Saturday 31 August 2024

శ్రీ గరుడ పురాణము (280)

 


సుందరమైన స్వచ్ఛమైన నీటిలో మాలిన్యాన్ని పోస్తే తాగడానికి పనికిరాకుండా పోతుంది. అలాగే దుష్టునితోడి సాంగత్యం వల్ల మంచివాడు చెడిపోతాడు. (అటునుంచి ఇటుకాదు)


దుర్జనస్యహి సంగేన సుజనోఽపి వినశ్యతి । 

ప్రసన్నమపి పానీయం కర్దమైః కలుషీకృతం ॥


ధనాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తేనే ఆ ధనం సద్వినియోగమయిందనుకోవాలి. అంతేగాక సాధ్యమయినంతగా బ్రాహ్మణులను సర్వవిధాలా సన్మానించుకోవాలి. బ్రాహ్మణులు తినగా మిగిలినదానిని తినుటయే ఉత్తమ భోజనకర్మ అనబడుతుంది. పాపము చేయనివాడే బుద్ధిమంతుడు. హితము చెప్పి చేయువాడే మిత్రుడు. దంభరహితంగా, అనగా డాబు డప్పాలతో గొప్పలు చెప్పుకోకుండా ఆచరించే ధర్మమే వాస్తవిక ధర్మాచరణం.


తద్భుజ్యతేయ ద్విజ భుక్తశేషం 

సబుద్ధిమాన్ యోన కరోతిపాపం ।

తత్ సౌహృదం యత్రియతే పరోక్షే 

దంభైర్వినాయః క్రియతే స ధర్మః ॥


వృద్ధజనులు లేని సభ సభేకాదు. ధర్మోపదేశం చేయని వృద్ధుని వృద్ధునిగా పరిగణించరు. సత్యము నిముడ్చుకోని ధర్మము ధర్మమూ కాదు, కపటంతో నిండిన సత్యం సత్యమూ కాదు. కపటసత్యమనగా ఒక మనిషి చేసిన మంచిపనిని మన వాదనా పటిమతో కపట వ్యూహరచనాశక్తితో చెడ్డపనిగా నిరూపించి మనము లాభము పొందునట్టిది. ఇక్కడ మనం చెప్తున్నది సత్యమేకాని వక్రించి చెప్తాం. (ఉదాహరణకి పరశురాముడు కర్ణుని శపించడం సత్యమే. కాని కర్ణుడు బ్రాహ్మణుడు కాడు కాబట్టి శపించేశాడని చాలమంది అనేస్తున్నారు. పరశురాముడు బ్రాహ్మణులకే విద్య చెప్తానని 'బోర్డు' పెట్టుకొని కూర్చొనలేదు. భీష్మునికి పరశురాముడే గురుదేవుడు. ఆయన బ్రాహ్మణుడు కాదు కదా! పరశురాముడు కర్ణుని, అబద్ధమాడి మోసం చేసి విద్యను సంగ్రహించాడని కోపించి శపించాడు. కర్ణుడు శపింప బడడంసత్యమే. ఆతడు ఇతరులతో చెప్పుకున్నది మాత్రం కపటసత్యం. ఏకలవ్యుని విషయంలో కూడా ఇలాంటి కపట సత్యాలెన్నో జనశ్రుతిలో వున్నాయి. విశ్వనాథ పావని శాస్త్రిగారి 'ఆచార్య దాక్షిణ్యం' అనే నాటకం చదివితే ఆ కపట సత్యాలన్నీ కాలి బూడిదై పోతాయి.


నసాసభాయత్ర న సంతివృద్ధాః 

వృద్ధా నతే యేన వదంతి ధర్మం |

ధర్మః సనోయత్ర న సత్యమస్తి 

నైతత్ సత్యం యచ్ఛలే నానువిద్ధం ॥


(ఆచార .. 115/52)


మనుష్యులలో బ్రాహ్మణులు (అంటే కులం కాదు వర్ణధర్మం మాత్రమే) తేజస్సులో ఆదిత్యుడు, శరీరంలో శిరస్సు, వ్రతాలలో సత్యవ్రతం శ్రేష్ఠతమాలు.

Friday 30 August 2024

శ్రీ గరుడ పురాణము (279)

 


ఈ సమాజంలో ఒక క్షణంలో పుట్టి మరొక క్షణానికే కనబడక మాయమైపోయే క్షణభంగురాలు చాలానే వున్నాయి. వాటిని నమ్ముకొనరాదు.


ఆకాశాన్ని కమ్ముకునే మబ్బునీడా, గడ్డిమంటా, నీచుడి సేవాభావం, దారిలో కనిపించే నీరూ, వేశ్యలకు ప్రేమా, దుష్టుని మనసులో పుట్టే ప్రీతీ ఈ ఆరూ క్షణభంగురాలు. మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకోరాదు. అలాగే మిగతా వాటినీ నమ్మరాదు.


అభ్రచ్ఛాయా తృణా దగ్నిర్నీచసేవా పథోజలం । 

వేశ్యారాగః ఖలే ప్రీతిః షడేతే బుద్బుదోపమాః ॥


(ఆచార .. 115-39)


బాల్యం తీరిన తరువాత నోరు పెట్టినా ఎవరూ పడరు. గౌరవం నోటిని బట్టి రాదు. బాలురకు మాత్రం రోదనమే బలం. నిర్బలులకు రాజే బలం. మూర్ఖునకు మౌనం బలం. దొంగకి అసత్యమే బలం. మనిషి శాస్త్రజ్ఞానాన్ని సంపాదిస్తున్న కొద్దీ వాని బుద్ధి వికసిస్తూ వుంటుంది. మరింత జ్ఞానాన్ని సంపాదించాలనిపిస్తుంది. అలాగే మనిషి జగత్కల్యాణం వైపు మనసును మళ్ళించగానే కొన్ని పనులు చేయడం ద్వారా కీర్తి లభించి, మనసు విశాలమై మరిన్ని మంచిపనులు చేయాలనిపిస్తుంది. అందుకే మంచి పని చేయాలనే ఆలోచన వచ్చిన ఉత్తరక్షణంలోనే దానిని అమలులో పెట్టెయ్యాలి.


యథాయథా హి పురుషః శాస్త్రం సమధి గచ్ఛతి!

తథా తథా స్యమేధా స్యాద్వి జ్ఞానంచాస్య రోచతే ॥

యథా యథా హి పురుషః కల్యాణే కురుతే మతిం |

తథా తథా హి సర్వత్ర శిష్యతే లోక సుప్రియః ॥ (ఆచార.. 115/42,43) 


లోభం ఎలాగూ మంచిదికాదు. ఒక్కొక్కప్పుడు చిన్నపొరపాట్లు, గట్టి నమ్మకము కూడా ప్రమాదిస్తాయి. కాబట్టి ఈ మూడింటి విషయంలో జాగ్రత్త అవసరం. భయం కూడా అలాటిదే. ఏదైనా ఆపద వస్తుందేమోనని భయపడి జాగ్రత్తగా వుండడం మంచిదేకాని ఆపద వచ్చేశాక మాత్రం భయాన్ని పూర్తిగా పరిత్యజించి ఆపదను ధైర్యంగా ఎదుర్కోవాలి.


ఋణశేషం అగ్నిశేషం వ్యాధిశేషం ఉంచినకొద్దీ ఋణాగ్ని వ్యాధులు పెరిగిపోతునే వుంటాయి. కాబట్టి వాటిని పూర్తిగా తుడిచిపెట్టాలి. 


ఋణశేషం చాగ్నిశేషం వ్యాధిశేషం తథైవచ ।

పునః పునః ప్రవర్ధంతే తస్మాచ్ఛేషం న కారయేత్ ॥


(ఆచార .. 115/46)


మనతో కలిసి వుండి మిత్రుని వలె నటిస్తూ మన పరోక్షంలో మన పనులన్నిటినీ తన స్వార్థం కోసం చెడగొట్టేవానిని అసలు విషయం తెలియగానే తన్ని తగిలెయ్యాలి. మాయావియైన శత్రునివలె.


పరోక్షే కార్య హంతారం ప్రత్యక్షే ప్రియవాదినం | 

వర్ణయేత్ తాదృశం మిత్రం మాయామయ మరింతథా|| (115/48)


Thursday 29 August 2024

శ్రీ గరుడ పురాణము (278)

 


నూరేళ్ళ జీవితం గొప్పనుకుంటాం కానీ ఈ నూరేళ్ళూ దేనికీ చాలదు. ఇందులో సగభాగం నిద్రలోనే గడచిపోతుంది కదా! మిగిలిన దానిలో సగభాగం వ్యాధి, దుఃఖం, వృద్ధాప్యంలచే తినివేయబడుతుంది. ఇక మిగిలిన దానిలోనే బాల్యము, ఇష్టజన వియోగ దుఃఖము లాంటి వన్నీ వుంటాయి కదా! ఇక జీవిక అనగా కొలువు. తిండికోసం పనిచేసే సమయం, దానిలోని సాధకబాధకాలు ఆ మిగతా సమయాన్ని మింగివేస్తాయి. కాబట్టి మనకి ఉన్న సమయంలోనే ధర్మాన్ని దైవకర్మాల్నీ ఆచరించాలి. అంతేకాని, దానికి 'చాలా వేళ వుందిలే' అనుకోకూడదు అని ఊరుకోకూడదు. సర్పం వాయువుని మింగేస్తున్నట్టు మృత్యువు ప్రతిక్షణం ఆయువును తినేస్తుంటుంది. అందుకనే మనం వయసు పెరుగుతోందని సరదాపడిపోకుండా ఆయువు తరుగుతోందని జాగ్రత్తపడాలి. 'యవ్వనవేళ' లోనే ఆధ్యాత్మికత వైపు మళ్ళాలి.


మనిషికీ పశువుకీ గల ముఖ్యమైన తేడా ఏమిటంటే నడుస్తున్నా, ఆగివున్నా, మేలు కొనివున్నా, నిద్రలోనైనా లోకహితాన్ని గురించే ఆలోచించడం మనిషి ధర్మం. ఆ ప్రసక్తే లేనిది పశుధర్మం. తన తిండి తాను తింటూ తన కోసం, తన పరిధిలోని జనాలకోసం మాత్రమే ఆలోచిస్తూ బతికేవాడికీ పశువుకీ పెద్దగా తేడా వుండదు. పశువు కూడా పిల్లలకి పాలిస్తుందిగా!


