదుర్భావం - గృహస్థధర్మం, వర్ణ ధర్మం, ముప్పదేడు ప్రకారాల అనధ్యాయం


బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ కన్యను పెండ్లాడి ఆమెకు కనిన పుత్రునితో మూర్ధావసిక్త అనే సంకరజాతి ప్రారంభమైంది. అలాగే బ్రాహ్మణ వైశ్య సంకరంలో అంబష్ఠ, బ్రాహ్మణ శూద్ర సంకరంలో పారశవనిషాద జాతులు పుట్టుకొచ్చాయి. దీనిని అనులోమ సంకరమన్నారు.


పురుష     శ్త్రీ    సంకరజాతి పేరు


క్షత్రియ    వైశ్య     మాహిష్య

క్షత్రియ    శూద్ర    మ్లేచ్ఛ 

'యాజ్ఞవల్క్య స్మృతిలో మ్లేచ్ఛ పదానికి బదులు 'ఉగ్ర' యను పదం వాడబడింది.


వైశ్య     శూద్ర    కరణ

(మూర్ధవసిక్త, అంబష్ట, నిషాద, మాహిష్య, ఉగ్ర, కరణ- ఈ ఆరు సంకరజాతులనూ అనులోమజలన్నారు.) 

క్షత్రియ   బ్రాహ్మణ సూత

వైశ్య     బ్రాహ్మణ వైదేహక

శూద్ర    బ్రాహ్మణ చాండాల

వైశ్య     క్షత్రియ  మాగధ 

శూద్ర    వైశ్య   అయోగవ

(సూత, వైదేహక, చాండాల, మాగధ, క్షత్తా, ఆవయోగ జాతులను ప్రతిలోమజలన్నారు.)

శూద్ర    కరణ   రథకార


సంకరం వల్ల చెడిన వర్ణం మరల పాతదశకు రావాలంటే ఆరు తరాలు పడుతుంది. అంటే బ్రాహ్మణునికీ శూద్రునికీ పుట్టిన సంతానాన్నీ నిషాదులన్నాము కదా. ఆ నిషాదుని కొక కూతురు పుట్టి,దానినొక బ్రాహ్మణుడు పెండ్లాడి, వారికొక కూతురు పుట్టి, దానినీ బ్రాహ్మణుడేమనువాడి... అలా నిషాద, బ్రాహ్మణ వివాహం ఆరు తరాల బాటు కొనసాగితే ఏడవతరం నిషాదునికి కూతురు పుట్టి ఆమెను కూడా బ్రాహ్మణుడే పెళ్ళిచేసుకుంటే అప్పుడు వారికి పుట్టిన పిల్లలు ఏడవతరం వారవుతారు కదా! వారికి శుద్ధ బ్రాహ్మణ వర్ణాన్ని శాస్త్రాలు ప్రసాదిస్తున్నాయి. అలాగే బ్రాహ్మణ వైశ్య సంకరమైన అంబష్ట జాతిలో అయిదవతరానికి పుట్టినవారు అనగా ఆరవ తరంవారు శుద్ధ బ్రాహ్మణులవుతారు. అలాగే మూర్ధావసిక్తజాతిలో అయిదవ తరంవారు శుద్ధబ్రాహ్మణులౌతారు. ఇదే విధంగా ఉగ్రా, మాహిష్యా జాతులలోనూ ఏడవ ఆరవ తరాలలో శుద్ధ క్షత్రియులుద్భవిస్తారు. అదే విధంగా కరణనామక సంకరజాతిలో ఆరవతరంలో శుద్ధ వైశ్యులుద్భవిస్తారు. అనగా సంకరదోషం పితృవర్ణ బీజం ఆరేడుతరాల పాటు అనుస్యూతంగా ప్రవహిస్తే గాని కడుక్కుపోదు.


Tuesday 25 June 2024

శ్రీ గరుడ పురాణము (216)

 


గృహస్థధర్మానికి మూలం పతివ్రతయగు గృహిణి. ఆమె పతి చిత్తవృత్తిని కూలంకషంగా తెలుసుకొని వుండాలి. అతడెపుడేది కోరుకుంటాడో దానిని అప్పటికి అతడు అడగకుండానే అమర్చిపెట్టాలి. సర్వకాల సర్వావస్థలలోనూ అతని మేలునే కోరుతూ తన ప్రతిపనీ ఆ ఆశయం వైపే మళ్ళేలా చూడాలి, చేయాలి.


భర్త యొక్క తల్లిదండ్రులనూ, అక్కచెల్లెళ్లనూ, అన్ననూ, పినతండ్రినీ, గురువునీ, వృద్ధ స్త్రీలను గౌరవించడం ఆదరించడం పత్నియొక్క ధర్మం. తనకన్నా చిన్నన్నవారైన భర్తృ వర్గీయులతో స్నేహంగా వుంటూనే ఇంటి పనులు చేయించుకోవాలి. లేకుంటే సోమరులవుతారు. పతి యొక్క బంధువుల మధ్యలో తాము కూర్చునియున్నపుడామె యొక్క మాటలు, చేతలు అన్నీ అతనికి అనుకూలంగానే సాగాలి; ఈ సంగతి అందరికీ తెలియాలి. ఈ శీలమే ప్రశస్తమని జనశ్రుతి.


ఇంటికోడలు తనకు వరసైన పురుషులతో హాస్యాలాడకూడదు. పర పురుషునితో ఏకాంతంగా అసలు ఉండనేకూడదు. పరపురుషుల చేతిలో ఏ వస్తువునూ ఉంచకూడదు, వారి చేతి నుండి తన చేతితో అందుకొనరాదు. భర్త అక్కడే వున్నా కూడా పరపురుషుల మధ్య కూర్చొనరాదు.


ఇంటిలోని సామగ్రి అంతా ఆమె అధీనంలోనే వుంటుంది. దానిని అనవసరంగా ఖర్చు చేయకూడదు. అవసరానికి తగినంతగా వాడుతుండాలి. కార్యకుశల, ప్రసన్న, మితవ్యయి అయివుండి రోజులో ఒకసారైనా అత్తమామలకు పాదాభివందనం చేసే స్త్రీని భర్త ప్రేమిస్తాడు, సమాజం గౌరవిస్తుంది. ప్రోషిత పతికగానున్నపుడు- అనగా తన భర్త పరదేశానికి వెళ్ళినపుడు తన సఖీజనంతో ఆనందంగా ఆటలాడడం, పొరుగు వారిళ్ళలో కూర్చుని వాగడం, అతిగా అలంకరించుకోవడం, ఉత్సవాలలో పాల్గొనడం, హాసాలూ పరిహాసాలూ వంటివి చేయరాదు.


ఇల్లాలి మనుగడ పతితోనే. వీలైనంత వఱకు ఆమె గడపవలసిన సమయమూ అతనితోనే. ఆమె అధికారాలు పరిమితమే అయినా గృహస్థధర్మానికీ తద్వారా సమాజానికీ ఆమె అవసరం అపరిమితం. అందుకే సదాచారిణియైన స్త్రీ మరణించినపుడు అగ్నిహోత్రం లోని అగ్నితో ఆమె దహన సంస్కారాలను చేస్తారు. పతిహితైషిణియైన పత్నికి ఈ లోకంలో కీర్తి సమ్మానాలూ పరలోకంలో స్వర్గమూ సంప్రాప్తిస్తాయి.


(అధ్యాయం - 95)


Monday 24 June 2024

శ్రీ గరుడ పురాణము (215)

 


స్త్రీకి తన భర్త యొక్క ఆజ్ఞను పాలించుటయే పరమధర్మము. స్త్రీకి ఋతు లేదా రజోదర్శనమైన తొలి దినం నుండి పదహారవ రాత్రి వఱకు సంతానప్రాప్తికి అవకాశముంటుంది. పుత్రప్రాప్తి కోసమై పురుషుడు ఆ రాత్రులలో మాత్రమే ఆమెతో సంగమించాలి. ఇలా సంతానం కోసం మాత్రమే సంగమించి మిగతా కాలాల్లో ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడమే బ్రహ్మచర్య వ్రతం. అంతేగాని బ్రహ్మచర్యమంటే పెండ్లిని మానుకొనుట, స్త్రీవైపే చూడకపోవుట కాదు. పర్వతిథులలోనూ (అష్టమి, చతుర్దశి, అమావాస్య, పున్నమ (మను-4/156)) ఋతుకాలం మొదటి నాలుగు రాత్రులందూ, దినము అనగా ఎప్పుడైనా పగటివేళా సంగమం నిషిద్ధం. మఘ, మూల నక్షత్రాలలో సంగమం వర్జ్యం.

ఈ నియమాలను కచ్చితంగా పాటిస్తేనే సుందరుడు, సబలుడు, సద్గుణవంతుడు, ఆరోగ్యవంతుడునైన కొడుకు పుడతాడు. స్త్రీ పట్ల అన్ని బాధ్యతలూ అనగా తిండి, బట్ట, ఇల్లు మున్నగునవే కాక ఆమె కామవాంఛను పూర్తిగా తీర్చి ఆమెను సంతృప్తి పఱచవలసిన బాధ్యత కూడా ఆమెను చేపట్టిన వానిపై వుంటుంది. పైగా ఈ బాధ్యతకు సంబంధించి ఇంద్రుడు స్త్రీలకొక వరాన్నిచ్చాడు. అదేమనగా స్త్రీ యొక్క కామవాసనను అనిషిద్ధ రాత్రులందు ఆమె పతి తప్పనిసరిగా తీర్చాలి. లేకుంటే వాడు పాపమును మూటకట్టు కుంటాడు.

స్త్రీని ఇంటియిల్లాలిగా గృహలక్ష్మిగా సంభావించి మెట్టినింటి వారంతా అనగా భర్త, వాని సోదరులు, వాని తల్లిదండ్రులు, ఇష్టబంధువులు ఆమెను మధురాహారముతో చీని చీనాంబరాలతో అలంకార విశేషాలతో ఎల్లప్పుడూ ప్రసన్నంగా సుఖంగా వుండేలా చూడాలి. ఇది సామాజిక బాధ్యత కూడా.

స్త్రీకి గల బాధ్యతలు బాగా ఎక్కువ. ముఖ్యంగా పురుషునితో స్త్రీ యొక్క ప్రవర్తన ఎంతో బాధ్యతాయుతంగా వుండాలి. పుత్రసంతానమైనా స్వర్గప్రాప్తియైనా స్త్రీకి 'భర్తకు తనపై గల' ప్రేమ ఆధారంగానే సంక్రమిస్తాయి కాబట్టి ప్రతి ఆడదీ తన పత్యారాధన ఫలితంగా, స్నేహఫలంగా పతి ప్రేమను పొందాలి. సాధారణ స్త్రీకి శాస్త్రాలను గాని గ్రంథాలను గాని పఠించే అర్హత లేదు కాని భర్త ద్వారా వాటన్నిటినీ ఆమె వినవచ్చును. విధి నిషేధ పూర్వకంగా భర్త చెప్పే ధర్మాచరణను సాంతమూ చేయడం ద్వారా మోక్ష ప్రాప్తి నందవచ్చును. భర్త అనంతరం కొడుకే ఆమెకు ధర్మశాస్త్రగురువు కాగలడు.