గచ్ఛ తస్తిష్ఠతో వాపి జాగ్రతః స్వపతో నచేత్ । 

సర్వసత్త్వ హితార్థాయ పశోరివ విచేష్టితం ॥


హితమేదో కానిదేదో తెలియకుండానే గొప్ప వాడైపోయి, వేద, పురాణ, శాస్త్ర చర్చలవేళల్లో తర్క- వితర్కాలను రెచ్చిపోయి చేసేస్తూ, తన కడుపు నిండగానే తనివితీరి పోయిందనుకునే వాడికీ పశువుకీ ఏమి తేడా వుంది? వీడు వాగుతాడు, అది వాగలేదు. వీనిలో ఏ వైశిష్ట్యమున్నదని వీనిని పశువుకంటె భిన్నుడనుకోవాలి.


పరాక్రమం, విద్య, అర్థలాభములతో బాటు తపస్సు, దానబుద్ధి కూడా గలవాడై ప్రపంచంలో కీర్తి సంపాదించనినాడు ఆ మనిషికీ ఆతని మాత విసర్జించే మలానికీ, సమాన ప్రయోజనమే వుంటుంది. విజ్ఞానము, పరాక్రమం, యశము, అక్షుణ్ణ సమ్మానయుక్తమునగు జీవితాన్నెవడైతే ఒక ఏడాదిపాటైనను గడపగలడోవాడే మనిషిగా బతికినట్లు విజ్ఞులు గుర్తిస్తారు. వానిది భాగ్యవైభవము, వాని దవంధ్య జీవనము అంటూ కవులు కీర్తిస్తారు.


కాకివలె బతికి ఏమి లాభం? హంస వలె గానీ సింహమువలె గానీ జీవించవలె. కాకి పెంటను తిని బతుకుతుంది. ఎన్నేళ్ళయినా వుంటుంది. ధర్మంగా ధనాన్ని సంపాదించి గురువులనూ, భృత్యులనూ ధనంతో కంటె ప్రేమతో కట్టిపడవేయ గలిగినవానిదే మానవ జీవనమవుతుంది. మనిషికి ముందు తన పట్ల తనకి గౌరవ భావముండాలి. ఆత్మాభిమాన ముండాలి గాని అహంకారముండకూడదు. భూతదయ లేనివాడు, మిత్రులకు మంచి పనులలో పెద్ద మనసుచేసుకొని సాయపడనివాడు ఎంత ధనవంతుడైనా సరేవాడు పోయిన నాడు ఊరి ప్రజలు 'మొన్న ఒక కాకి పోయింది. నేడు ఈయన పోయాడు. ఊరికి ఒరిగిందీ లేదు తరిగిందీ లేదు' అనుకుంటే వాడి పుట్టుకలోనే అర్ధం లేదు.


యో వాత్మనీహ నగురౌ నచ భృత్యవర్గే 

దీనే దయాం నకురుతే నచ మిత్ర కార్యే । 

కిం తస్య జీవిత ఫలేన మనుష్యలోకే 

కాకో-పి జీవతి చిరం చ బలించ భుంక్తే ॥ 

స్వాధీన వృత్తేః సాఫల్యం న పరాధీన వర్తితా | 

యే పరాధీన కర్మాణో జీవంతో-పి చతే మృతాః ॥


స్వాతంత్య్రమే స్వర్గలోకం. పరాధీనులై జీవించువారు మృతకల్పులు (ఆచార.. 125/35,37)

Wednesday 28 August 2024

శ్రీ గరుడ పురాణము (277)

 


మనిషికి అనేక సహస్ర చింతలుంటాయి గానీ వాటిలో నాలుగు మాత్రం తీక్షమైన కత్తివాదరలాగా మనసును కోసివేస్తుంటాయి. అవి నీచుడిచే అవమానింపబడడం, ఆలి ఆకలి, అనురాగం లేని ఆలు, ముఖ్యమైన ప్రాణాధార కార్యాలకు కలిగే అవరోధాలు. 


అనుకూలురైన కొడుకులు, ధనాన్ని సమకూర్చిపెడుతున్న విద్య, ఆరోగ్యం చెడని శరీరం, సత్సంగినీ మనోను కూలావశవర్తినీయైన భార్య ఈ పంచ భాగ్యాలూ పురుషుని దుఃఖాలన్నిటినీ దూరం చేస్తాయి.


లేడి, ఏనుగు, కీటకం, తుమ్మెద, చేప ఈ అయిదూ క్రమంగా శబ్ద, స్పర్శ, రూప, గంధ, రసాలను ప్రమాదకరస్థాయిలో ఇష్టపడి సేవించి పీకలమీదికి తెచ్చుకుంటాయి. ఈ సంగతి తెలిసి కూడా ఈ అయిదింటినీ ఇంద్రియ నిగ్రహం లేకుండా సేవించి సర్వజ్ఞుడనని చెప్పుకునే మనిషి కూడా నష్టపోతుంటాడు.


కురంగమాతంగ పతంగ భృంగ 

మీనా హతాః పంచభిరేవ పంచ । 


ఏకః ప్రమాదీ స కథం నఘాత్యో 

యః సేవతే పంచభిరేవ పంచ ॥


(ఆచార 115/21)


బృహస్పతితో సమానంగా చదువుకున్న బ్రాహ్మణులైనా ఈ అయిదుపనులనూ చేయరాదు. అవి ఏవనగా ధైర్యాన్ని కోల్పోవడం, కటువుగా ధుమధుమలాడుతూ వుండడం, గమ్యం లేకుండా జీవించడం, మలిన వస్త్రాలనే ధరించడం, అనాహూతంగా అంటే ఎవరూ పిలవకపోయినా సంబరాలకూ పెళ్ళిళ్ళకూ పోవడం. ఈ పనులలో ఒక్కటి చేసినా బ్రాహ్మణునికి పూజించేవారూ, గౌరవించేవారూ మిగలరు.


ఆయువు, కర్మ, ధనం, విద్య, మృత్యువు ఈ పంచాంశాలూ మనం పుట్టినపుడే నిశ్చితమైపోతాయి. మనం చేయవలసినదల్లా వాటిని మెరుగుపరుచుకొని జీవించడమే. భగవంతుని దయవుంటే మృత్యువు అనాయాసం కావచ్చు. ఆయువు ఆరోగ్యమయం కావచ్చు.


ఆయుః కర్మ చ విత్తం చవిద్యా నిధనమేవచ |

పంచైతాని వివిచ్యంతే జాయమానస్య దేహినః ॥


(ఆచార ...115/23)


మబ్బునీడ, దుష్టుని ప్రేమ, పరనారితోడు, యౌవనం, ధనం - ఈ అయిదూ అస్థిరాలు. మనిషికి సంబంధించినవన్నీ, ధర్మకీర్తులు తప్ప, అస్థిరాలే.


అభ్రచ్ఛాయాఖలే ప్రీతిః పరనారీషుసంగతిః । 

పంచైతే హ్యాస్థిరాభావా యౌవనాని ధనానిచ ॥


అస్థిరం జీవితం లోకే అస్థిరం ధనయౌవనం |

అస్థిరం పుత్ర దారాద్యం ధర్మః కీర్తిర్యశః స్థిరం ॥


(ఆచార ..115/25,26)

Tuesday 27 August 2024

శ్రీ గరుడ పురాణము (276)

 


నీచుడైన వ్యక్తి ఇతరులతో గొడవ పడడానికే ప్రయత్నిస్తుంటాడు. మధ్యముడు ఎక్కువగా సంధికోసమే ప్రయత్నిస్తుంటాడు. ఉత్తముడు గొడవపడడు. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటాడు. మహాపురుషులకు మానమే ధనముకదా! సన్మానమే వుంటే ఇక ధనమెందుకు? మానమూ దర్పమూ నశించినవానికెంత ధనముండి ఏమి లాభము? వాడు జీవించుట మాత్రము దేనికి? మాన, స్వాభిమాన యుగళము లేక ధన, ఆయుర్యుగళ ముండీ లేనట్లే కదా!


నీచ ప్రకృతి గలవాడు ధనాన్నే కోరుకుంటాడు. మధ్యముడు ధన, మానాలు రెండూ కావాలంటాడు. ఉత్తముడు గౌరవాన్ని మాత్రమే అభిలషిస్తాడు.


అధమాధన మిచ్ఛంతి ధనమానౌహి మధ్యమాః ।

ఉత్తమా మానమిచ్ఛంతి మానోహి మహతాం ధనం ॥


(ఆచార 115/13)


అడవిలోని సింహానికెంత ఆకలేసినా ఇతర జంతువులచే చంపబడిన జంతు లేక నరమాంసాన్ని తినదు. ఉత్తమ వర్ణుడైన వ్యక్తి ధనహీనుడైపోయినా నీచకర్మను చేపట్టడు. వనంలో సింహాన్ని అభిషేకించకపోయినా అది మృగరాజే. సమాజంలో ఉత్తమునికి గౌరవ మర్యాదలూ అలాగే లభిస్తాయి.


నాభిషేకో న సంస్కారః

సింహస్య క్రియతే వనే |

నిత్య మూర్జిత సత్త్వస్య 

స్వయమేవ మృగేంద్రతా ||


బద్ధకస్తుడైన వర్తకుడు, అహంకారియైన సేవకుడు, కటువుగా మాట్లాడే వేశ్యా తమ వృత్తులలో రాణించలేరు.


దరిద్రుడై వుండీ దాత కావాలనే కోరికా, ధనికుడై యుండీ పీనాసితనమూ, అతి గారాబం చేసి కొడుకుని చెడగొట్టుకోవడమూ, మంచివాడై వుండి దుష్టులను సేవించడమూ, ఇతరులకి కీడు చేస్తూ చనిపోవడమూ మనిషిని దుశ్చరిత్రుని చేసే పంచలక్షణాలు.


దాతా దరిద్రః కృపణో- ర్దయుక్తః పుత్రో- విధేయః కుజనస్యసేవా । 

పరాపకారేషు నరస్య మృత్యుః ప్రజాయతే దుశ్చరితాని పంచ ॥


కాంతా వియోగః స్వజనాప మానంఋణస్యశేషః కుజనస్య సేవా । 

దారిద్య్ర్య భావాద్విముఖాశ్చ మిత్రా వినాగ్నినా పంచదహంతి తీవ్రాః ॥


(ఆచార 115-17,18)


అలాగే అగ్ని అవసరం లేకుండానే మనిషిని తీవ్రంగా దహించి పడవేసేవి అయిదుంటాయి. అవి పత్నీవియోగం, స్వజనులే చేసే అవమానం, మిగిలిపోయిన ఋణం, దుర్జనులను సేవించవలసిరావడం, ధనహీనత వల్ల మిత్రులు పెడమొగమై పోవడం. 

Monday 26 August 2024

శ్రీ గరుడ పురాణము (275)

 


కొడుకు చెడిపోతే తల్లిదండ్రులకు దానికి మించిన నరకయాతన లేదు. అలాగే దురాచారిణియైన స్త్రీకి ప్రేమ వుండదు. కాబట్టి ఆ కుటుంబంలో ఒక్కరికీ సుఖమూ వుండదు. దుర్జనుడైన మిత్రుని ఎలాగూ నమ్మలేము కదా! నమ్మకం లేని చోట సుఖమెట్లా వుంటుంది? ఇక రాజ్యంలో దుష్టులంతా కలిసి దుష్టశాసనాలనే ప్రజలపై రుద్దుతూ పోతుంటారు కాబట్టి ప్రభుత్వం చేత ప్రేమింపబడుతున్న ఏ పాతికశాతం మందో సుఖపడతారు. వారే ఈ శాసనకర్తలను నిలబెడతారు కూడ. మిగతావాళ్ళు ఈ దేశంలో పుట్టించినందుకు దేవుణ్ణి తిట్టుకుంటూ ఎలాగో బతికేస్తుంటారు. ఎక్కువమంది ఇతరులపై ఆధారపడి బతికేస్తుంటారు. పరాన్నభుక్కు ఇంద్రుడైనా సరే వాని ఐశ్వర్యం చేజారిపోతుంది.


పరాన్నంచ పరస్వంచ పరశయ్యాః పరస్త్రీయః | 

పరవేశ్మని వాసశ్చ శక్రాదపి హరే చ్ఛ్రియం ॥


(ఆచార .... 115/5)


ఒక కుండలోని నీటిని ఇంకొక కుండలోని నీటితో కలిపినట్లు అంటురోగం కన్నను వేగంగా పాపం ఒకరినుండి ఒకరికి అంటుకుంటుంది. పాపితో నిత్యం మాట్లాడుతూ, శరీరాన్ని తగులుతూ, కలిసి తిరుగుతూ, తోడుగా భోంచేస్తూ, ఒకే ఆసనంపై, శయ్యపై మెలగుతూ ఒకే చోటికి వస్తూ పోతూ మంచివారెవరైనా ఎందరైనా సహజీవనం చేయవలసివస్తే ఆ పాపాత్ముడు మంచివాడు కాడు గానీ ఈ పుణ్యాత్ములంతా పూర్తిగా చెడిపోయి దురాత్ములై పోతారు. ఈ రకమైన సహజీవనం కలియుగంలో తప్పనిసరి.


స్త్రియో నశ్యంతిరూపేణ తపః క్రోధేన నశ్యతి |

గావో దూర ప్రచారేణ శూద్రా న్నేన ద్విజోత్తమః |


(ఆచార ... 115/7)


అందం వల్ల ఆడది చెడగా, క్రోధం వల్ల తపస్సు తగలబడిపోతుంది. దూర ప్రయాణాల వల్ల గోవులు దూరం కాగా, *శూద్రాన్నంవల్ల ఎంతటి ద్విజోత్తములైనా 

దిగజారిపోతారు.


*ఇక్కడ శూద్రాన్నం అంటే ఏ వెనుకబడిన కులంవారో, ఇప్పటి భాషలో, వండిపెట్టిన అన్నం కాదు. అది మూర్ఖపుటాలోచన, మడీ, తడీ, శుచీ శుభ్రతా లేని అన్నమే అప్పటి భాషలో శూద్రాన్నము. గొడ్డుకారము, గుప్పెడు ఉప్పు కలిసినది శూద్రాన్నము. నీచుతో నిండినది శూద్రాన్నము. అలాగే ద్విజులనగా బ్రాహ్మణులు మాత్రమే కారు. ఇలా ఎందుకు చెప్పవలసివస్తుందంటే ఈ 'శూద్ర' శబ్దాన్ని చూపించి పరదేశీయులు, వారి మానసపుత్రులు కపట వ్యూహరచన చేసి ఒక పథకం ప్రకారం గ్రంథాలు వ్రాసి, ఉపన్యాసాలిస్తూ ఇప్పటికే ఈ సమాజాన్ని విడగొట్టేయడంలో చాలావరకు విజయం సాధించారు.

పిల్లల, శిష్యులపట్ల బాధ్యతకు బదులుగా అతి గారాబం, స్వార్థం చోటు చేసుకోవడం వల్ల కలియుగంలో తల్లిదండ్రుల, గురువుల ప్రవర్తన కారణంగా యువతరానికి సరైన దిశా నిర్దేశం లేకపోతుంది. వృద్ధాప్యంలో మానవులకి నడక ఎక్కువవుతుంది. స్త్రీకి సంభోగం లుప్తమవుతుంది. పర్వతాలకు నీటి దెబ్బ తగులుతుంది. బట్టలు ఎక్కువ కాలం ఎండలో వుండడం వల్ల చివికిపోతాయి.

Sunday 25 August 2024

శ్రీ గరుడ పురాణము (274)

 


పొరపాటున కూడా దుష్టునీ, శత్రవునీ ఉపేక్షించకూడదు. వాళ్ళు అల్పులే, పరవాలేదు అనుకోకూడదు. చిన్న నిప్పురవ్వే బ్రహ్మాండమును భస్మము చేయగలదని మరువరాదు.


యౌవనంలో కూడా శాంతంగా వుండగలవాడే నిజమైన శాంత స్వభావి. అన్నీ అయిపోయినవాడూ, శక్తులన్నీ ఉడిగిపోయినవాడూ శాంతుడు కాక చేసేదేముంటుంది?


నవే వయసి యఃశాంతః సశాంత ఇతి మేమతిః । 

ధాతుషుక్షీయమాణేషు శమః కస్య న జాయతే ॥


(ఆచార ... 114/73)


సంపదలన్నీ భగవంతుడివీ, ఆయన ప్రసాదించిన ప్రకృతివీనీ.


'ఈ సంపదంతా నాది' అని ఏ మనిషి భ్రమపడరాదు. (అధ్యాయాలు-113, 114) 


నీతిసారం


వివేకవంతుడు, నీతిజ్ఞుడు అయినవాడు గుణహీన పత్నినీ, దుష్టమిత్రునీ, దురాచారియైన రాజునీ, కుపుత్రునీ, గుణహీనకన్యనీ, కుత్సిత దేశాన్నీ దూరం నుండే పరిత్యజిస్తాడు.


కలియుగంలో ధర్మం మానవ సమాజం నుండి దూరంగా పారిపోతుంది. తపస్సులో స్థిరత వుండదు; మానవుల హృదయాలకు సత్యం దూరమైపోతుంది. మనుష్యులు కపట వ్యవహారమగ్నులై బతికేస్తుంటారు; బ్రాహ్మణులు ఆశపోతులైపోయి ధనదాహంతో మసలుతుంటారు; పురుషులు స్త్రీల అడుగులకు మడుగులొత్తడమే తమ జీవిత పరమార్థంగా భావిస్తారు; స్త్రీలు తమ మనస్సును, బుద్ధిని స్థిరంగా పెట్టుకోలేకపోయినా తెలివితేటల, అందచందాల ఆసరాతో లోకాన్నే ఒక ఆట ఆడిస్తుంటారు.


కాబట్టి ఈ కలికాలంలో నీచ ప్రవృత్తి గల వారే పెద్ద పెద్ద పదవులలోకి వచ్చి దేశాన్నేలుతూ మొత్తం లోకాన్నే భ్రష్టు పట్టించడంతో సుజనులకు సామాన్య జీవనం కూడా మిక్కిలి కష్టసాధ్యమైపోతుంది. పోయినవాళ్ళే ధన్యులనిపిస్తుంది. ఉన్నవాళ్ళు పోయిన వారికి తీపి గురుతులు కాకుండా చేదు జ్ఞాపకాలుగా మిగులుతారు. ఎప్పటికప్పుడే ‘ఆహా! మృతులెంత అదృష్టవంతులో కదా! ఈ అరాచకాన్నీ, ఈ దేశం ముక్కలైపోడాన్ని, ఈ సమాజం సర్వభ్రష్టత్వాన్ని, పరాసక్తలైన పత్నులనీ, దురాచారాసక్తులైన పుత్రులనీ చూడకుండానే పోయారు. వారు ఏ లోకంలో వున్నా ఈ లోకంలోని మనకంటే సుఖంగానే వుండివుంటారు అని వృద్ధులంతా తమలో తాము, తమతోతాము సంభాషించుకొంటుంటారు.


Friday 23 August 2024

శ్రీ గరుడ పురాణము (273)

 


పాలీయని, చూలు కట్టని ఆవు, విద్వాంసుడు, ధార్మికుడు కాని కొడుకు ఉండి మాత్రం లాభమేమి? చంద్రుడొక్కడే అయినా ఆకాశమంతా వెలుగొందునట్లు మహా పురుషుడైన కొడుకు వల్ల వంశమంతా వన్నెకెక్కుతుంది. తారలెన్ని వున్నా చంద్రుడే శోభస్కరుడు కుపుత్రులు వందమంది కంటె గుణవంతుడైన ఒక్క కొడుకే మేలు, చాలు.


ఏకేనాపి సుపుత్రేణ విద్యాయుక్తేన ధీమతా । 

కులం పురుష సింహేన చంద్రేణ గగనం యథా ॥

ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధితా | 

వనంసువాసితం సర్వం సుపుత్రేణ కులం యథా ॥

ఏకోహి గుణవాన్ పుత్రో నిర్గుణేన శతేన కిం !