Sunday 23 June 2024

శ్రీ గరుడ పురాణము (214)

 


స్త్రీకి వివాహానికి పూర్వమే చంద్రుడు శుచినీ, గంధర్వులు సౌందర్యాన్నీ మధురవాణినీ, అగ్నిదేవుడు అన్ని రకాల పవిత్రతనీ ప్రసాదిస్తారు. కాబట్టి ఈ దేవతలకు పూజలందే భారతదేశం వంటి దేశాల్లో స్వభావసిద్ధంగా స్త్రీలందరూ పవిత్రులే అయివుంటారు. అయినా కూడా పూర్వకర్మల వల్ల తేడాలు రావచ్చు. అందుచే స్త్రీకి దోషమంటదనే నిశ్చయానికి రావడం సరికాదు. ఒక స్త్రీ తన పతికానివానిని మనసులో వాంఛిస్తే అదీ ఒక రకమైన వ్యభిచారమే అవుతుంది. అలాగే పరపురుషునితో సంపర్కాన్ని సంకల్పించినా వ్యభిచారమే కాగలదు. ఈ మానసిక వ్యభిచార దోషము ఆమె ఋతుకాలిక రజోదర్శనము కాగానే పోతుంది కాని మరల అటువంటి ఆలోచనలు చేయరాదు. నిజంగానే పరపురుషునితో సంగమించినా, తద్వారా గర్భధారణ చేసినా ఆ స్త్రీని పరిత్యజించవలెను. ఇలాగే గర్భవధ, పతివధ, బ్రహ్మహత్య, శిష్యులతో సంగమం వంటి పనులలో నేది చేసినా ఆమెను మహాపాతకిగా అభిశంసించి పరిత్యజించాలి.


మదిరాపానం చేసేది, దీర్ఘరోగిణి, శాశ్వతద్వేషి, వంధ్య, అర్ధనాశిని, అప్రియవాదిని, నిష్టురభాషిణి లేదా పతికి హాని చెయ్యడం కోసమే జీవించునట్లుండేది యగు భార్యను ఆమె భర్త పరిత్యజించవచ్చును; మరొక వివాహం చేసుకోవచ్చును. అయితే తాను మొదట వివాహం చేసుకొని ఇపుడు పరిత్యజించిన స్త్రీని దాన, మాన, సత్కారాదుల ద్వారా భరణ సమన్వితను చేస్తుండాలి. అలా చేయనివాడు మహాపాపిగా నిందితుడు.


అన్యోన్యంగా దంపతులుంటే ఆ గృహానికి ధర్మార్థ కామవృద్ధి - త్రివర్గవృద్ధి పుష్కలంగా వుంటుంది. భర్త పోయిన పిమ్మట ఇంకొక పురుషుని ఆశ్రయించకుండా అతని జ్ఞాపకాల బలిమితోనే జీవించే స్త్రీనీ, ఎట్టి విపత్కర పరిస్థితులెదురైనా భర్తను వదలిపోకుండా వుండే స్త్రీనీ లోకం నెత్తినబెట్టుకొని పూజిస్తుంది. ఈ లోకంలో యశంతోబాటు ఈ పాతివ్రత్యమహిమ వల్ల పరలోకంలో పార్వతీదేవి సాహచర్యం చేసే భాగ్యమబ్బుతుంది.


భార్యను పరిత్యజించినవాడామె సుఖంగా, ప్రసన్నంగా బతికేలా చూసుకోవాలి. తన సంపత్తిలో మూడవవంతు నామెకిచ్చెయ్యాలి.


Saturday 22 June 2024

శ్రీ గరుడ పురాణము (213)

 


సవర్ణ వివాహాలలో గృహ్యసూత్రానుసారం కన్య వరుని పాణిగ్రహణం చేయాలి.  కృతత్రేతా ద్వాపరయుగాల్లో క్షత్రియ కన్య బ్రాహ్మణ వరునిగానీ వైశ్యవరుడు శూద్ర కన్యను గానీ ఇదివఱకే చెప్పినట్టు వివాహం చేసుకోవడం ఆచారంగా కొన్నిచోట్ల ప్రత్యేక సందర్భాలలో జరిగేది. కలియుగంలో ఈ పద్దతి ఎక్కడా, ఎటువంటి సందర్భాలలోనూ లేదు. వర్ణసంకరం జరుగరాదు.


కన్యాదానాన్ని గావించే అధికారం కన్య యొక్క తండ్రికీ, తాతకీ, సోదరునికీ సకుల్యునికీ లేదా తల్లికీ వుంటుంది. (సకుల్యులనగా ఎనిమిదవ తరం నుండీ పదవతరం దాకా నున్న బంధువులు) తండ్రిదే ఈ ధర్మం, ఈ భాగ్యం. ఆయన లేకపోయినా, ఉండీ మతిస్థిమితం లేనివాడై పోయినా తాతకీ, అలా అదే క్రమంలో తరువాత చెప్పబడిన వారికీ ఈ అవకాశమివ్వబడుతుంది. కన్యాదానం చేయవలసినవాడు చేయకపోతే వానికి ఆ కన్య ఋతుమతియైనపుడల్లా ఒకటొకటిగా భ్రూణహత్యల పాపం చుట్టుకుంటుంది. కన్యాదాతలు లేనపుడు కన్యయే తనకు తానుగా తనను తాను దానము చేసుకొనే వెసులుబాటు కూడా అంగీకార్యమే.


కన్యను ఒకమారే దానంచెయ్యాలి. అలా చేసిన తరువాత ఆమె భర్తపై దౌర్జన్యం చేసి గాని మరొక విధంగా గాని ఆమెనపహరించి మరొకరికి దానమిచ్చువాడు చౌరకర్మతో సమాన పాపమునకు దండనార్హుడవుతాడు. ఆమె దోషమేమాత్రమూ లేకుండా పత్నిని పరిత్యజించు పతి దండనీయుడు. అత్యంత దుష్టురాలు (మహాపాతకి)గు పత్నిని పరిత్యజించవచ్చును.


ఒక కన్యను ఒక వరునికిచ్చుటకు వాగ్దానము చేయబడిన పిమ్మట వివాహానికి ముందే వరుడు మరణిస్తే ఆమెను జీవితాంతం వితంతువుగా గొడ్రాలిగా నుంచి వేయుట ధర్మము కాదు. ఆమెకు పుత్రవతి కావలెననే కోరిక వుంటే మరిది కాని, వరుని సపిండ, సగోత్రులలో నామెకు ఈడైనవాడెవరైనా కాని పెద్దల ఆజ్ఞ మేరకు ఆమెకు పుత్రుని సామాన్య పద్ధతిలోనే ప్రసాదించాలి. ఈ విధంగా ఈ పద్దతిలో నామెకు కలిగిన పుత్రుడు ఆ మృతి చెందిన వరుని యొక్క క్షేత్రజ్ఞ పుత్రునిగానే పరిగణింపబడతాడు.


వివాహిత స్త్రీ వ్యభిచారానికి అలవాటు పడిపోతే, ఆమెను మంచి దారిలో పెట్టడానికి ఆమె పతి, అతని బంధువులూ శాయశక్తులా ప్రయత్నించాలి. చివరి ప్రయత్నంగా ఆమె అసహ్యక జీవనంపై ఆమెకే వైరాగ్యం కలిగేలాగ, ఆమెను ఇంటిలోనే వుంచి గృహిణిగా ఆమెకు గల అధికారాలన్నిటినీ తొలగించాలి. అలంకరించుకోనీయకుండా మలినగానే వుంచాలి. ఏదో ప్రాణరక్షణకు సరిపడునంతగానే తిండిపెట్టి కటిక నేలపై పడుకోబెట్టాలి.


Friday 21 June 2024

శ్రీ గరుడ పురాణము (212)

 


వర్ణసంకరం పనికిరాదు. ఏ వర్ణం వారు ఆ వర్ణం వారినే పెండ్లి చేసుకోవాలి. కొంతమంది విద్వాంసులు అగ్రవర్ణులు శూద్రకన్యలను పెళ్ళి చేసుకోవచ్చని వచిస్తారు కాని నేనుదాని కంగీకరించను. ఎందుకంటే 'ఆత్మా వైజాయతే పుత్రః అనీ 'అంగాదంగాత్సం భవసి' అని వేదం ఘోషిస్తోంది. ద్విజుడే శూద్రునిగా పుట్టి, ఆ శూద్రుడు ఈ ద్విజుని వలె, అంత జ్ఞానం సంపాదించకుండానే, గౌరవాదరాలు పొందాలనుకొని, సమాజం దానికడ్డుపడడంతో దానిపై, ద్విజజాతిపై కక్షగట్టి... ఇలా సమాజానికీ సవాలుగా నిలుస్తాడు. బ్రాహ్మణుడు తన వర్ణం నుండి ఒక కన్యను వివాహం చేసుకున్న పిమ్మట ఇతర వర్ణాల కన్యలను పెండ్లాడవచ్చనీ, క్షత్రియులు క్షత్రియ కన్యను పెండ్లాడిన పిమ్మట వైశ్య, శూద్ర కన్యలను వివాహమాడవచ్చుననీ, వైశ్యులు వైశ్య కన్యతో వివాహమైన పిమ్మట శూద్రకన్యను చేసుకోవచ్చుననీ, శూద్రుడు మాత్రం శూద్ర కన్యను మాత్రమే పెండ్లాడాలనీ పెద్దలంటారు. (అది సామాజికావసరమైనపుడే అంగీకార్యమయ్యేది) కన్యకి కనీసం ఒక అన్నదమ్ముడైనా వుండాలి. అంతేకాని, పుత్రికా ధర్మం గల కన్య ప్రశస్తం కాదు. ఈ కన్య యొక్క పుత్రుడే ఆమె తండ్రికి పిండం పెట్టవలసి వస్తే ఆమెను పుత్రికా ధర్మం గల కన్య అంటారు.


వివాహాలలో ఎనిమిది రకాలున్నాయి.


అవి బ్రాహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపూపత్య, ఆసుర, గాంధర్వ, రాక్షస, పైశాచ విధాలు.


ఉత్తమ వంశానికి చెందిన, మంచి శీలస్వభావాలున్న వరుని మామయే స్వయంగా తన యింటికి పిలిచి, అలంకరించి, పూజించి కన్యాదానం చేయడం బ్రాహ్మ వివాహం. యజ్ఞం చేస్తూ ఋత్విజుని అలంకృతుని చేసి పూజించి కన్యనివ్వడం దైవ వివాహం.


వరుని నుండి ధర్మార్ధంగా ఒకటి రెండు జతల ఆవులను ఎద్దులను స్వీకరించి శాస్త్రోక్తంగా పిల్లనిచ్చి పెళ్ళి చెయ్యడం ఆర్ష వివాహం.


వధూవరులనొకచోట చేర్చి 'మీరిద్దరూ కలసి గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించండి' అని చెప్పి పూజ చేసి కన్యను దానం చేయడం ప్రాజాపత్యం.


కన్యకూ, ఆమె తండ్రికీ, ఆతని బంధువులకూ యథాశక్తి ధనాదులనిచ్చి స్వచ్ఛందంగా వరుడే కన్యను గ్రహించడం ఆసురవివాహం.


కన్యాబ్రహ్మచారీ పరస్పరం ఇచ్ఛాపూర్వకంగా తమకు తామే చేసుకొనేది గాంధర్వం.


కన్యను అపహరించి గొనిపోయి వరుడు తన స్వగృహంలో శాస్త్రోక్తంగా చేసుకొనేది రాక్షస వివాహం.


అన్నిటికన్నా అధమమైనది నిదురిస్తున్న, కామంపట్టిన లేదా మతిలేని కన్యను ఎవరూ చూడకుండా పట్టుకుపోయి వరుడే చేసుకొనేది. దీనికి పైశాచ వివాహమని పేరు.