చంద్రోహంతి తమాం స్యే కో నచ జ్యోతిః సహస్రకం ॥ (ఆచార...114/59)


పిల్లలను అయిదేళ్ళ వయసొచ్చేదాకా ప్రేమ కురిపిస్తూ పెంచాలి. అక్కడి నుండి పదేళ్ళు వచ్చేదాకా అవసరమైతే దండించియైనా క్రమశిక్షణ నేర్పాలి. పదారేళ్ళదాకా విద్యాబుద్ధులు నేర్పి ఆ తరువాత వారిని మిత్రుల వలె సంభావించాలి.


కొందరి ముఖాలు పులిముఖాల వలెనున్నా వారు సాత్త్వికులు కావచ్చు. కొందరి ముఖాలు లేడి ముఖాల వలె అమాయకంగా వున్నా వారు క్రూరులూ కావచ్చు. అందుచేత పైపై చూపులతో ఎవరినీ విశ్వసించరాదు.


క్షమించే లక్షణం వున్నవారిలో అది దోషం కూడా కావచ్చు. ఎందుకంటే జనులు వారు అసమర్థులనుకుంటారు.


ఏకః క్షమావతాం దోషో ద్వితీయో నోప పద్యతే । 

యదేశం క్షమయా యుక్తమశక్తం మన్యతే జనః ॥


ఈ ప్రపంచంలోని భోగాలన్నీ క్షణభంగురాలేనని శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. కాబట్టి అనుభవించవచ్చు గాని ఆరాటపడరాదు. విద్వాంసుడెపుడూ ఆకర్షణకు లోను కాడు. అన్న పితృసమానుడే. నాన్న చనిపోతే ఆ కుటుంబానికి అన్నే దిక్కవుతాడు.


తమ్ముళ్ళందరినీ పైకి తెచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళునిలబడేలా చేసే అన్న నాన్నే కాదు దేవుడితోసమానుడవుతాడు. కాబట్టి అన్నను దేవునివలె చూసుకొనేవాడే నిజమైన మనిషి. తక్కువ బలం కలవారిని తక్కువగా చూడకూడదు. వారు ఒక బృందంగా ఏర్పడితే ఏమైనా చేయగలరు. గడ్డి పరకలతో నేసిన తాడు ఏనుగునే బంధించగలుగుతున్నది కదా!


ఒకరిని దోచి ఇంకొకరికి దానం చేయువానికి ఆ దానం సద్గతి నివ్వదు. దోపిడీలు చేసిన పాపానికి వాడు నిస్సందేహంగా నరకానికే పోతాడు. దేవతల, బ్రాహ్మణుల ధనాన్ని అపహరించినా, వారిని తిరస్కారంగా చూసినా వంశం వృద్ధికాదు. బ్రహ్మహత్య, మద్యపానం వంటి మహాపాతకాలకు కూడా ప్రాయశ్చిత్తముంది కాని సజ్జనుల వద్ద ఉపకారాన్ని పొంది వారికే కీడు చేసే కృతఘ్నులకు నిష్కృతి లేదు.

Thursday 22 August 2024

శ్రీ గరుడ పురాణము (272)

 


తలంటి విరళంగా పోసుకోవడం, పాదాలు అవసరం మేరకు కడుక్కుంటుండడం, వేశ్యను సంపూర్ణంగా వర్ణించడం, శరీరమంతా శుభ్రంగా వుంచుకోవడం, అల్పంగానే తినడం, నగ్నతలేకుండా శయనించడం- ఈ పనులన్నీ చేయువాని వద్దకు లక్ష్మి వచ్చి చేరుతుంది.


బాలసూర్యుని తేజం, రగులుతున్న చితి యొక్క పొగ, వృద్ధ (తనకంటే పెద్ద) స్త్రీ సాంగత్యం, చీపురు నుండి వచ్చే దుమ్ము ఇవన్నీ ఆయుక్షీణాలు.


ఏనుగు, గుఱ్ఱం, రథం, గోవు, ధాన్యంల నుండి రేగే ధూళి శుభకరమే కాని గాడిద, ఒంటె, గొట్టె, మేక నడిచినపుడు రేగే ధూళి అశుభకరం. ముఖ్యంగా ఆవు, ధాన్యము, పుత్రుని అంగముల నుండి వచ్చు ధూళి కల్యాణకారి, మహాపాతక వినాశిని.


దేన్నయినా చేటతో విసురుతున్నపుడు వచ్చే గాలి, గోటి నీరు, స్నానం చేశాక గుడ్డ దులిపినపుడు చిలికే జలం, తల వెంట్రుకల నుండి జారే నీరు, చీపురు ధూళి బహు చెడ్డవి. ఇవి ఆర్జిత పుణ్యాన్నంతటినీ నశింపజేయగలవు. బ్రాహ్మణునికీ, అగ్నికీ, గుఱ్ఱానికీ ఎద్దుకీ, ఇద్దరు బ్రాహ్మణులకీ, ఆలుమగలకి, యజమాని దంపతులకీ మధ్య నుండి వెళ్ళరాదు.


విశ్వసించకూడనివారిని అసలు విశ్వసించనేకూడదు. నమ్మదగినవారిని కూడడా అతిగా పూర్తిగా నమ్మకూడదు. దీనివల్ల అంటే నమ్మడం వల్ల ఒక విలక్షణమైన భయం పుట్టుకొస్తుంది. అది మన సుఖాలన్నింటినీ నాశనం చేస్తుంది. శత్రువుతో సంధి చేసుకోవచ్చు గానీ వానిపై విశ్వాసముంచుట చిటారుకొమ్మ మీద నిద్రపోవడం వంటిదే.


నవిశ్వసే దవిశ్వస్తం విశ్వస్తం నాతి విశ్వసేత్ !

విశ్వాసాద్భయముత్పన్నం మూలాదపి నికృంతతి ॥

వైరిణా సహసంధాయ విశ్వస్తో యది తిష్ఠతి |

సవృక్షాగ్రే ప్రసుప్తోహి పతితః ప్రతిబుద్ధ్యతే ॥


(ఆచార ... 114/47,48)


పడిపోయాకే తెలుస్తుంది పడిపోయానని.


అత్యంత కాఠిన్యమూ, అలవి మీరిన మెత్తదనమూ రెండూ తప్పే. బలహీన కాండములు గల మొక్కలను శ్రమలేకుండా నరకవచ్చు. మహావృక్షాలు ఒకపట్టాన లొంగవు.


మనం ఆహ్వానించకపోయినా దుఃఖాలు వస్తాయి; వాటంతట అవే పోతాయి కూడ. సుఖాలు కూడా అంతే. సాధారణంగా సజ్జన పురుషులు సుఖపడతారు. దుష్టులకు దుఃఖాలు తప్పవు. కాబట్టి సజ్జనులుగానే జీవించాలి.


రహస్యం నాలుగు చెవుల మధ్యనే వుండాలి. ఆరో చెవి దాకా వెళితే అది రహస్యం కాబోదు. భవిష్యద్ వ్యూహాలూ రెండు చెవుల మధ్యనే అనగా ఒక మనిషి బుఱ్ఱలోనే వున్నంతకాలం అవి బ్రహ్మకు కూడా తెలియవు.


షట్కర్లో భిద్యతే మంత్రశ్చతుః కర్ణశ్చ ధార్యతే |

ద్వికర్ణ స్యతు మంత్రస్య బ్రహ్మాప్యంతం నబుధ్యతే ॥


(ఆచార ...114/54)

Wednesday 21 August 2024

శ్రీ గరుడ పురాణము (271)

 


నమ్మకూడని వానిని నమ్ముకోకూడదు. లోకంలో అందరి నమ్మకాన్ని వమ్ము చేసినవాడు తనకు మాత్రం నమ్మకస్తుడెలా అవుతాడు? ఆ మాటకొస్తే మిత్రుని కూడా అతిగా విశ్వసించరాదు.


న విశ్వసే దవిశ్వస్తే మిత్రస్యాపి న విశ్వసేత్ |

కదాచిత్ కుపితం మిత్రం సర్వం గుహ్యం ప్రకాశయేత్ ॥ (ఆచార... 114/22)


మిత్రునికి కోపం వస్తే మన రహస్యాలు బయటపెట్టే ప్రమాదముంది కావున ఎవరినీ నమ్మవద్దని సామాన్యులకు పెద్దలు చెప్తారు కానీ అన్ని ప్రాణులనూ విశ్వసించడం, అన్నింటి పట్లా సాత్త్వికభావాన్నే కలిగియుండడం, తమదైన సాత్త్విక స్వభావాన్ని యెల్లవేళలా సంరక్షించుకోవడం సజ్జన పురుషుల లక్షణాలు.


దరిద్రునికి 'గోష్ఠి' అనేది విషంతో సమానం. (గోష్ఠి అంటే నేటి పార్టీలిచ్చుట) అలాగే వృద్ధునికి నవయువతీ సంగమం, మిడిమిడి జ్ఞానంతో ఆపేసిన చదువు, అజీర్ణంగా నున్నపుడు చేసే విందు భోజనం కూడా విషంతో సమానాలే.


మనుష్యుని శరీరంలోకి రోగం ప్రవేశించడానికి ఆరు కారణాలుంటాయి. ఎక్కువగా నీరు త్రాగుట, అతిగా తినుట, ధాతు క్షీణత, మలమూత్ర విసర్జనను తొందర తొందరగా కానిచ్చి వేయుట లేదా ఆపుకొనుట, పగటి నిద్ర, రాత్రి జాగరణ- వీటిలో ఒక్కటి చాలు... శరీరం లోకి రోగం ప్రవేశించడానికి.


తెల్లవారకుండానే వేసే ధూపం, అతిగా రతి, శ్మశానం పొగలను పీల్చుట, అగ్నిలో చేతిని పెడుతూ తీస్తూ ఆడుట, రజస్వలతో సంభాషణ - ఇవి దీర్ఘాయుష్కుల ఆయువునే తగ్గించే శక్తి కలిగి వుంటాయి. ఇలాగే ఆయువును నాశనం చేసేవి మరో ఆరున్నాయి: ఎండిన మాంసం, వృద్ధ స్త్రీ, బాలసూర్యుడు, రాత్రి పెరుగు సేవనం, ప్రభాతకాలంలో మైథునం మరియు నిద్ర.