మొదటి నాలుగు రకాల వివాహాలూ బ్రాహ్మణ వర్ణంలోనూ తరువాతి రెండు విధాల పెళ్ళిళ్ళూ క్షత్రియ వర్ణంలోనూ తఱచుగా అవలంబింపబడుతూ వుంటాయి.


Thursday 20 June 2024

శ్రీ గరుడ పురాణము (211)

 


ఈ దేవతలూ పితరులూ కూడా ఒకనివల్ల సంతృప్తులైతే వానికి అన్ని శుభ, అభీష్టాలనూ ప్రసాదిస్తారు. ఏయే యజ్ఞ ప్రతిపాదిత వేదభాగాన్ని అధ్యయనం చేస్తామో ఆయా యజ్ఞ ఫలాలను పొందుతాము. అంతేకాక భూమి, దాన, తపస్సు, స్వాధ్యాయ ఫలాలను కూడా పొందగలము.

నైష్ఠికుడైన బ్రహ్మచారి తన ఆచార్యుని యొక్క సాన్నిధ్యంలోనే వుండాలి. ఆయన లేకుంటే ఆ కుటుంబసభ్యుల వద్ద వుండాలి. వారంతా కలసి ఎక్కడికైనా పోయినపుడు తనచే ఉపాసింపబడు అగ్ని అనగా తన వైశ్వానరాగ్ని శరణంలో వుండాలి. ఈ రకంగా భోగాలను వదలి, మెదడును పెంచి, శరీరాన్ని కృశింపజేసుకొని జితేంద్రియుడై బ్రహ్మచర్యాశ్రమమున జీవించిన వానికి జన్మ చివర్లో బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. పునర్జన్మ వుండదు.


(అధ్యాయాలు - 93,94)


గృహస్థ ధర్మ నిరూపణం


యాజ్ఞవల్క్య మహర్షి ఇంకా ఇలా ప్రవచింపసాగాడు. యతవ్రతమునులారా! విద్యాధ్యయన సమాప్తి కాగానే బ్రహ్మచారి గురువుగారికి దక్షిణను సమర్పించి ఆయన అనుమతితో స్నానం చేసి బ్రహ్మచర్య వ్రతానికి వీడ్కోలు పలకాలి. తరువాత తల్లిదండ్రుల అనుమతితో గాని, గురువుగారి ఆదేశానుసారముగాని ఒక సులక్షణా, అత్యంతసుందరీ, మనోరమా, అసపిండా, వయసులో తనకన్న చిన్నదీ, అరోగా, భ్రాతృమతీ, భిన్న ప్రవర, గోత్రీకురాలూ నగు కన్యను వివాహం చేసుకోవాలి.


ఈ సందర్భంలో యాజ్ఞవల్క్య మహర్షి సపిండ ఎవరో కూడా వివరించాడు. తల్లితో మొదలు పెట్టి ఆమె తండ్రి, తాత, ముత్తాత... అలా లెక్కపెడుతూ పోయి ఏడవతరం దాకా ఉండిన వారందరినీ సపిండ్యులుగా భావించాలి. ఈ మధ్యలో వరుని వంశంలో ఎక్కడ కలిసినా ఆమె సపిండ్యయే అవుతుంది. ఎక్కడా కలవనిదే అసపిండ కాగలదు. అసపిండనే పెళ్ళి చేసుకోవాలి. అలాగే ఆమె మాతృ వంశంలోనూ పితృవంశంలోనూ అయిదేసి తరాల దాకా విచారించి సదాచార, అధ్యయన, పుత్రపౌత్ర సమృద్ధి దృష్టిలో పెట్టుకొని వారి ఖ్యాతిని చూడాలి గాని ధనాన్ని బట్టి కాదు. ఇటువంటి కన్యను కల్యాణ మాడదలచుకొనే వరుడు కూడా సమానవర్ణుడూ, ఆమెకి తగినవాడునై వుండాలి.


Wednesday 19 June 2024

శ్రీ గరుడ పురాణము (210)

 


బ్రహ్మచారి చేత విధివిహిత క్రియలన్నిటినీ చక్కగా చేయించి, వానికి వేదమునందు శిక్షణ నిచ్చినవాడే 'గురు' శబ్దానికర్హుడు. యజ్ఞోపవీతధారణ మాత్రమే చేయించి వేదాన్ని చెప్పే వానిని 'ఆచార్యు'డంటారు. వేదంలోని ఒక దేశాన్ని* మాత్రమే అధ్యయనం చేయించిన వానిని 'ఉపాధ్యాయుడ'ని వ్యవహరిస్తారు. (* మంత్రమనీ బ్రాహ్మణమనీ వేదానికి రెండు రూపాలుంటాయి. ఇందులో ఒక రూపాన్ని గానీ ఆ రూపంలోని ఒక భాగాన్ని గానీ బోధించడాన్ని 'ఏకదేశాధ్యాపన' మంటారు.) ఒక యజమానిచే 'వరించ' బడి అనగా గౌరవం మీరగా పూజింపబడి అతనిచే యజ్ఞమును సంపన్నము చేయించేవానిని 'ఋత్విక్' అంటారు. బ్రహ్మచారిగా నున్నవానికి, ఆ తరువాతి కాలంలో కూడా ఈ నలుగురూ యథాక్రమంగా పూజార్హులే. వీరందరికంటే పూజ్యురాలు తల్లి. 


నాలుగు వేదాలూ అధ్యయనం చేయదలచుకొన్నవారు ఒక్కొక్క వేదానికీ పన్నెండేసి సంవత్సరాల చొప్పున బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. అంతకాలం పాటు ఆశ్రమంలో నుండుట సాధ్యపడని వారు అతిశయధీమంతులు అయితే అయిదేసి యేళ్ళకే ఈ వ్రతాన్ని కుదించుకోవచ్చు. కేశాంత సంస్కారము, పదహారవ, ఇరువది రెండవ, ఇరువది నాల్గవ యేట, క్రమంగా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు చేయబడాలి. ఈ వర్ణాల వారికి ఉపనయనం కూడా క్రమంగా ఆయా వయసు పూర్తయ్యేనాటికి తప్పనిసరిగా చేయబడివుండాలి. లేకుంటే వారు పతితులై, సర్వధర్మాచ్యుతులై పోతారు. వ్రాత్యస్తోమమను క్రతువును చేసిన తరువాత, అదీ కొంతకాలం గడచిన తరువాతనే వారికి మరల యజ్ఞోపవీతధారణకు యోగ్యత కలుగుతుంది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణ పురుషులకు ద్విజులని పేరు. ద్వి..జ.. అనగా రెండుమార్లు పుట్టినవారని. తల్లి కడుపున తొలిసారి పుడతారు కదా! అది కాక ఉపనయన మైనపుడు మరల పుడతారు. అది రెండవ జన్మ కింద లెక్క కాబట్టి వారు ద్విజులు.


శ్రాత-స్మార్త యజ్ఞాలనూ, తపశ్చర్య (చాంద్రాయణాది వ్రతాలు) నూ, శుభకర్మలనూ (ఉపనయనాది సంస్కారాలు) బోధించగలిగేది వేదమొక్కటే. ద్విజులకు, అందుకే, వేదమే పరమ కల్యాణ సాధనము. అలాగే వేదమూలకములగు స్మృతులు కూడ.


వేదాధ్యయనం చేయగనే సరికాదు. ప్రతిదినం ఋగ్వేదమునధ్యయనం చేసేవాడు దేవతలను తేనెతోనూ పాలతోనూ, పితరులను తేనెతోనూ, నేతితోనూ తృప్తిపఱచాలి. అంటే శాస్త్రోక్తంగా పూజించి నైవేద్యం పెడితే వారు దిగివచ్చి స్వీకరించి సంతసిస్తారు. మిగతా మూడు వేదాలలో దేనిని ప్రతిదినం అధ్యయనం చేసే వారైనా నేతితో అమృతంతో పితరులనూ దేవతలనూ సంతోషపెట్టాలి. అలాగే ప్రతిదినం వాకోవాక్యం (ప్రశ్నోత్తర రూపంలో వుండే వేదవాక్యాలు), పురాణం, నారాశంసీ (రుద్ర దైవత్య మంత్రాలు), గాథికా (యజ్ఞ సంబంధితాలైన ఇంద్రాదుల గాథలు), ఇతిహాసాలు (వారుణీ వంటి విభిన్న, అసాధారణ విద్యలు) విద్యా... లను అధ్యయనం చేసే ద్విజుడు పితరులనూ దేవతలనూ, మాంసం (ఫలాలు)..., పాలు, అన్నములతో తృప్తి పఱచాలి.  


Tuesday 18 June 2024

శ్రీ గరుడ పురాణము (209)

 


ఓం ఆపోజ్యోతీ... మున్నగు మంత్రాలు గాయత్రి మంత్రానికి శిరోభాగాలు. ఈ శిరోభాగయుక్తమైన ప్రతి మహావ్యాహృతికీ ఒక్కొక్కమారు ప్రణవాన్ని జోడించి మూడు మహావ్యాహృతులతో గాయత్రి మంత్ర మానస జపాన్ని చేస్తూ నోటిలో ముక్కులో కదలుతుండే గాలిని నియంత్రించాలి.


సాయంకాలం ప్రాణాయామం చేసి మూడు జలదేవత మంత్రాలను చదివి నీటిని తలపై చిలకరించుకొని పశ్చిమం వైపు కూర్చుని నక్షత్రదర్శనమయ్యే దాకా గాయత్రిని జపించాలి. ఇలాగే ఉదయసంధ్యలో కూడా గాయత్రిని జపిస్తూ తూర్పు వైపు తిరిగి సూర్యోదయం దాకా స్థిరంగా కూర్చుని వుండాలి. ఈ రెండు సందెలలోనూ వంశాచారాన్ని బట్టి సంధ్యావందనం చేయాలి. తరువాత అగ్నిహోత్ర కార్యమును కూడా చేయాలి.


తరువాత 'నేను అముకుడను' (ఏమీ రానివాడను) అంటూ వృందజనులకు అనగా గురువులకూ, వృద్ధులకూ ప్రణామం చేయాలి. అటుపిమ్మట సంయమియైన బ్రహ్మచారి ఏకాగ్రచిత్తుడై, (ఆలోచనలను అటూ ఇటూ కదలాడనీయకుండా) స్వాధ్యాయం చేసుకొని గురువుగారికి తనను తాను అధీనం చేసుకోవాలి. ఆయన పిలిచినపుడు పోయి విద్య నేర్చుకోవాలే గాని 'నేర్పండి' అని అడగడం సరికాదు. అడగడమే అవిధేయత. భిక్షాటన చేసి తెచ్చిన ద్రవ్యాన్ని గురుపాదాల వద్ద సమర్పించాలి. మనసు, మాట, శరీరము - ఈ మూడింటినీ ఎల్లపుడూ గురువుగారి హితంలోనే సంలగ్నం చేయాలి.


బ్రహ్మచారి దండము, మృగచర్మము, యజ్ఞోపవీతము, ముంజమేఖల అను వాటిని గౌరవంగా భావించాలి. అవే అతనికొక గుర్తింపునిస్తాయి. ఏ వర్ణం వారైనా బ్రహ్మచారిగా నున్నంతకాలం భిక్షాటనం చేయవలసినదే. బ్రాహ్మణుల గృహములకు పోయి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యవర్థులు క్రమంగా భవతి భిక్షాందేహి, భిక్షాంభవతి దేహి, భిక్షాం దేహిభవతి అనే వాక్య ప్రయోగంతో యాచించాలి. భవతి అనగా 'అమ్మా' అని ఆ యింటి స్త్రీమూర్తిని సంబోధించుట.