అప్పుడే తయారైన నెయ్యి, ద్రాక్షపండ్లు, వయసులో నున్న స్త్రీ, పాలు, వేడినీరు, చెట్టు నీడ - వీటిని అనుభవించగానే ప్రాణశక్తి బలపడుతుంది. నూతినీరు, మఱ్ఱి చెట్టు నీడ శీతాకాలంలో వెచ్చగానూ వేసవిలో చల్లగానూ వుంటాయి. తైలమర్దనం, సుందర భోజనం పొందగానే శక్తి కలుగుతుంది. మార్గాయాసం, మైథునం, జ్వరం తాత్కాలికంగా మనిషిని నీరసపెడతాయి.


మాసిన బట్టలు ధరించేవారు, పళ్ళు శ్రద్ధగా తోముకోనివారు, అధికంగా తినేవారు, కఠోరంగా మాట్లాడేవారు, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో నిద్రించేవారు సాక్షాత్తూ విష్ణు సమానులైనా సరే వారికడ లక్ష్మి నిలువదు.


కుచైలినం దంతమలోపధారిణం 

బహ్వాశినం నిష్ఠుర వాక్య భాషిణం ! 

సూర్యోదయే హ్యస్త మయే పిశాయినం 

విముంచతి శ్రీరపి చక్రపాణిం ॥ 


తన గోళ్ళతో గడ్డిని చీల్చువాడు, నేలపై వ్రాసే వాడు, కాళ్ళు కడుక్కోనివాడు, దంతాలను స్వచ్ఛందంగా ఉంచుకోనివాడు, నగ్నంగా శయనించువాడు, భోజన పరిహాసాలతిగా చేయువాడు, తన అంగాలపై ఆసనంపై మద్దెల కొట్టుకొనువాడు, కేశసంస్కారం చేసుకోనివాడు, ప్రాతస్సాయం సంధ్యలలో నిదురించువాడు, కుచైలుడు - ఇలాంటి వారి కడకూడా లక్ష్మి నిలువదు. 


Tuesday 20 August 2024

శ్రీ గరుడ పురాణము (270)

 


మునులారా! ఎవరూ ఎవరికీ పుట్టుకతోనే మిత్రులుగానీ శత్రువులు గానీ కారు. కారణంవల్లనే ఆ బంధాలేర్పడుతున్నాయి. ఈ 'మిత్ర' శబ్దం అక్షర రూపంలోనున్న రత్నమే. ఈ శబ్దం మనిషికి సుఖాన్ని కలిగిస్తుంది. ప్రాణికోటికి ప్రేమను కురిపించేవాడూ విశ్వాసాన్ని చూపించేవాడూ మిత్రుడొక్కడే. స్వార్థం లేని బంధం కూడా ఇదొక్కటేనేమో!


ఇంతకన్న పవిత్రమైన శబ్దం 'హరి'. ఈ శబ్దానుచ్చరించేవాడు బట్టలు వేసుకొని బత్తాములు పెట్టుకొని బయటికి బయలుదేరినంత సుఖంగా మోక్షపదవినందడానికి లోకం నుండి పైకి వెళతాడు.


సకృదుచ్ఛరితం యేన హరిరిత్యక్షర ద్వయం | 

బద్ధః పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి ॥


(ఆచార ... 114/3)


అన్ని విధాలా తన తోటివాడేయైన మిత్రుని మీద వున్న నమ్మకం మనకి తల్లిదండ్రుల మీద భార్యాపుత్రుల మీద కూడా వుండదు. మిత్రత్వాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోదలచుకున్నవారు ఒకరితో నొకరు జూదమాడకూడదు, ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకూడదు, ఒకరి భార్యకింకొకరు దూరంగా వుండాలి.


మధుర పదార్థాల ద్వారా చిన్నపిల్లలనూ, వినమ్రభావంతో సజ్జన పురుషులనూ, ధనం ఇస్తానని చెప్పి స్త్రీనీ, తపస్సు చేసి దేవతలనూ, చక్కని, కమ్మని మాట తీరును చూపించి (అనగా సద్వ్యవహార విశేషాన) సమస్తలోకాన్నీ వశపఱచుకోగలిగినవాడే నిజమైన పండితుడు.


కపటం ద్వారా మిత్రులనూ, పాపపు సొమ్ము ద్వారా ధర్మాన్నీ, ఇతరులను పీడించి ధనాన్నీ, పెద్దగా శ్రమించకుండా సుఖంగా విద్యనూ, కఠోర వ్యవహారం ద్వారా క్రూరంగా భయపెట్టి స్త్రీనీ వశం చేసుకోదలచినవాడు వివేకవంతుడు కాడు. ఇవేవీ తెలివైన పనులు కావు. ఆ కపటం, ఆ భయం, ఆ ధనం, ఆ బలం పోగానే ఆయా సంపదలూ పోతాయి.


పండ్లకోసం చెట్టును పెకలించేవాడు దుర్భుద్ది. ఎంత ప్రయత్నమైనా చేసి పండ్లు కోసుకోవాలేగాని చెట్టుని నాశనం చేయడం అవివేకం. 


Monday 19 August 2024

శ్రీ గరుడ పురాణము (269)

 


ప్రాణియొక్క మృత్యువు ఆ మృత్యుకారణమున్న చోటే వుంటుంది. లక్ష్మి ఎక్కడుంటుంది? సంపదలున్నచోటే కదా! మన కర్మ చేత ప్రేరేపింపబడి మనమే ఆయా ఫలానున్న చోటికి వెళ్తాము. గోశాలలో ఎన్ని గోవులున్నా దూడ తన తల్లి వద్దకే పోయినట్లు ప్రపంచంలో ఇంతమంది వున్నా నీ పూర్వకర్మఫలం నిన్నే చేరుకుంటుంది. 


తత్రమృత్యుర్యత్ర హంతా తత్ర శ్రీర్యత్ర సంపదః | 

తత్ర తత్ర స్వయం యాతి ప్రేర్యమాణః స్వకర్మభిః ॥ 

భూతపూర్వం కృతం కర్మ కర్తార మనుతిష్ఠతి | 

యథాధేను సహస్రేషు వత్సో విందతి మాతరం ॥


(ఆచార ... 113/53,54)


మూర్ఖ ప్రాణులకు తెలియదు. చెప్పినా వినరు. తమకు కలిగిన దుఃఖాలకు కోపించి దేవుని నిందిస్తారు. మనుజులపై కక్ష పెట్టుకుంటారు. ఫలితంగా మరిన్ని పాపాలుచేసి వచ్చే జన్మలో కూడా ఇలాగే తగలడతారు. తన సుఖదుఃఖాలతో ప్రమేయం లేకుండా పుణ్యకార్యాలు చేసినవాడే ఇప్పుడు సుఖంగా బతుకుతున్నాడని తెలుసుకోవాలి.


ఇతరుల దోషాలను వెతికి పట్టుకోవడంలో గొప్ప తెలివితేటలు ప్రదర్శిస్తూ తనుచేసే తప్పులను మాత్రం కానుకోలేనివాడు గేదెలాంటివాడు.


నీచః సర్షపమాత్రాణి పరచ్ఛిద్రాణి పశ్యతి । 

ఆత్మనో బిల్వమాత్రాణి పశ్యన్నపి న పశ్యతి ”


(ఆచార ... 113/57)


రాగద్వేషాల నంటి పెట్టుకొని బతికే జీవికి ఎక్కడా సుఖముండదు. సంతోషమున్న చోటనే సుఖముంటుంది. స్నేహమున్న చోట ఆ స్నేహమేమైపోతుందో, తను ప్రేమించిన వారి గతి ఏమిటోనని భయముంటుంది. ఇదే మమకారం. దీనిని విసర్జించినవాడే సుఖపడగలడు. ఈ శరీరమే సుఖదుఃఖాల నిలయం. అవి శరీరంతోనే పుడతాయి.


పరాధీనతయే దుఃఖం, స్వాధీనతయే సుఖం. మనిషికి సుఖదుఃఖాలు ఒకదాని వెంటనొకటి చక్రంలోని కర్రలలాగా వస్తూనే వుంటాయి; పోతూనే వుంటాయి. అనాసక్త భావంతో అన్ని పనులూ చేసుకొనే వాడొక్కడే నిత్యసుఖి.


సర్వం పరవశం దుఃఖం సర్వమాత్మవశం సుఖం | 

ఏ తద్విద్యాత్ సమాసేన లక్షణం సుఖదుఃఖయోః । 

సుఖస్యానంతరం దుఃఖం దుఃఖ స్యానంతరం సుఖం | 

సుఖం దుఃఖం మనుష్యాణాం చక్రవత్ పరివర్తతే | 

యద్గతింతదతిక్రాంతం యది స్యాత్ తచ్చదూరతః । 

వర్తమానేన వర్తేత నస శోకేన బాధ్యతే ॥


(ఆచార ...113/61-63)


Sunday 18 August 2024

శ్రీ గరుడ పురాణము (268)

 


దుష్టస్వభావులు, ఆత్మవంచకులు, వంచకులు అంతరాత్మ గొంతు నొక్కేసి దురాచారమే చేసేవారు ఎన్నిమార్లు పుట్టమన్ను నంటించి మరీ శరీరాన్ని తోముకున్నా పవిత్రులు కానేరరు. చేతులు, పాదాలు, మనస్సు మకిలి లేకుండా వున్నవారు, ధర్మపాలకులు, ఆధ్యాత్మ విద్యా సంపన్నులు, సత్కీర్తి నార్జించినవారు తీర్థాలలో మునగక పోయినా పవిత్రులుగానే వుంటారు. తీర్థఫలాన్నీ అందుతారు.