భిక్షాటనానంతరము ఆశ్రమానికి వచ్చి అగ్నికార్యం చేసుకొని గురువుగారి ఆజ్ఞ అయినాక ఆపోశన క్రియను పూర్తిచేసి సమానులతో కలిసి కూర్చుని వినయపూర్వకంగా ఆపోశన పట్టాలి. ('భోజనానికి ముందు ఒకసారి చివరనొకమారు నీటితో ఆచమనం చెయ్యడాన్ని ఆపోశన లేదా అవుపోసన అంటారు. ఈ సమయంలో అమృతోపస్తరణమసి అనే వాక్యమును చదవాలి. ) తరువాత భిక్షాన్నమును నిందించకుండా, ప్రీతి పురస్సరంగా తినాలి. మౌనంగా భోంచేయాలి. బ్రహ్మచర్య వ్రతంలో నున్నంత కాలం, కఱువు కాటకాలు లేని రోజుల్లో, రోజూ ఒకేచోట కాకుండా భిక్షాటన చేయాలి. బ్రహ్మచర్యాన్ని నియమ, నిష్ఠలతో పాటిస్తూ మితంగానే భుజిస్తూ గడపాలి. ఎవరైనా తద్దినం, శ్రాద్ధభోజనాలకి పిలిస్తే మాత్రం పోయి వారు పెట్టినవన్నీ తినాలి. ఎందుకంటే పితృదేవతలు బ్రాహ్మణరూపంలో వచ్చి భుజిస్తారు కాబట్టి. ఆ వేళలో కూడా తేనె, మద్యం, మాంసం, ఎంగిలి పదార్ధాలను స్పృశించరాదు.


Monday 17 June 2024

శ్రీ గరుడ పురాణము (208)

 


గర్భధారణ నుండిగాని జన్మగ్రహణ నుండి గాని లెక్కగట్టి ఎనిమిదవయేట బ్రాహ్మణునికీ, పదకొండవ వర్షంలో క్షత్రియునికీ, పన్నెండవ సంవత్సరంలో వైశ్యునికీ ఉపనయన సంస్కారాన్ని సంపన్నం చేయాలి. దీన్ని గురువు చేత గాని, వంశాచారాన్ని బట్టి కాని చేయించాలి. ఈ విధంగా ఉపవీతుడైన వటువుకు గురువు మహావ్యాహృతిసహిత వేదాన్ని చదివి చెప్పే శక్తి వచ్చేలా చెయ్యాలి. అలాగే శౌచాచార శిక్షని ప్రదానం చెయ్యాలి.


ద్విజులు పొద్దున్న సాయంత్రవేళల్లో ఉత్తరం వైపు తిరిగీ, అదే రాత్రయితే దక్షిణాభిముఖంగానూ మల విసర్జనం చేయాలి. తరువాత మలమూత్రాలు వాసన పోయేదాక మట్టితో నీటితో కడుక్కోవాలి. ఈ పనిని జలాశయ మధ్యంలో చేయరాదు. నూతుల వంటి వాటి వద్ద క్రింద చప్టాలపై కానివ్వవచ్చును. తరువాత శుద్ధస్నానానికి పోయి ఇరుపాదాలనూ శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత మోకాళ్ళపై చేతులనుంచి తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చుని బ్రహ్మతీర్థాచమనము చేయాలి. (* కుడిచేతిలో బొటన వేలి మూలాన్ని బ్రహ్మతీర్ధమనీ, చిటికెన వేలి, చూపుడు వేలి మూలాలను క్రమంగా ప్రజాపతి, పితృతీర్థాలనీ, కరాగ్రభాగాన్ని దేవతీర్థమనీ వ్యవహరిస్తారు.)


కూప, తటాకాది శుద్ధజలాలతో మూడుమార్లు ఆచమనం చేసి అంగుష్ఠమూలంతో రెండుమార్లు పెదవులను స్పృశించాలి. స్నానం ద్వారా శుద్ధి చెందవలసి వచ్చినపుడు ద్విజులు నురగ, బుడగలు లేని నీటితో సర్వేంద్రియాలనూ శుభ్రపఱచుకోవాలి. నదిలోగాని మరే జలాశయంలోగాని గుండెదాకా దిగి బ్రాహ్మణులూ, గొంతు దాకా దిగి క్షత్రియులూ, తాలువుకి కొంచెం కింది దాకా దిగి వైశ్యులూ ఆచమనం చేసి శుద్ధులౌతారు. స్త్రీలూ, శూద్రులూ తాలువు దాకా దిగి ఆచమనం చేస్తే శుద్ధులౌతారు.


ప్రాతఃస్నానంలో జలదైవత మంత్రమైన ఓం ఆపోహిష్టా...ను పూర్తిగాపలుమార్లు పఠిస్తూ ఒళ్ళు తోముకోవడాన్ని పూర్తిచేసి జలాన్ని పోసుకుంటూ ప్రాణాయామ, సూర్యోపత్థాన, గాయత్రి మంత్ర పఠనం అనే పనులను కూడా చేసుకోవాలి.


Sunday 16 June 2024

శ్రీ గరుడ పురాణము (207)

 



ధర్మమనగా పుణ్యమే. పుణ్యానికి ఉత్పత్తి హేతువులు. శాస్త్ర విహిత దేశంలో, శాస్త్ర విహిత కాలంలో, శాస్త్ర విహితమైన ఉపాయంతో, యోగ్యులైన పాత్రులకు – అనగా విద్యచే తపముచే సమృద్ధులైన బ్రాహ్మణులకు- చేయబడు దానములు, సర్వశాస్త్రోక్త కర్మలు. ఈ దానాలూ ఈ కర్మలే పుణ్యము యొక్క ప్రత్యేక, విభిన్న రూపాలని తెలుసుకోవాలి. ధర్మ లేదా పుణ్యమునుత్పత్తి చేసే ఈ దాన, కర్మముల ముఖ్య ఫలం అనగా పరమ ధర్మం యోగం (చిత్త వృత్తి నిరోధం) ద్వారా కలిగే ఆత్మదర్శనం లేదా ఆత్మసాక్షాత్కారమే. ఈ సాక్షాత్కారానికి దేశ కాల నియమాలుండవు. అది ఎప్పుడైనా ఎక్కడైనా యోగం ద్వారా కలుగవచ్చును. అయితే దానాలకూ, కర్మలకూ దేశకాల పాత్రల ఆవశ్యక ముంటుంది. వీటిలో కొన్ని మార్పులు చేర్పుల విషయంలో సందేహాలుంటే వాటిని పరిషత్ అనగా ధర్మసభ తేల్చి చెప్పాలి. ఈ ధర్మ పరిషత్తు వేద, ధర్మశాస్త్ర పరిజ్ఞానులైన ముగ్గురు, నలుగురు సద్రాహ్మణులతో నేర్పడి వుంటుంది. ఇదే కాక జనవంద్యుడైన బ్రహ్మవేత్త, వేదశాస్త్ర జ్ఞాతయైన బ్రాహ్మణుని మాటకు కూడా విలువ వుంటుంది.

ఈ దేశంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రములను నాలుగు వర్ణాలున్నాయి. (ఇవి కులాలు కావు. ఆనాటి సమాజంలో వ్యక్తుల కర్మాచరణను బట్టి ఏర్పడిన వ్యవస్థలో భాగాలు మాత్రమే... అను.) వీరిలో పై మూడు వర్ణాల వారినీ ద్విజులంటారు. గర్భాదానము నుండి శ్మశాన పర్యంతము వీరి సమస్త క్రియలనూ మంత్రాల ద్వారానే చేయాలి.

గర్భాదాన సంస్కారం ఋతుకాలంలోనే చేయాలి. గర్భస్పందనకు పూర్వమే పుంసవన సంస్కారం చేయబడాలి. గర్భాదానానికి ఆరవ లేదా ఎనిమిదవ నెలలో సీమంతోన్నయన సంస్కారం చేస్తారు. సంతానోత్పత్తి తరువాత జాతకర్మ, పదకొండవ రోజున నామకరణ సంస్కారం విధాయకాలు. నాలుగవ నెలలో నిష్క్రమణ, ఆరవ నెలలో అన్నప్రాశ్న సంస్కారాలు గావించాలి. తరువాత వంశాచారాన్ని బట్టి చూడాకరణ సంస్కారాన్ని నెరవేర్చాలి.

ఇలా సంతానానికి విహిత సంస్కారాలను శాస్త్రోక్తంగా దానాదికయుక్తంగా చేయడం వల్ల బీజ (శుక్ర), గర్భ (శోణిత) కారణోత్పన్నాలైన సర్వపాపాలూ నశిస్తాయి. స్త్రీలకు చేసే సంస్కారాలు (పేరంటాలు) వివాహం తప్ప అన్నీ సామాన్యంగా అమంత్రకాలే. అంటే మంత్రం అక్కరలేదు.

Friday 14 June 2024

శ్రీ గరుడ పురాణము (206)

 


అణిమాది గుణసహితుడై జగత్సృష్టి సంహారాలను కావిస్తుండే శ్రీ మహావిష్ణువు మునులకు, దేవతలకు, దానవులకు కూడా ధ్యానగమ్యుడు, అత్యంత సుందరుడు. బ్రహ్మాది దేవతల నుండి సమస్త ప్రాణివర్గం యొక్క హృదయాలలో శ్రీహరియే ప్రాణమై వెలుగుతుంటాడు. సనాతనుడు, అవ్యయుడు, అన్నిటినీ అందరినీ మించిన కృపాళువు, ప్రభువు, నారాయణుడు, దేవాధిదేవుడునైన శ్రీహరి మకరాకృతిలో నున్న కర్ణకుండలాలతో శోభిల్లుతుంటాడు. ఆయనే దుఃఖవినాశకుడు, పూజకు అర్హుడు, మంగళమయుడు, దుష్ట సంహారకుడు, సర్వాత్ముడు, సర్వస్వరూపుడు, సర్వత్రగామి, భక్తుల సర్వగ్రహ దోష నివారకుడు నైన భగవంతుండు.


ఆయన నఖాల నుండి చల్లని వెన్నెలలు కురుస్తున్న అనుభూతి కలుగుతుంది. సుందరములైన వేళ్ళు వేణువాదకుని వేళ్ళ వలె మృదువుగా వెలుగ్గా వుంటాయి. జగత్తుకే శరణ స్థలం జగన్నాథుడైన విష్ణువు. అందరికీ సుఖము నిచ్చు సంకల్పం, శక్తి ఆయనకున్నవి. సమస్త అలంకారాలచే అలంకృతుడై, ఆ భూషణాలే తమ పుణ్యాన్ని చూసుకొని మురిసి మెరసి పోతుండగా, సుందర దేహమంతటా చందనపు పూత చల్లటి అందాన్నిస్తుండగా సౌమ్య రూపుడై, సర్వదేవసమన్వితుడై 'నేనే అందరిలో నివసించి రక్షించు వాసుదేవుడను' అనే భావనతో భాసించువాడు శ్రీ మహా విష్ణువు. అందరి భావనలలో వుండేది కూడా ఆ వాసుదేవుడే సూర్యమండలంలో వెలుగుతూ అగ్నిలో మండుతూ కనిపించేది కూడా ఆయనే.


ఇట్టి స్వరూపమున్న విష్ణుభగవానుని ధ్యానించు మానవులు పరమగతిని పొందగలరు. ప్రాచీన కాలంలో యాజ్ఞవల్క్య మహర్షి ఈ విష్ణు స్వరూపాన్నే ధ్యానించి ధర్మోపదేశ కర్తృత్వార్హత పొంది స్మృతికారునిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఈ అధ్యాయాన్ని శ్రద్ధగా చదివిన వారికి కూడా పరమగతి ప్రాప్తిస్తుంది. (అధ్యాయాలు - 91,92)


వర్ణధర్మ నిరూపణ


శౌనకాది మహామునులారా! పరమ శివుని ప్రార్ధన మేరకు మహావిష్ణువు యాజ్ఞవల్క్య మహర్షి ప్రతిపాదించిన ధర్మాలను ఇలా ఉపదేశించాడు.


యాజ్ఞవల్క్య మహర్షి మిథిలాపురిలో నున్నపుడు చాలామంది ఋషులు ఆయన వద్దకు వచ్చి ధర్మజ్ఞానాన్ని ప్రసాదించుమని ప్రార్ధించారు. అన్ని వర్ణాలవారూ చేయవలసిన దానధర్మాది కర్తవ్యాలను వినగోరారు. వారికేది బోధించినా లోకకల్యాణానికే ఉపయోగపడుతుంది.


జితేంద్రియుడైన యాజ్ఞవల్క్యమహాముని సర్వప్రథమంగా విష్ణుభగవానుని ధ్యానించి ఆ ఋషులతో ఇలా చెప్పసాగాడు.


'మునులారా! ఏ దేశంలోనైతే కృష్ణసారమను పేరు గల మృగాలు తిరుగాడుతుంటాయో అదే ప్రపంచంలో పరమ పవిత్రమైన దేశం. (ఇదే నేటి భారతదేశం) ఆ దేశానికి చెందిన ధర్మాదిక విషయాలను వినిపిస్తాను.


పురాణాలూ, న్యాయశాస్త్రం, మీమాంస, ధర్మశాస్త్రాలు, శిక్ష, కల్పం, నిరుక్తం, వ్యాకరణం, ఛందం, జ్యోతిషంతో బాటు నాలుగువేదాలూ - ఇవే ఈ దేశంలోని పదునాలుగు విద్యలకూ ఆధ్య స్థానాలు. మనువులు, విష్ణువు, యముడు, అంగిరుడు, వసిష్ఠుడు, దక్షుడు, సంవర్తుడు, శతాతపుడు, పరాశరుడు, ఆపస్తంబుడు, ఉశనుడు, వ్యాసుడు, కాత్యాయనుడు, బృహస్పతి, గౌతముడు, శంఖలిఖితుడు, హారీతుడు, అత్రి, అల్పజీవినైన నేను - మేమంతా ఆ శ్రీహరిని ధ్యానించి తద్వారా ధర్మోపదేశకులమైనాము.



Thursday 13 June 2024

శ్రీ గరుడ పురాణము (205)

 


అందరికీ అందరి ద్వారా కనిపించే మూర్త స్వరూపుడు, సూక్ష్మతమ స్వరూపుడు శ్రీహరి. అంటే కొండకంటే పెద్దవానిగానూ, చీమకంటే చిన్నవానిగానూ కనబడగలడు. జ్ఞానదృష్టి గల కర్ణేంద్రియానికి వినబడగలడు. జ్ఞానులకు విజ్ఞానమూ దివ్యదృష్టి గలవారికి పరమానంద స్వరూపము ఆయనే. విష్ణువును కనుగొనడానికి మామూలు జ్ఞానం చాలదు. తురీయ అనగా అత్యుత్తమ జ్ఞానం వున్నవాడికి ఆయన పరమాక్షర స్వరూపం తెలుస్తుంది. అన్ని ప్రాణుల ఆత్మ స్వరూపుడూ, సాక్షాత్కల్యాణ స్వరూపుడూ, శివమునిచ్చువాడూ, వికారహీనుడూ, వేదాంతవేద్యుడూ, వేదరూపుడూ, ఇంద్రియాతీతుడూ, భూతేశ్వరుడూ, శబ్ద రూప రస స్పర్శ గంధాలనెడి పంచతన్మాత్ర రహితుడైన అనాది బ్రహ్మమూ ఆయనే. ఈ శ్రీ మహావిష్ణువే పరమయోగి, పరమహంసల ద్వారా సంపుటిత బ్రహ్మరంధ్రంలో 'అహం బ్రహ్మస్మి' అనే భావానికి మూలమై పరిజ్ఞానమాత్రుడై వుంటాడు. జితేంద్రియుడై ఈ జ్ఞానాన్ని పొంది హరిని 'చూడ' గలిగిన ఏ మానవుడైనా పరబ్రహ్మస్వరూపుడు కాగలడు.


ఇక విష్ణుని -అనగా నా యొక్క మూర్తధ్యాన స్వరూపమును వినిపిస్తాను' అంటూ విష్ణువిలా వినిపించాడని సూతమహర్షి శౌనకాది మహామునులకు చెప్పసాగినాడు.


విష్ణువు కోటి సూర్య ప్రభాసంపన్నుడు, అద్వితీయ జయశీలుడు, కుందపుష్పగోదుగ్ధ సమాన ధవళ వర్ణుడు. మోక్షాన్ని కోరుకొనే మునీశ్వరులు ఇట్టి స్వరూపంలో నున్న శ్రీహరిని ధ్యానిస్తారు. ఆ స్వరూపం అత్యంత సుందరం. విశాలమైన శంఖంతో, సహస్ర సూర్యప్రభాకలితమై ప్రచండ జ్వాలామాలతో చుట్టబడిన ఉగ్రరూపం గల చక్రంతో, శాంత స్వభావం ప్రస్ఫుటమగుచున్న సుందరవదనంతో, రక్షణకే పుట్టినట్లుగా చేతిలో సిద్ధంగా నున్న గదతో విరాజిల్లే రూపమిది.


ఈ శ్రీ మహావిష్ణువు రత్నములతో దేదీప్యమానమైన బహుమూల్య కిరీటాన్ని ధరించి వుంటాడు. కమలాన్నీ ధరిస్తాడు. వనమాలాధారియై సమాన భుజస్కంధాలతో, స్వర్ణ భూషణాలతో, శుద్ద వస్త్రధారియై, విశుద్ధ దేహం సుందరకాంతులీనుచుండగా వెలుగులను విరజిమ్ముతూ సర్వకల్యాణకారకమైన కమలంపై నిలబడివుంటాడు.


శ్రీ మహావిష్ణువు స్వర్ణమయ శరీరుడై సుందర హారాలతో, శుభంకర భుజకీర్తులతో, రత్నకంకణ కేయూరాలతో, అలంకరింపబడి తన కాంతిలో అవి మెరుస్తుండగా, కౌస్తుభమణి ఒక వైపు, లక్ష్మీదేవి మరొకవైపు ఒదిగియుండగా శోభాయమాన నేత్రాలలో కరుణ తొణికిసలాడుతుండగా వెలుగులు విరజిమ్ముతుంటాడు.


Wednesday 12 June 2024

శ్రీ గరుడ పురాణము (204)

 


తరువాతి కథను మార్కండేయ మహాముని ఇలా చెప్పాడు. పితృదేవతల కృప వల్ల ఆ సమయంలోనే ఆ నది మధ్య నుండి ప్రంలోచ అను పేరు గల అప్సర ఆవిర్భవించింది. మనస్సుకి ప్రీతిని కలిగించే అందంతో బాటు అన్ని శుభలక్షణాలూగల వేరొక కన్య ఆమె వెనుకనే వచ్చి నిలబడి రుచికి నమస్కరించింది. ప్రంలోచ ఆతనితో 'హే తపస్విశ్రేష్ఠా! నేనొక అచ్చరను. వరుణపుత్రుడూ, మహాత్ముడునైన పుష్కరుని ద్వారా నాకీ అతిశయ సుందరియైన కూతురు జన్మించింది. నీకు భార్యగా ఈ మానిని అను పేరు గల సౌందర్య రాశిని దేవతలు నిశ్చయించారు. మీరు ఈమెను పరిగ్రహించండి. మీ దంపతులకు మనువే పుత్రునిగా పుడతాడు' అని చెప్పింది.


'అలాగే' అని సమ్మతించి ఆ నదీ తీరానికే మహామునులందరినీ పిలిపించి వారి సమక్షంలో శాస్త్రోక్తంగా రుచి ఒక యింటి వాడయినాడు. వారి పుత్రుడే పదమూడవ మనువు రౌచ్యుడు' అని చెప్పి మార్కండేయ ముని క్రౌంచునికి అతిథి సత్కారాన్ని గావించి వీడ్కొలిపాడు"


(అధ్యాయాలు - 89,90)


విష్ణు భగవానుని అమృత ధ్యానస్వరూపం


“శౌనకాది మహామునులారా! స్వాయంభువ మనువాదిగా ఎందరో మహామునులు నిరంతరం, వ్రత, యమ, నియమ, పూజా, స్తుతి, జపసహితంగా నిరతులైవుండి శ్రీహరిని ధ్యానిస్తుంటారు. వారు ధ్యానించే విష్ణు భగవానుడు, దేహేంద్రియ, మనో బుద్ధ్యహంకారములు లేనివాడు; రూపరహితుడు. ఆయన పంచభూతములచే అసంబద్దుడు. ఆతడే అన్ని ప్రాణులకూ స్వామిగా, అందరినీ బంధనాలలో వుంచి నడిపించే నియంతగా, జగత్ప్రభువుగా విశ్వాన నెలకొనివున్నాడు. ఆయన చైతన్యరూపుడే కాని నిరాకారుడు. ఏ ఆసక్తీ లేనివాడైనా అందరి ఆసక్తులనూ తెలిసికొనగలడు. అందరు దేవతల చేత పూజింపబడు మహేశ్వరుడూ ఆయనే. తేజః స్వరూపుడై సత్త్వరజస్తమోగుణ భిన్నుడై కర్తృత్యాదిశూన్యుడై వెలుగొందువేల్పు విష్ణువు.


ఆయన వాసనారహితుడు, శుద్దుడు, సర్వదోషరహితుడు, పిపాసావర్ణితుడు, శోకమోహాదులకు బహుదూరుడు. జరామరణాలు ఆయనకుండవు, మోహము ఆయననంటదు. సృష్టిగాని ప్రళయంగాని ఆయనకు లేవు. శ్రీహరి సత్యస్వరూపుడు, నిష్కల పరమేశ్వరుడు, నామరహితుడు, జాగ్రత్ స్వప్నసుషుప్తిరహితుడు. అవస్థాదులకు అధ్యక్షుడు, శాంతస్వరూపుడు, దేవాధిదేవుడు ఆయనే. జాగ్రదాది మన అన్ని అవస్థలలోనూ వుండేవాడు, నిత్యుడూ ఆయనే గాని ఆయన మాత్రం కార్యకారణరహితుడు.


Tuesday 11 June 2024

శ్రీ గరుడ పురాణము (203)

 


మార్కండేయుడు క్రౌంచుడితో ఈ కథను చెప్పటంలో భాగంగా ఇలా అన్నాడు. హే క్రౌంచిక మునిశ్రేష్ఠా! రుచి ద్వారా ఈ విధంగా స్తుతింపబడిన తేజస్స్వరూపులైన ఆతని పితృగణం వారందరూ దశదిశలనూ వెలుగులతో నింపేటంత ప్రకాశంతో భాసిస్తూ అతనికి ప్రత్యక్షమయినారు. అతడు వారిలో ప్రతి ఒక్కరినీ మంత్ర సహితంగా గంధాక్షతాదులతో పూజించాడు. పితరులు మిక్కిలి ప్రసన్నులై ఏం కావాలో కోరుకొమ్మన్నారు. రుచి తనను బ్రహ్మదేవుడు ప్రజాపతివి కమ్మని ఆదేశించాడని విన్నవించి దానికి కావలసిన సంతానోత్పత్తి సామర్థ్యాన్నీ, తనకు తగిన, శ్రేష్ఠురాలైన, దివ్యపత్నినీ ప్రసాదించమని వేడుకున్నాడు.