యస్యహస్తాచ పాదౌచ మనశ్చైవ సుసంయతం |

విద్యాతపశ్చ కీర్తిశ్చ స తీర్థఫలమశ్నుతే ॥


(ఆచార ...113/41)


సన్మానానికి పొంగిపోకుండా, అవమానానికి కోపించకుండా, ఎదుటివాడు కోపం తెప్పించడానికెంత ప్రయత్నించినా పరుషవాక్కు లాడకుండా వుండేవానినే సాధు పురుషుడంటారు.


నప్రహృష్యతి సమ్మానైర్నావమానైః ప్రకుప్యతి ।

నక్రుద్దః పరుషం బ్రూయాదేతత్ సాధోస్తు లక్షణం ॥


(ఆచార ...113/42)


మనిషి దేనికైనా ప్రయత్నం చేయాలి. గట్టి ప్రయత్నమే చెయ్యాలి. అది ఫలించకపోతే బాధపడరాదు. కోపం తెచ్చుకోరాదు. విద్వాంసుడూ మధురభాషీ యైన వ్యక్తి దరిద్రునిగా జీవితాన్ని ప్రారంభించి ధనార్జనకై ప్రయత్నించినా అతని దారిద్య్రం తీరకపోవచ్చు. బుద్ధి, పౌరుషం, బలం, మంత్రశక్తీ వుండి కూడా అలభ్య- అదృష్ట వస్తువు కోసం ప్రయత్నించి, ఒక వ్యక్తి భంగపడవచ్చు. నిరాశచెందరాదు.


అయాచితంగా వచ్చిన దానిని అనుభవించి అది పోయినపుడు విపరీతంగా బాధపడిపోవడం అనవసరం. ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికే పోతుంది. ఎలా వచ్చింది అలాగే పోతుంది. బాగా పెరిగిన చెట్టు పై కొన్నివందల పక్షులు రాత్రంతా కాపురముంటాయి. తెల్లారగానే పోతాయి. ఒకవేళ ఆ చెట్టు కూలిపోతే అవి దుఃఖిస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తూ కూర్చోవు. ఈ మాత్రం ఇంగితం మనిషికెందుకుండదో?


శౌనకాచార్యా! పుట్టడానికి పూర్వం మనకేమీలేదు. గాలిలో ఎగురుతూ వచ్చాం. అలాగే పోయిన తరువాత కూడా మనకేమీ వుండదు. మనకున్నవన్నీ మధ్యలో వచ్చి పోయేవేగా!


అవ్యక్తా దీని భూతాని వ్యక్తమధ్యారి శౌనక | 

అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవనా ॥


(...113/48)


పోయేకాలం వచ్చినవాడు సూదిగుచ్చుకున్నా పోతాడు. అది రానివాడు అంటే ఇంకా ఆయువున్నవాడు యుద్ధంలో శరీరం నిండా సందు లేకుండా బాణాలు కూరీసినా బతికేస్తాడు. కాబట్టి చావుకి భయపడనక్కరలేదు. అలాగే ఎవరికెంత ప్రాప్తమో అంతే వస్తుంది, వుంటుంది. ప్రాప్తించిన దానికి సంతోషించరు కానీ అప్రాప్య వస్తువుకై అంగలారుస్తారు, అలమటిస్తారు. ఇది అనవసరం. ప్రయత్నం మంచిదే; దుఃఖం కాదు.


వృక్షాలు ఏ పూజలు చేశాయని, ఏ ప్రార్థనలు సలిపాయని వాటికి సమయం వచ్చేసరికి పూత, కాత, పంట వస్తున్నాయి? మానవులకు కూడా పూర్వ జన్మ పుణ్య, పాపకర్మల ఫలాలు ఆయా సమయాల్లో అందుతాయి. పూజలు, ప్రార్థనలు మనిషికి ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ వచ్చే ఫలాల విషయంలో మార్పులు తేగలవు. శీలం, వంశం, విద్య, జ్ఞానం, గుణం, శుద్ధత- ఇవేవీ పూర్వకర్మమును మార్చలేవు. పూర్వజన్మతపః ఫలమే చెట్టుకి సర్వాంగ శోభనిచ్చినట్లు మనిషికి సర్వాంగసౌందర్యాన్నీ, అన్ని సంపదలనూ ఇస్తుంది.


Saturday 17 August 2024

శ్రీ గరుడ పురాణము (267)

 


ఏ క్షణాన, ఏ అవస్థలో ఏది జరగాలో అదే జరుగుతుంది. మరోటి, మరోలా జరగదు.


యస్మిన్వయసి యత్కాలో యద్దివాయచ్చ వా నిశి 

యన్ముహూర్తే క్షణేవాపి తత్తథా న తదన్యథా ||


(ఆచార ...11/22)


భగవంతుడు మనకివ్వని దానిని అప్రదత్తమంటారు. మనం మన సామర్థ్యంతో అంతరిక్షంలోకైనా పోవచ్చు, భూగర్భంలోనైనా ప్రవేశింపవచ్చు, దశదిశలనూ మోయగలగ వచ్చు కాని అప్రదత్త వస్తువును పొందలేము.


పురాధీతా చయా విద్యా పురావత్తశ్చ యద్ధనం 

పురాకృతాని కర్మాణి హ్యగ్రే ధావతి ధావతి ॥


(ఆచార ... 113/24)


మనకబ్బిన విద్యా, మనను చేరిన ధనము కూడా పూర్వజన్మకృత పుణ్యఫలాలే. మనం ధర్మం చేస్తున్న కొద్దీ ఇవి మనను అనుసరిస్తూనే వుంటాయి.


అన్ని శుభలక్షణాలూ వుండి బ్రహ్మాండమైన ముహూర్తంలో వివాహం జరిగి సీతవంటి భార్య, భరత సౌమిత్రుల వంటి తమ్ములు ఉండి కూడా వారూ, శ్రీరాముడూ "పదునాలుగేళ్ళ పాటు సుఖపడలేదు. ఇక సామాన్యుల గతి ఏమి? ఇదీ పురాకృతమనగా,


కర్మణ్యత్ర ప్రధానాని సమ్యగృక్షే శుభగ్రహే । 

వనిష్ఠకృత లగ్నేఽ పి జానకీ దుఃఖభాజనం ॥ 

స్థూల జంఘోయదారామః శబ్ద గామీ చలక్ష్మణః | 

ఘన కేశీయదాసీతా త్రయసే దుఃఖభాజనం ॥


*ఇక్కడ శ్రీరాముడు పూర్వజన్మలో చేసిన పాపమేమిటని అనుమానం కావచ్చు. శ్రీరాముడు విష్ణువు. విష్ణువు అంబరీషుని శరీరంలో ప్రవేశించి దుర్వాసుని ద్వారా పుడమి పై పుట్టాలనే శాపాన్ని పొందాడు. రావణుని అదేశించి అత్మలింగానికి బదులు తనను కోరేలా చేసినందుకు పార్వతీదేవి విష్ణువుని భార్యా వియోగంతో బాధపడుమని శపించింది. 


నపితుః కర్మణా పుత్రః పితా వా పుత్ర కర్మణా !

స్వయంకృతే న గచ్ఛంతి స్వయం బద్ధాః స్వకర్మణా ॥ (ఆచార... 113/25-27)


మునులారా! ఇందులో ఇంకో విశేషంకూడా వుంది. తండ్రి పాప పుణ్యాలలో కొడుకుకి గానీ కొడుకు పాపపుణ్యాలలో తండ్రికి గానీ వాటా వుండదు. ఈ దేశంలో వుంటేనే ఈ పూర్వజన్మ పాపాలు వెంటాడతాయనుకోవడం భ్రమ. మనిషి ఎక్కడ పుట్టినా ఆ పాపం దుఃఖ రోగరూపంలో కట్టి కుడుపుతుంది.


ప్రాప్తవ్యమర్థం లభతేమనుష్యో

దేవోఽ పి తం వారయితుం న శక్తః |

అతో న శోచామి న విస్మయో మే 

యదస్మదీయం నతు తత్పరేషాం ॥


(ఆచార ... 113/32)


సర్పము, ఎలుక, ఏనుగు పారిపోవలసి వస్తే ఎక్కడిదాకా పోగలవు? పుట్ట, కన్నం, అడవి... అంతదాకానే కదా! అలాగే మన ఐశ్వర్యం కూడా మన పూర్వజన్మ సుకృతం అయిపోయేదాకానే వుంటుంది. మనం కర్మను దాటిపోలేము.


నూతి నుండి నీరు తోడుతున్న కొద్దీ ఊరుతుంటుంది. సద్విద్య ఎవరికైనా ఇస్తున్న కొద్దీ పెరుగుతుంటుంది. ధర్మమార్గంలో సంపాదించిన ధనమే ధనం. అది దానం చేస్తున్న కొద్దీ పెరుగుతుంటుంది. అధర్మాచరణ ద్వారా ఆర్జింపబడిన ఐశ్వర్యం తాను మిగలదు గానీ ఆ మనిషికి పాపాన్ని మాత్రం మిగిల్చిపోతుంది.


సత్యపాలనం, మనఃశుద్ధి, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, జలప్రక్షాళన ఇవి పంచశుచి మార్గాలు. సత్యపాలన శుచి గలవానికి స్వర్గప్రాప్తి సులభమే. సత్యమునే మాట్లాడువాడు అశ్వమేధ యాగం చేసినవానికన్నా గొప్పవాడు.


సత్యం శౌచం మనఃశౌచం శౌచమింద్రియ నిగ్రహః । 

సర్వభూతేదయా శౌచం జలశౌచంచ పంచమం ॥

యస్య సత్యం హి శౌచం చ తస్య స్వర్గో న దుర్లభః |

సత్యం హి వచనం యస్య స్యోఽ శ్వమేధాద్విశిష్యతే ॥ (ఆచార... 113/38,39)


Friday 16 August 2024

శ్రీ గరుడ పురాణము (266)

 


ఇతిహాస ప్రసిద్ధులు ధర్మవీరులునైన రాజపుత్రులు ధర్మజాది పంచపాండవులు. వీరంతా చంద్రసమాన కాంతిమంతులు, సాటిలేని పరాక్రమ శీలురు, సూర్యప్రతాపులు. పైగా స్వయంగా విష్ణువేయైన శ్రీకృష్ణ పరమాత్మకు మిక్కిలి ఇష్టులు. అయినా అంతటి వారు భిక్షాటన చేసుకున్నారే గాని ధర్మాన్ని తప్పలేదు, కర్మాన్ని వదులుకోలేదు. ఇదీ శీలమంటే, దుష్టగ్రహాలెంత బాధించినా ధర్మాన్ని త్యజించరాదు.