పితృదేవతలు రుచితో ఇలా చెప్పారు. 'ఓ మునిసత్తమా! నాయనా! ఈ క్షణంలోనే ఇక్కడే నీవు కోరుకొన్న పత్ని లభిస్తుంది. నీకామె ద్వారా పరమ పరాక్రమశాలి, మహాత్ముడు, బుద్ధిమంతుడు, ఈ మన్వంతరానికి మూడులోకాలకూ అధిపతి కాగల రౌచ్యుడనే కొడుకు పుడతాడు. అతడు బహుపుత్రవంతుడవుతాడు. నీవు ప్రజాపతివై నాలుగు వర్ణాల ప్రజలనూ సృష్టించి చివరిలో ధర్మ, తత్త్వజ్ఞానాన్ని పొంది సిద్ధినొందుతావు.


ఇక నీ స్తోత్రం మమ్మెంతో సంతోష పెట్టింది. కాబట్టి మేము ఇకపై ఈ స్తోత్రం ద్వారా భక్తిశ్రద్ధలతో మమ్ము ప్రార్ధించిన వారి పట్ల సుప్రసన్నులమై వారికి ఉత్తమ భోగాలనూ, ఆత్మ విషయక ఉత్తమ జ్ఞానాన్నీ, ఆయురారోగ్యాలనూ, పుత్రపౌత్రాదులనూ ప్రదానం చేస్తాము. శ్రాద్ధకర్మలో బ్రాహ్మణులు భోజనం చేస్తున్నపుడు వారికెదురుగా చేతులు జోడించి నిలబడి ఈ స్తోత్రాన్ని ప్రీతిపూర్వకంగా చదివితే మేమంతా అక్కడికి విచ్చేసి ఆ శ్రాద్ధఫలితాన్ని అక్షయం చేస్తాం.


ఏ శ్రాద్ధకర్మలోనైతే ఈ స్తోత్రం చదువబడుతుందో అక్కడ మేము పన్నెండు సంవత్సరాలకు సరిపడునట్లుగా తృప్తి నొందుతాము. హేమంతరువులో ఈ స్తవనం చేయువానిపై మా అనుగ్రహం పన్నెండేళ్ళ వఱకూ, శిశిరంలోనైతే ఇరవై నాలుగు, వసంత, గ్రీష్మర్తువుల్లోనైతే పదహారు సంవత్సరాల దాకా ఆ వ్యక్తి పైన ప్రసరిస్తూ వుంటుంది. వర్షాకాలంలో శ్రాద్ధ సమయంలో చదవబడే ఈ స్తుతి మా అందరికీ అక్షయ తృప్తినిస్తుంది. అంటే మా అనుగ్రహం కూడా ఆ వ్యక్తిపై అక్షయంగా వుంటుంది. ఇక శరత్కాలంలో శ్రాద్ధ సమయంలో ఈ స్తోత్ర పఠనాన్ని గావిస్తే మేము పదిహేనేళ్ళపాటు తృప్తినొందుతాము.


నాయనా రుచీ! ఈ సంపూర్ణ స్తోత్రం ఒకచోట వ్రాయబడి ఏ గృహంలోనైతే భద్రంగా వుంచబడుతుందో ఆ ఇంటికి శ్రాద్దకర్మ జరిగే వేళ మేమంతా స్వయంగా విచ్చేసి ఆ యజమానిననుగ్రహిస్తాము. కాబట్టి ఓ మహాభాగా! మాకు శ్రాద్ధం పెట్టువారు బ్రాహ్మణ భోజన సమయంలో ఈ నీ ప్రవచిత స్తుతిని తప్పక వినిపించాలి' అని చెప్పి పితరులు అంతర్ధానం చెందారు.


(మానవజాతికి పితరులు చేసిన ఈ వాగ్దానం శ్లోకరూపంలో అనుబంధం –10లో చూడండి.)


Monday 10 June 2024

శ్రీ గరుడ పురాణము (201)

 


ఈ స్తోత్ర భావంలో పితృదేవతల మాహాత్మ్యాన్ని తెలిపే విశేషాలు చాలానే కనిపిస్తాయి. వీరు ఆకాశంపై ఆధిపత్యాన్ని వహిస్తారు. శ్రాద్ధ సమయంలో దేవతలు కూడా స్వధామంత్రాల' ద్వారా వీరిని ప్రసన్నం చేసుకుంటారు. స్వర్గంతో సహా అన్ని లోకాల్లోనూ వుండే మహర్షులు మానసిక శ్రాద్ధాల ద్వారా వీరిని తృప్తి పరుస్తారు. వారి భుక్తి ముక్తి కామనలను పితృ దేవతలు తీర్చగలరు. స్వర్గంలోని సిద్ధులు వివిధ ఉపహారాల ద్వారా పితృదేవతలను సంతృప్తి పఱుస్తారు. అలాగే గుహ్యకాదులు కూడా. పృథ్విపై శ్రాద్ధాలను శాస్త్రోక్తంగా పెట్టేవారికి వీరు ఉత్తమ గతులను కల్పించగలరు. ఈ కర్మను చేయించే బ్రాహ్మణులను వీరే ప్రాజాపత్య లోకానికి పంపిస్తారు.


తపస్సు చేసుకుంటూ నిర్ధూతకల్మషులై, సంయతాహారులై వనంలో నివసించే మహామునులు కూడా వనంలో దొరికే పదార్థాలతో శ్రాద్ధకర్మలను చేసి వీరిని ప్రసన్నులను చేసుకుంటారు. నైష్ఠిక బ్రహ్మచారులూ, ధర్మాచారులూ, జితేంద్రియులూ కూడ వీరిని అపర కర్మల ద్వారా పూజించి ధన్యులౌతారు. పృథ్విపై గల నాలుగు వర్ణాల వారూ వీరికి శ్రాద్ధాలను పెట్టి ఉత్తమ గతులనందుకోగలుగుతున్నారు.


పాతాళంలో వుండే రాక్షసులు సైతం తమ దంభాహంకారాలను పక్కకు పెట్టి వినయంగా భక్తితో పితరులకు పిండప్రదానం చేస్తారు. రసాంతలాది ఇతర లోకాలలోని నాగాది జాతుల వారూ అలాగే చేస్తారు. దేవతలూ అంతే.


పరార్థం కోసం, అనగా ఇతరులకుపయోగపడడం కోసం, పితృయోనిలో వుండి కూడా, అమృతరూపులై విమానాల్లో ప్రయాణిస్తూ, నిర్మల మనస్సుతో, కష్టాల పాలైన యోగులకు, వాటి నుండీ, వారు కోరుకుంటే జీవితం నుండీ కూడా ముక్తిని ప్రసాదిస్తూ వుంటారు పితృదేవతలు. దేవతాకారాలను ధరించి స్వర్గంలో నివసిస్తూ, స్వధాభోజులై తమ పుణ్యఫలాన్నొక వంక అనుభవిస్తూనే మర్త్యాది లోకాల్లో తమను పూజించేవారికి పితృదేవతలు ఈప్సితార్థ సిద్ధిని కలిగిస్తుంటారు. ఏ కోరికాలేని వారికి కైవల్యాన్ని ప్రసాదించే సామర్థ్యం కూడ వారికి వుంటుంది.


అగ్నిలో వ్రేల్చిన హవిష్యాహుతులకు సంతృప్తి చెంది బ్రాహ్మణుని శరీరంలో ప్రవేశించి శ్రాద్ధ భోజనాన్ని స్వయంగా స్వీకరించే పితృదేవతలకు నమస్కరిస్తున్నానని ఇంకా అనేక విధాలుగా పితృ దేవతల మాహాౄత్మ్యాన్ని అభివర్ణిస్తూ రుచి ప్రజాపతి పితృస్తుతి కొనసాగింది.


Sunday 9 June 2024

శ్రీ గరుడ పురాణము (200)

 


రుచి ప్రజాపతి కృత పితృ స్తుతి 


నమస్యేహం పితౄన్ భక్త్యా యే వసన్త్యధిదైవతమ్!

దేవైరపి హి తర్ప్యన్తే యే శ్రాద్ధేయు స్వధోత్తరైః!!

నమస్యేహం పితౄన్ స్వర్గే యే తర్ప్యన్తే మహర్షిభిః!

శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తి మభీప్సుభిః!!

నమస్యేహం పితౄన్ సర్గే సిధాః సంతర్పయన్తియాన్!

శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః!!

నమస్యేహం పితౄన్ భక్త్యా యోర్చ్యన్తే గుహ్యకైర్దివి!

తన్మయత్వేన వాంఛద్భి యుద్ధిమాత్యన్తికీం పరామ్!!

నమస్యేహం పితౄన్ మర్త్యై రర్చ్యన్తే భువియే సదా!

శ్రాద్ధేయు శ్రద్ధయాభీష్టలోక పుష్టి ప్రదాయినః!!

నమస్యేహం పితౄన్ యే వై తర్ప్యన్తేరణ్యవాసిభిః!

వన్యైః శ్రాద్ధైర్యతాహారైస్తపో నిర్ధూతకల్మషైః!!

నమస్యేహం పితౄన్ విప్రైర్నైష్ఠికైర్ధర్మచారిభిః!

యే సంయతాత్మభిర్నిత్యం సంతర్పన్తే సమాధిభిః!!

నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః రాజన్యాస్తర్చయన్తియాన్!

కవ్యై రశేషైర్విధివల్లోకద్వయ ఫలప్రదమ్!!

నమస్యేహం పితౄన్ వైశ్యైరర్చ్యన్తే భువియే సదా!

స్వకర్మభి రతైర్నిత్యం పుష్పధూపాన్న వారిభిః!!

నమస్యేహం పితౄన్ శ్రాద్ధే శూద్రైరపి చ భక్తితః!

సంతర్ప్యన్తే జగత్కృత్స్నం నామ్నాఖ్యాతాః సుకాలినః!!

నమస్యేహం పితౄన్ శ్రాద్ధే పాతాళే యే మహాసురైః!

సంతర్ప్యన్తే సుధాహారా స్త్యక్త దర్పమదైః సదా!!

నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః అర్చ్యన్తే యే రసాతలేః!

భోగైరశేషైర్విధివన్నాగైః కామానభీప్సుభిః!!

నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః సర్పైః సంతర్పితాన్ సదా!

తత్రైవ విధివన్మహా భోగ సంపత్సమన్వితైః!!

పితౄన్నమస్యే నివసన్తి సాక్షాద్యే దేవలోకేధమహాతలేవా!

తధాన్తరిక్షేచ సురారి పూజ్యాస్తే వై ప్రతీచ్ఛన్తు మయోపధీతమ్!!

పితౄన్నమస్యే పరమార్థభూతా యే దై విమానే నివసన్త్యమూర్తాః!

యజన్తి యానన్తమలైర్మనోభి ర్యోగీశ్వరాః క్లేశవిముక్తి హేతూన్!!

పితౄన్నమస్యేదివి యే చ మూర్తాః స్వధాభుజః కామ్య ఫలాభినన్దౌ!

ప్రదానశక్తాః సకలేప్సితానాం విముక్తిదా యేనభిసంహితేషు!!

తృప్యన్తు తేస్మిన్పితరః సమస్తా ఇచ్ఛావతాం యే ప్రదిశన్తి కామాన్!

సురత్వమిన్ద్ర త్వ మితోధికం వా గజాశ్వరత్నాని మహాగృహాణి!!

సోమస్య యే రశ్మిషు యోర్కబింబే శుక్లౌ విమానే చ సదావసన్తి!

తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైర్గన్ధాదినా పుష్టిమతో వ్రజన్తుః!!

యేషాం హుతేగ్నే హవిషాచ తృప్తిర్యే భుంజతే విప్రశరీరసంస్థాః!

యే పిండదానేన ముదం ప్రయాన్తి తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైః!!

యే ఖడ్గ్మమాం సేన సురైరభీష్టైః కృష్ణైస్తిలైర్దివ్య మనోహరైశ్చ!

కాలేన శాకేన మహర్షివర్యైః సంప్రీణతాస్తే ముదమత్రయాస్తు!!

కన్యాన్య శేషాణి చ యాన్యభీష్టాన్యతీవ తేషాం మమ పూజితానాం!

తేషాం చ సాన్నిధ్య మిహాస్తు పుష్పగంధాంబు భ్యోజ్యేషు మయాకృతేషు!!

దినే దినే యే ప్రతిగృహ్ణతేర్చాం మాసాన్త పూజ్యా భువి యేష్టకాసు!

యే వత్సరాన్తేభ్యుదయే చ పూజ్యాః ప్రయాన్తు తేమే పితరోత్ర తుష్టిమ్!!

పూజ్యాద్విజానాం కుముదేన్దు భాసో యే క్షత్రియాణాం జ్వలనార్కవర్ణాః!|

తథా విశాం యే కనకావదాతా నీల ప్రభాః శూద్రజనస్య యేచ!!

తేస్మిన్సమస్తా మమ పుష్ప గంధధూపాంబు భోజ్యాది నివేదనేన!

తథాగ్ని హోమేన చయాన్తి తృప్తిం సదా పితృభ్యః ప్రణతోస్మి తేభ్యః!!

యే దేవ పూర్వాణ్యభితృప్తి హేతో రశ్నన్తి కవ్యాని శుభాహృతాని!

తృప్తాశ్చ యే భూతిసృజో భవన్తి తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మి తేభ్యః!!

రక్షాంసి భూతాన్యసురాంస్తథోగ్రాన్ నిర్ణాశయన్తు త్వశివం ప్రజానామ్!

ఆద్యాః సురాణామమరేశ పుజ్యాస్తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మితేభ్యః!!

అగ్నిష్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా!

వ్రజన్తు తృప్తిం శ్రాద్ధేస్మిన్పితర స్తర్పితా మయా!!

అగ్నిష్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షన్తు మేదిశం!

తథా బర్హిషదః పాన్తు యామ్యాం మే పితరః సదా!!

ప్రతీచీ మాజ్యపాన్త ద్వదుదీచీమపి సోమపాః!

రక్షో భూతపిశాచే భ్యస్తథైవాసురదోషతః!!

సర్వతః పితరో రక్షాం కుర్వన్తు మమ నిత్యశః!

విశ్వో విశ్వ భుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః!!

భూతిదో భూతికృత్ భూతిః పితౄణాం యే గణానవ!!

కళ్యాణః కల్యదః కర్తా కల్యః కల్యతరాశ్రయః!

కల్యతా హేతురనఘః షడిమే తే గణాః స్మృతాః!!

వరో వరేణ్యో వరదస్తుష్టిదః పుష్టిదస్తథా!

విశ్వపాతా తథా ధాతా సప్తైతే చగణాః స్మృతాః!!

మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః!

గణాః పంచ తథైవైతే పితౄణాం పాపనాశనాః!!

సుఖదో ధనదశ్చాన్యే ధర్మదోన్యశ్చ భూతిదః!

పితౄణాం కథ్యతే చైవ తథా గణ చతుష్టయమ్!!

ఏకత్రింశత్పితృగణా యేర్వ్యాప్త మఖిలం జగత్!

త ఏవాత్ర పితృగణాస్తుష్యన్తు చ మదాహితాత్!!

(ఆచార .... 81/13-49)


Saturday 8 June 2024

శ్రీ గరుడ పురాణము (199)

 


'నాయనా! నీవు పలుకుతున్న ప్రక్షాళన కార్యక్రమం అందరికీ ఆచరణీయం కాదు; సార్వజనీనమూ కాదు. లోక కళ్యాణకారకమూ కాదు. మనిషికి కొన్ని ధర్మాలుంటాయి. పూర్వజన్మల నుండి తెచ్చుకున్నవీ, ప్రారబ్ధకర్మఫలాలూ వుంటాయి. వాటిని బట్టి జన్మబంధా లేర్పడతాయి. అయితే ధర్మం కోసం చేసే పనికి బంధనాలు అంటవు. గృహస్థ ధర్మం అటువంటిదే.

 

ప్రారబ్ద పాప పుణ్యాలు దుఃఖ సుఖభోగాలతో పోతాయి. నీవు చెప్పిన విద్వజ్జనప్రవచిత ఆత్మ ప్రక్షాళనం సుఖదుఃఖ అనుభవముల ద్వారా జరిగిపోతుంటుంది. దానివల్ల కర్మబంధాల నుండి రక్షణ కూడా చేయబడుతుంది. నీ వివేకంతో సంసారంలో వుండి కూడా ఆత్మను రక్షించుకోగలవు' అన్నారు పితరులు.

 

'హే పితృదేవతలారా! కర్మమార్గం ద్వారా అవిద్యా మాయా బలపడతాయని వేదాలలోనే చెప్పబడింది కదా! మీరంతా నన్ను మార్గంలోకే పొమ్మని బలవంత పెడుతున్నారు' అన్నాడు రుచి.

 

'నాయనా! కర్మ ద్వారా ఆవిద్య పెరుగుతుందనే మాట అసత్యం కాదు. కాని విద్యావంతుడవడం కూడా ఒక కర్మే కదా! మాయను, ఆవిద్యనూ విచ్ఛిన్నం చేసే విద్య కూడా సంసారంలో భాగమే కదా! సజ్జనులెపుడూ శాస్త్ర ప్రతిపాదితములైన విహిత కర్మలను ఉల్లంఘించరు. వారికి వాటి ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది. ఎవరి కర్మను -వారు చేయాలి. అలా చేయని వారు అధోగతి పాలవుతారు. అపరిగ్రాహం ఆత్య ప్రక్షాళన హేతునే కాని అదే అపరిగ్రాహం కర్మల విషయంలో అపరిగ్రాహ్యం. అయినా ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెనూ ఉద్దరించి, నీవూ ఉద్ధరింపబడుతున్నావు కదా! వంశాన్ని అభివృద్ధి పరిచి, యజ్ఞయాగాదులను చేసి, దానధర్మాలను నిర్వర్తించిన వాడే విజమైన మనిషి. వానికి నిజమైన తోడు, నీడ స్త్రీయే. నువ్వు వివాహం చేసుకోక, వంశాభివృద్ధిని అరికట్టి పాపంలో కాలిపోతున్నావు.

 

అవిద్య విషంతో సమానమని విద్వజ్జనులు నీకు చెప్పారు కదా? కాని విషం కూడా మానవునికెన్నో విధాల ఉపయోగపడుతోంది కదా! కొండొకచో ప్రాణరక్షణ కూడా చేస్తున్నది. కాబట్టి కర్మల వల్ల ఆవిద్య, మాయ ఏర్పడినా వాటిని పటాపంచలు చేసే కర్మలున్నాయి. వాటినే నువ్వు చెయ్యి పెళ్ళి చేసుకో. గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టు' అని బోధ పఱచారు పితృదేవులు.


Friday 7 June 2024

శ్రీ గరుడ పురాణము (198)

 


రుచి ప్రజాపతితో పితరుల సంవాదం


శౌనకాది మహామునులారా! మార్కండేయ మహాముని క్రౌంచిక మహర్షికి ఒక సందర్భంలో పితృస్తోత్రాన్ని వినిపించాడు. దానిని వర్ణిస్తాను, వినండి.


ప్రాచీన కాలంలో రుచి ప్రజాపతి మాయా మోహమునుండి విడివడి, నిర్భయుడై, ఎక్కువ జపతపాలను చేస్తూ, కర్మలను గావిస్తూ, తక్కువ నిద్రిస్తూ, నిరహంకార భావనతో గొప్ప నియమబద్ధ ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ పృధ్విపైనే గడపసాగాడు, క్రమంగా అగ్ని హోత్రాన్నీ, గృహస్థాశ్రమాన్నీ పరిత్యజించి ఒక పూటే భోజనం చేస్తూ ఒంటరిగా తిరుగుతుండగా పితృ దేవతలతనికి దర్శనమిచ్చి ఇలా అడిగారు:


"వత్సా! నీవింకా వివాహమెందుకు చేసుకోలేదు? అది ఉన్నత గృహస్థాశ్రమానికి ద్వారమనీ, అది స్వర్గ, మోక్షప్రాప్తికి మార్గమనీ నీకు తెలియదా? గృహస్థు మాత్రమే అందరికీ పనికొస్తాడు; సమస్త దేవతలనూ, పితరులనూ, ఋషులనూ, అతిథులనూ, యాచకులనూ భోజనం ద్వారా పూజాదానాదుల ద్వారా సంతృప్తిపఱచి ఉత్తమ లోకాలను చేరుకోగలడు; దేవతలను స్వాహా మంత్రాలతోనూ, పితరులను స్వధామంత్రాలతోనూ అతిధులనూ, ధృత్యాదులనూ అన్నదానంతోనూ ఆనందింపజేయగలడు. అలా చేయక పోవడం వల్ల నీ పితృ, దేవ ఋణాలు తీరకుండా మిగిలిపోతాయి. అలాగే మనుష్యులకూ, ఋషులకూ, అన్యజీవాలకూ కూడా నువ్వు ఋణపడిపోతావు. పుత్రోత్పత్తి, దేవపూజ, పితృతర్పణాలు, చివరిదశలో సన్యాస గ్రహణం స్వర్గానికి సోపానాలు, మొదటి మెట్టుని కూడా చేరుకోని బతుకులెందుకు? పుత్రా! ఈ అన్యాయం వల్ల నీకు కలిగేవి కష్టాలు మాత్రమే. నీవు మరణించాక నరకానికే పోతావు. మరుజన్మలో కూడా క్షేశాలే ఎక్కువగా అనుభవమవుతాయి.


రుచి మిక్కిలి వినయంతో ఇలా బదులిచ్చాడు. మహానుభావులారా! మానవ జీవితంలో దేనినైనా పరిగ్రహించడం అత్యంత దుఃఖానుభవాన్నీ, పాప సంగ్రహాన్నీ, అనంతకాలం దాకా అధోగతినీ కలుగజేస్తుందనీ అందుచేత దేనినీ గ్రహించనివాడే ధన్యుడనీ విని యున్నాను. అందుచేతనే అనర్థాలకు మొదటి మెట్టు అయిన స్త్రీని పరిగ్రహించడానికి మొగ్గ లేదు. క్షణంలోనే అన్ని పుణ్యాలనూ నాశనం చేసే శక్తి ఆశకి వుంది. అందుకే నేనేదీ ఆశించలేదు. విద్య ద్వారా, సద్ జ్ఞానోపార్జన రూపియైన జలం ద్వారా తన ఆత్మను నిర్మలం చేసుకోగలిగినవాడే నా దృష్టిలో ధన్యుడు, ముక్తుడు, విద్వాంసులెంతోమంది అనేక విధాలుగా సాంసారిక కర్మలనే రూపాన్ని ధరించి మనిషిని పంకిలంలో కూరుకుపోయేటట్లు చేసే కుటుంబ జీవనాన్ని వర్ణించారు. ఇంద్రియాలకి దాసోహమై పోయే మనిషే స్త్రీ వెంటా, వివాహం వైపూ పరుగులు పెడతాడని బోధించారు. నేను జితేంద్రియ పురుషుడనై, తత్త్వజ్ఞానమనే తేటనీటితో నా ఆత్మ ప్రక్షాళనాన్ని చేసుకుంటున్నాను.'