ధర్మానికి లోబడి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే శ్రమకోర్చి సృష్టి, స్థితి లయలను క్రమం తప్పకుండా చేస్తూ, వారి కర్మను వారు సంపన్నం చేస్తున్నారు. మనమంతా ఆ కర్మకు కూడా నమస్కరించి కర్మాధీనులమై జీవించవలసినదే.


బ్రహ్మాయేన కులాలవన్నియ మితో

బ్రహ్మాండ భాండోదరే

విష్ణుర్యేన దశావతారగహనే

క్షిప్తో మహాసంకటే |

రుద్రోయేన కపాల పాణి పుటకే

భిక్షాటనం కారితః 

సూర్యోభ్రామ్యతి నిత్యమేవ

గగనే తస్మై నమః కర్మణే ॥


(ఆచార ... 113/15)


దానం, దానివల్ల కలిగే కష్టసుఖాలూ కూడా కర్మాధీనాలే, విష్ణువంతటివాడు దానాన్ని అడగడానికి వామనుడైపోయాడు. అంతవరకూ ముల్లోకాలనూ ఏకచ్ఛత్రాధిపత్యంగా యేలిన బలిచక్రవర్తి మూడడుగుల దానమిచ్చి ముల్లోకాలనూ కోల్పోయాడు. ఇదంతా భగవంతుని క్రీడ. ఆడించేవానికి సమస్కారము.


దాతా బలి ర్యాచకకో మురారిద్దానం మహీం

విప్రముఖస్య మధ్యే

దత్త్వాఫలం బంధనమేవ లబ్ధం నమోఽ స్తుతే

దైవయ థేష్టకారిణే


(ఆచార... 113/16)


పాపానికి శిక్ష తప్పదు. ఈ శిక్ష, పాపి యొక్క పాపాన్నే తప్ప వంశప్రతిష్టనూ చూడదు, తల్లిదండ్రులనూ చూసి భయపడదు. సాక్షాత్తూ లక్ష్మీనారాయణుల సంతానమైనా పాపం చేస్తే దండన తప్పదు. (మన్మథుడు దండింపబడినాడు కదా!)


కొంతమంది 'నేను ఏ పాపమూ చేయలేదు. అయినా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు! అనీ 'మా వూరి పెత్తందారు ఎన్ని పాపాలు చేశాడో లెక్కేలేదు. అయినా వాడు తెగ సుఖపడిపోతున్నాడు. దేవుడేం చేస్తున్నాడో మరి' అనీ వాపోతారు. పూర్వజన్మలో చేసిన కర్మల యొక్క ఫలాన్ని ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం చెబుతోంది.


త్రికూట పర్వతం పెట్టనికోటై, సముద్రమే పరిఖగా వుండి, రాక్షసగణంచే రక్షితుడై, సాటిలేని బలపరాక్రమ సంపన్నుడై, స్వయంగా విశుద్ధాచరణా కోటిలింగార్చనా సముపేతుడై, అద్భుత తపశ్శక్తి సంపన్నుడైన రావణాసురుడే కాలం కలసి రాకపోవడంతో కూలిపోయాడు. ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది?

Thursday 15 August 2024

శ్రీ గరుడ పురాణము (265)

 


మేధావీ, వాక్పటుత గలవాడూ, విద్వాంసుడూ, జితేంద్రియుడూ, సర్వశాస్త్ర పరిచయం మరియు విమర్శక దృష్టి ఉన్నవాడూ, స్వతహాగా సజ్జనుడూనగు వానిని లేఖకునిగా పెట్టుకోవాలి. బుద్ధిమంతునీ, వివేకశీలునీ, శూరునీ, పరేంగితజ్ఞునీ, మాటతీరు గలవానినీ, యథార్ధం చెప్పే ధైర్యమూ చెప్పడంలో నేర్పూగలవానినీ, దూతగా నియమించుకోవాలి. సమస్త స్మృతులూ శ్రుతులూ చదివిన పండితుడూ, శాస్త్రాలలో నిష్ణాతుడూ, శౌర్య పరాక్రమసంపన్నుడూ నగు వానిని ధర్మాధ్యక్ష పదవికి ఎన్నుకోవాలి.


వంటవాడు వంశపారంపర్యంగా రావాలి. పాకశాస్త్ర ప్రవీణుడై వుండాలి. నిజాయితీ, సత్యవాక్పరిపాలనా, పవిత్రతా, సామర్థ్యమూ గలవాడై వుండాలి. ఎన్ని అర్హతలున్నా దుర్జనుని ఏ పదవికీ తీసుకొనరాదు. అధికారాన్ని ఎవరి చేతిలోనూ పెట్టరాదు. (అధ్యాయం - 112)


నీతిసారం


రాజు తన భృత్యుల శీలం విషయంలో బాగా నిక్కచ్చిగా వుండాలి. ఎవరిలో లోపం కనిపించినా వెంటనే తొలగించాలి. పనిలో నిర్లక్ష్యం చూపిన వారిని కఠినంగా శిక్షించాలి.


సద్భిరా సీత సతతం సద్భిః కుర్వీత సంగతిం |

సద్భిర్వివాదం మైత్రీంచ నా సద్భిః కించి రాచరేత్ ॥

పండితైశ్చ వినీతైశ్చ ధర్మజ్ఞః సత్యవాది భిః |

బంధనస్తోఽ పి తిష్టేశ్చ నతు రాజ్యేఖలైః సవా ॥


(ఆచార ... 113/2,3)


నిరంతరం మంచివారితోనే వుండాలి. వివాదం, మైత్రీ కూడా వారితోనే చేయాలి. మంచివారితో కలసి అడవులలోనైనా సుఖించవచ్చు గాని చెడ్డవారితో కలిస్తే రాజ్యభోగం కలుగుతుందన్నా అంగీకరించరాదు.


ఏ పనినీ సగంలో ఆపడం, విడువడం మంచిలక్షణం కాదు. పనిని సంపూర్ణంగా చేయగలిగితేనే ఒప్పుకోవాలి. చేసేదాకా అన్ని కర్మలూ ఆ పనివైపే సాగాలి. రాజులైనా ప్రజలైనా ఆశపోతూలూ, తొందరపాటు మనుష్యులూ కారాదు. పుట్ట, తేనెతుట్టె, చంద్రుని వెన్నెల ఎలాగైతే క్రమక్రమంగా పెరుగుతాయో స్థిరంగా నిలిచే సొమ్ము కూడా కొంచెం కొంచెంగా పెరుగుతుందనే జ్ఞానాన్ని కలిగివుండాలి.


అర్జితస్య క్షయం దృష్ట్వా సంప్రదత్తస్య సంచయం | 

అవంధ్యం దివసం కుర్యాద్దానాధ్యన కర్మసు ॥


(ఆచార ... 113/8)


దానం చేస్తే ధనం తరిగిపోతుందని, కష్టపడి ధనం సంపాదించి దానాలకీ, అధ్యయనాలకీ ఖర్చు పెట్టి వేస్తే మళ్ళా దరిద్రులమై పోతామని కొందరు భయపడుతుంటారు. గానీ దానం వల్ల, విద్య వల్ల ధనం పెరుగుతుందే కాని తరగదు. ఇంద్రియ నిగ్రహం గలవాడు నగరంలో నివసిస్తున్నా నష్టపోడుగాని అదిలేని వాడిని అడవిలో పడేసినా బాగుపడడు. ఇంద్రియ నిగ్రహం కలిగి గృహస్థాశ్రమాన్ని పాటించేవాడు ఏ తపస్వికీ తీసిపోడు. వానికి ఇల్లే తపోవనం. కర్మే భగవంతుడు.


సత్యమును పాలించడమే ధర్మాన్ని రక్షించడం కూడా అవుతుంది. అభ్యాసం విద్యనీ, కడిగి తోమి కడుగుట పాత్రనీ, శీలం వ్యక్తి యొక్క వంశాన్నీ రక్షిస్తాయి.


సత్యేన రక్ష్యతే ధర్మో విద్యాయోగేన రక్ష్యతే । 

మృజయా రక్ష్యతే పాత్రం కులం శీలేన రక్ష్యతే ॥


(ఆచార ...113/10)


బంధువులనో ఆత్మీయులనో ధనం అడుక్కు తిని బతకడం కంటే నూతిలోపడి కాని, పాముల చేత కరిపించుకొని గాని చావడమే మేలు. దానికి ధైర్యం చాలకపోతే ఏ వింధ్యాటవిలోనో నివసించుట మంచిది.


సంపదలు దానం వల్లనో భోగం వల్లనో నశింపవు. పూర్వజన్మ పాపం వల్ల నశిస్తాయి. ఆర్జిత పుణ్యమున్న వాని సంపద వృద్ధి చెందుతుంది.


బ్రాహ్మణునికి విద్యా, పృథ్వికి రాజు, ఆకాశానికి చంద్రుడూ, సమస్త చరాచరాలకూ శీలమూ ఆభూషణాలు.


విప్రాణాం భూషణం విద్యా సృథివ్యా భూషణం నృపః | 

నభసో భూషణం చంద్ర శీలం సర్వస్వ భూషణం ॥


(ఆచార ... 113/13)

Wednesday 14 August 2024

శ్రీ గరుడ పురాణము (264)

 


రాజుకైనా ప్రజలకైనా ధనం అత్యంత ముఖ్యం. ధనవంతునికీ మిత్ర, బంధు, బాంధవులుంటారు. అతనినే మహాపురుషుడనీ, సమర్థుడనీ కొనియాడతారు. ధనం కోల్పోతే అదే వ్యక్తిని అందరూ వదిలేస్తారు. వాడసలు మగాడే కాడంటారు. మరల ధనం సంపాదించుకు వస్తే నాలికకరచుకొని అతని చుట్టూ చేరతారు.