Thursday 6 June 2024

శ్రీ గరుడ పురాణము (197)

 


పదవ మనువు ధర్మసావర్ణి. అతని పుత్రులు సుక్షేత, ఉత్తమౌజ, భూరిశ్రేణ్య, శతానీక, నిరమిత్ర, వృషసేన, జయద్రథ, భూరిద్యుమ్న, సువర్చ, శాంతి, ఇంద్రులు. ఈ మన్వంతర సప్తర్షులు అయోమూర్తి, హవిష్మాన్, సుకృతి, అవ్యయ, నాభాగ, అప్రతిమౌజ, సౌరభ మహామునులు, ప్రాణి నాయకులొక వంద దేవగణాల వారుంటారు. మహాబలశాలియు శాంతియను పేరుగలవారును నగు దేవపురుషుడింద్రుడవుతాడు. అతని శత్రువైన బలియను అసురుని విష్ణువు తన గదతో సంహరిస్తాడు.


పదకొండవ మనువైన రుద్రసావర్ణి కొడుకులు సర్వత్రగ, సుశర్మ, దేవానీక, పురు, గురు క్షేత్రవర్ణ, పుత్ర, దృడేషు ఆర్ట్రక నామకులు. ఈ మన్వంతరంలోని సప్తర్షులు హవిష్మాస్ హవిష్య, వరుణ, విశ్వ, విస్తర, విష్ణు, అగ్నితేజ మహామునులు. విహంగమ, కానుగను, నిర్మాణ, రుచి అను పేర్లతో నాలుగు దేవగణాలు ఒక్కొక్కటీ ముప్పదేసిమంది దేవతలతో వర్ధిల్లగలవు. వృషభుడను దేవపురుషుడు దేవేంద్రుడు కాగా అతని శత్రువైన దశగ్రీవ దైత్యుని విష్ణువు లక్ష్మీరూపమున అవతరించి వధిస్తాడు. ఈ రుద్రసావర్ణి మనువు శివపుత్రుడు.


తరువాత దక్షపుత్రుడైన దక్షసావర్ణి పన్నెండవ మనుపదవినధిష్టిస్తాడు. ఆయన పుత్రులు, దేవవాన్, ఉపదేవ, దేవశ్రేష్ఠ, విదూరథ, మిత్రవాన్, మిత్రదేవ, మిత్రబిందు, వీర్యవాన్; మిత్రవాహ, ప్రవాహులు. ఈ మన్వంతరంలో సప్తర్షులుగా తపస్వి, సుతవ, తపోమూర్తి, తపోరతి, తపోధృతి, ద్యుతి, తపోధన నామధేయులైన మహామునులు ప్రవర్తిల్లుతారు. స్వధర్మ, సుతపస, హరిత, రోహిత దేవగణాలుంటాయి. ప్రతి గణంలోనూ పదేసిమంది దేవతలూ, మొత్తం జాతికి ఋతధాముడను దేవేంద్రుడూ ఉంటారు. దేవశత్రువైన తారకాసురుని విష్ణువు నపుంసక స్వరూపమును ధరించి వధిస్తాడు.


పదమూడవ మనువు రౌచ్యుడు. ఆయన పుత్రులు చిత్రసేన, విచిత్ర, తప, ధర్మరత, ధృతె, సునేత్ర, క్షేత్రవృత్తి, సునయులు. ధర్మ, దృతిమంత, అవ్యయ, నిశారూప, నిరుత్సక, నిర్మోహ, సుధర్మ, సుకర్మ దేవగణాలు ముప్పది మూడేసి మంది దేవతలతో వర్ధిల్లుతాయి. దివస్పతి ఇంద్రుడు కాగా ఆయన శత్రువైన త్వష్టిభుడను దైత్యుని శ్రీమహా విష్ణువు మయూర స్వరూపంలో వచ్చి వధిస్తాడు.


పదునాల్గవ మనువు విష్ణుపుత్రుడైన భౌత్యుడు. ఆయన పుత్రులు ఊరు, గభీర, ధృష్ట, తరస్వీ, గ్రాహ, అభిమాని, ప్రవీర, జిష్ణు, సంక్రందన, తేజస్వి, దుర్లభులు. అగ్నీధ్ర, అగ్నిబాహు, మాగధ, శుచి, అజిత, ముక్త, శుక్రమహామునులు సప్తర్షులు. చాక్షుష, కర్మనిష్ఠ, పవిత్ర, భ్రాజిన, వచోవృద్ధి దేవగణాలు ఒక్కొక్క గణంలో మరల ఏడేసి ఉపగణాలతో వర్ధిల్లుతాయి. ఈ మన్వంతరానికి శుచి దేవేంద్రుడు కాగా అతని శత్రువైన మహాదైత్య నామక దైత్యుని శ్రీమహా విష్ణువే స్వస్వరూపంలో దిగి వచ్చి వధిస్తారు.


(ఆచార - 87)


Wednesday 5 June 2024

శ్రీ గరుడ పురాణము (196)

 



తరువాతి మనువు  పేరు తామసుడు. ఆయన పుత్రులు జానుజంఘ, నిర్భయ, నవఖ్యాతి, నయ, విప్రభృత్య, వివిక్షిప, దృఢేషుధి, ప్రస్తలాక్ష, కృతబంధు, కృత, జ్యోతిర్ధామ, పృథు, కావ్య, చైత్ర, చేతాగ్ని, హేమక నామకులు కాగా జ్యోతిర్ధార, దృష్టకావ్య, చైత్ర, చేతాగ్ని, హేమక, సురాగ, స్వధీయులు సప్తర్షులు, హర్యాది నాలుగు దేవతాగణాలుండగా శిబి చక్రవర్తి ఇంద్రుడైనాడు. ఆతని శత్రువైన భీమరథ దైత్యుని శ్రీ మహావిష్ణువు కూర్మావతార మెత్తి సంహరించాడు.


అయిదవ మనువైన రైవతుని పుత్రులు మహాప్రాణ, సాధక, వనబంధు, నిరమిత్ర, ప్రత్యంగ, పరహ, శుచి, దృఢవ్రత, కేతుశృంగులు. ఇతని కాలంలోని సప్తర్షులు వేదశ్రీ, వేదబాహు, ఊర్ధ్వబాహు, హిరణ్యరోమ, పర్జన్య, సత్యనామ స్వధామనామధేయులు. ఈ మన్వంతరంలో అభూతరజ, దేవాశ్వమేధ, వైకుంఠ, అమృత నామక దేవగణాలు విలసిల్లగా విభుడను మహావీరుడు ఇంద్రుడైనాడు. ఆతని శత్రువైన శాంతశత్రుడను దైత్యుని శ్రీ మహావిష్ణువు హంస రూపంలో వచ్చి వధించాడు.


అరవ మనువు చాక్షుషుడు. అతని పుత్రులు ఊరు, పురు, సత్యద్యుమ్న, సత్యబాహు, కృతి, అగ్నిష్టు, అతిరాత్ర, నర, సుద్యుమ్నులు, నాటి సప్తర్షులు హవిష్మాన్, సుతను, స్వధాన, విరజ, అభిమాన, సహిష్ణు, మధుశ్రీ మహామునులు. ఈ చాక్షుష మన్వంతరంలో ఆర్య, ప్రసూత, భవ్య, లేఖ, పృథుకు నామక దేవగణాలు విలసిల్లినాయి, మనోజవుడు ఇంద్రునిగా ఎన్నుకోబడినాడు. దేవశత్రువు, దీర్ఘవాహుడునగు మహాకాలాసురుని శ్రీ మహా విష్ణువు హయరూపుడై వధించాడు.


ఏడవ మనువైన వైవస్వతుని పుత్రులు మహావిష్ణుభక్తులైన ఇక్ష్వాకు, నాథ, విష్టి శర్యాతి, హవిష్యంతి, సాంశు, నధ, నేదిష్ట, కరూశ, షృశాధ్ర, సుద్యుమ్నులు, మహాతపస్సంపన్నులైన అత్రి, వశిష్ట, జమదగ్ని, కశ్యప, గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర మహర్షులు వైవస్వత మన్వంతరపు సప్తర్షులు, నలభైతొమ్మిది మరుద్గణాలు, ఆదిత్య, వసు, సాధ్య, మున్నగు ద్వాదశ దేవగణాలు వర్ధిల్లుతున్నాయి. పదకొండుగురు రుద్రులు, ఎనమండుగురు వసువులు, పదిమంది విశ్వేదేవులు, ఇద్దరశ్వనీ కుమారులు, పదిమంది అంగిరులు దేవగణాల్లోవున్నారు. ఇంద్రుని పేరు తేజస్వి, హిరణ్యాక్షుడను దేవశత్రువుని శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ధరించి సంహరించాడు.


ఇక రాబోయే మన్వంతరాలను గూర్చి వర్ణిస్తాను. మన వైవస్వత మన్వంతరం తరువాత రాబోతున్నది సావర్ణి మన్వంతరము, మనుపుత్రులు విజయ, ఆర్యవీర, నిర్మోహ, సత్యవాక్, కృతి, వరిష్ఠ, గరిష్ఠ, వాచ, సంగతులు. మహామునులైన అశ్వత్థామ, కృపాచార్య వ్యాస, గాలవ, దీప్తిమాన్, ఋష్యశృంగ, పరశురాములు ఈ మన్వంతరంలోని సప్తర్షులు. సుతపా, అమృతాభ, ముఖ్య నామక మూడు దేవగణాలుంటాయి. ఒక్కొక్క గణంలో ఇరవైమంది దేవతలుంటారు. విరోచన పుత్రుడైన బలి చక్రవర్తి దేవేంద్ర పదవినందుకుంటాడు గానీ అతనికి అహంకారం పెరగడంతో విష్ణువే వామన రూపంలో వచ్చి అతని నుండి మూడడుగుల దానాన్ని గ్రహించి అడుగుకొక లోకంగా ముల్లోకాలనూ ఆక్రమిస్తాడు. బలి సిద్ధినీ మోక్షాన్నీ పొందుతాడు.


వరుణపుత్రుడైన దక్షసావర్ణి తొమ్మిదవ మనువుగా వస్తాడు. అతని పుత్రులు దృతికేతు, దీప్తికేతు, పంచహస్తి, నిరామయుడు, పృథుశ్రవుడు, బృహద్యుమ్నుడు, ఋచీకుడు, బృహదుణుడు అనువారలు. ఈ మన్వంతరంలో మేధాతిథీ, ద్యుతి, సవస, వసు, హవ్య, కవ్య, విభులు సప్తర్షులు. పర, మరీచిగర్భ, సుధర్ము లింద్రులుగా ఎన్నికవుతారు. వారి ప్రధానశత్రువైన కాలకాక్ష దైత్యుని శ్రీ మహావిష్ణువు పద్మనాభుడై వధిస్తాడు.