యస్యార్ధాస్తస్యమిత్రాణి యస్యార్థా స్తస్య బాంధవాః । 

యస్యార్థాః స పుమాఁల్లోకే యస్యార్థాః సచపండితః ॥ 

త్యజంతి మిత్రాణి ధనైర్విహీనం పుత్రాశ్చ దారాశ్చ సుహృజ్జనాశ్చ | 

తేచార్ధవంతం పునరాశ్రయంతి హ్యర్థోహి లోకే పురుషస్య బంధుః ॥


(ఆచార ... 111/17,18)


రాజుకి శాస్త్ర జ్ఞానముండాలి. అదొక కన్ను వంటిదైతే, మరొక కన్ను గూఢచారులు. ఏ రాజు యొక్క పుత్రులూ, భృత్యులూ, మంత్రులూ, పురోహితులూ, ఇంద్రియాలూ తమ తమ కర్తవ్య పాలనలో బద్దకం వహిస్తారో ఆ రాజు ఎంతో కాలం రాజుగా మనలేడు. వీరంతా సక్రమంగా పనిచేస్తే బలవంతుడైన రాజు ఎన్నేళ్ళయినా ఏలగలడు. ప్రయత్నం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఉన్నవానిని దేవతలు కూడా మెచ్చుకొని పై పదవికి పంపిస్తారు.


ఉద్యోగః సాహసం ధైర్యం బుద్ధిః శక్తిః పరాక్రమంః | 

షడ్విధో యస్య ఉత్సాహస్తస్య దేవోఽపి శంకతే ॥ 

ఉద్యోగేన కృతే కార్యే సిద్ధిర్యస్య న విద్యతే | 

దైవం తస్య ప్రమాణం హి కర్తవ్యం పౌరుషం సదా ॥ (ఆధార... 111/32,33)


ఈ ఆరుగలవాడే పురుషుడు. ఈ జన్మలోని పౌరుషమే మరుజన్మలో భాగ్యమవుతుంది. 


(అధ్యాయం - 111)


ఉత్తములనీ, మధ్యములనీ, అధములనీ భృత్యులలో మూడు రకాల వారుంటారు. అది పరీక్షను పెట్టి తేల్చుకోవాలి.


బంగారాన్ని ఎలాగైతే అత్యంత జాగరూకతతో ఘర్షణ, ఛేదన, తాపన, తాడన పరీక్షలను పెట్టి తీసుకుంటామో భృత్యులను రాజు కూడా అలాగే ఎంచుకోవాలి.


వర్ణము, వ్రత, శీల, కర్మములు ఈ ఎంపికలో ప్రధాన పాత్రనువహిస్తాయి. ముఖ్యంగా కోశాధికారిని ఎంచుకొనేటపుడు అభ్యర్థి యొక్క వంశాన్నీ, శీల సద్గుణసంపన్నతలనూ, సత్య ధర్మపరాయణత్వాన్నీ, రూప సంపదనూ, ప్రసన్న చిత్తాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. రత్నాల గూర్చి బాగా తెలిసిన వానినే రత్న పరీక్షకునిగా నియమించుకోవాలి. బలపరాక్రమాలే కాక మంచి యుద్ధవ్యూహరచనాదక్షుని సేనాధ్యక్షునిగా నియమించుకోవాలి. సంకేతమాత్రమున స్వామి అవసరాన్ని పోల్చుకోగలిగేవాడూ, బలవంతుడూ, సుందర శరీరుడూ, పని బద్ధకంలేనివాడూ, జితేద్రియుడూ అయిన వానిని ప్రతీహారిగా పెట్టుకోవాలి.


Tuesday 13 August 2024

శ్రీ గరుడ పురాణము (263)

 


రాజనీతి


(ఇది ఆ రోజులలో రాజుకి పనికివచ్చిన నీతి. ఇపుడు రాజులు లేరు. అయినా రాజాధికారాలుగల వారున్నారు. ప్రభుత్వముంది. కాబట్టి నేటి సమాజానికి కూడా ఈ నీతులవసరం)


ప్రజలనుండి పన్నులరూపేణా డబ్బు వసూలు చేయడం తోటమాలి మృదువుగా తాను పెంచిన మొక్క నుండి *పూలు కోసినట్లుండాలి. అంతేకాని వంట చెఱకు కోసం చెట్టు నరకినట్లుండకూడదు.


* ఈ భావాన్నే పువ్వులోంచి తుమ్మెద తేనెను లాగినంత మృదువుగా నొప్పి లేకుండా ప్రజల నుండి ప్రభుత్వము పన్నులు వసూలు చేయాలని చెప్పాడు. అర్ధశాస్త్రంలో చాణక్యుడు. (గరుడపురాణంలో కూడా వుంది 123/5)


ఇతర రాజ్యాల నుండి వచ్చిన ద్రవ్యాలను రాజు స్వీకరించాలి. అవి పాడైపోతే, విరిగిన పాలనువలె, త్యజించాలి. పాల కోసం ఆవుని వాడుకోవాలిగాని పొదుగును కోసివేయకూడదు. అలాగే రాజు ధనికులనూ వాడుకోవాలి.


సత్యం మనోరమాః కామాః సత్యం రమ్యా విభూతయః । 

కింతువైవనితాపాంగ భంగి లోలంహి జీవితం ॥

వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయంతీ 

రోగాశ్చ శత్రవ ఇవ ప్రభవంతి గాత్రే । 

ఆయుః పరిస్రవతి భిన్నఘటా దివాంభో 

లోకోన చాత్మహితమాచరతీహ కశ్చిత్ ॥


(ఆచార ...111/9,10)


అన్నీ సత్యంలాగా శాశ్వతంలాగా కనిపిస్తాయి. కాని ఐశ్వర్యం, భోగాలు, స్త్రీ, ప్రేమ, పదవి వంటివి సత్యాలూ కావు నిత్యాలూ కావు. అసలు కనిపించని రోగం, ముసలితనం, మృత్యువు మాత్రమే నిత్య సత్యాలు, శాశ్వతాలు, కాబట్టి రాజైనా ప్రజలైనా ధర్మాచరణ రక్తులై జీవించాలి.


పరస్త్రీలలో తల్లినీ, పరద్రవ్యంలో మట్టినీ, సర్వప్రాణులలో తన ఆత్మనూ చూడగలిగిన వాడే నిజమైన విద్వాంసుడు.


పదవికోసం ప్రయత్నించేవాడు ఆ పనిని ప్రజలకోసం చేయడు. తన కోసమే చేస్తాడు. అది క్షంతవ్యమే కాని ఆ పదవి వల్ల వచ్చిన అధికారాన్నీ ఐశ్వర్యాన్నీ ప్రజోపయోగకరమైన యజ్ఞయాగాదులకూ దానాలకూ వినియోగించినవాడే నరకానికి పోకుండా వుంటాడు. (రాజ్యాంతే నరకం, ధ్రువం- అనే నానుడి వానికి వర్తించదు)


Monday 12 August 2024

శ్రీ గరుడ పురాణము (262)

 


రాజుతో స్నేహం మంచిదికాదు. స్త్రీ శిశువులు మాత్రమే జనించే కుటుంబము యజ్ఞయాగాదులు చేసైనా పుత్ర సంతానాన్ని పొందవలసి వుంటుంది.


వివేకవంతుడు తన వంశంలోని వారందరినీ భగవద్భక్తులతో కలిసివుండేలా చేస్తాడు. పిల్లలను విద్యాధ్యయనంలో మగ్నులను చేస్తాడు. శత్రువులను ప్రమాదాలలో ముంచుతాడు. తనకిష్టులైన వారిని ధర్మమార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాడు.


భృత్యులనూ, ఆభరణాలనూ వేటికి తగినచోట్లలో వాటినుంచాలి. చూడామణిని కాలికి పెట్టుకోలేము కదా! కాబట్టి భృత్యుని కరుణించవచ్చు కాని నెత్తికెక్కించుకోరాదు. మనస్వియైన మనుజుడు పూలగుత్తి వలె నరుల తలలపైనైనా వుండాలి లేదా అడవిలోనే రాలిపోవాలి. మణీలక్కా కొండొకచో కలిసే వుండవచ్చు. స్వచ్ఛంగా స్వయం ప్రకాశ మానంగా వుండే మణిని లక్క సహాయంతో ఆభరణాలలో అమరుస్తారు. అయినా దేని విలువ దానిదే. గుఱ్ఱం, ఏనుగు, ఇనుము, కఱ్ఱ, రాయి, బట్ట, ఆడది, మగవాడు, నీరు - ఇవన్నీ కలిసి ఒకే చోట వుండవచ్చు కాని దేని విలువ దానిదే.


అర్థం వల్ల సాధారణంగా వచ్చే అనర్థాలు దైవానుగ్రహమున్న వానికి రావు. కాబట్టి దేవుని పూజించాలి.


కొన్ని కొన్ని పరిస్థితుల్లో సిగ్గు లేదా బిడియము లేదా మొగమాటము పనికిరావు. డబ్బు రావలసిన చోట, ప్రయోగాలలోను, కార్యసిద్ధి ప్రయత్నంలోను, భోజన వేళ, సంసార వ్యవహారంలోను లజ్జను పరిత్యజించాలి.


ఎటువంటి ఊరనుండాలో ఎవరు చొప్పడకున్నట్టి ఊరు చొరకూడదో వినండి*.


ధనినః శ్రోత్రియోరాజా నదీ వైద్యస్తు పంచమః ।

పంచయత్ర న విద్యంతే నకుర్యాత్ తత్ర సంస్థితం ॥


(ఆచార ...110/26)


* కనీసం పదేళ్ళ కిందటిదాకా ప్రతి తెలుగు నోటా పలుకబడిన గల సుమతి పద్యం 'అప్పిచ్చు వాడు వైద్యుడు'కి గరుడ పురాణమే మూలం - అను)


దానధర్మాలు లేనిచోట, రాకపోకలు కనబడని చోట, అనుచితాచారులను భయపెట్టి ఆపే యంత్రాంగం పని చేయని చోట, ప్రజలు సిగ్గుని చిన్నప్పుడే వదిలేసిన చోట అది ఎంత రమ్యమైన గ్రామమైనా, నగరియైనా - ఒక్క రోజైనా నిలువరాదు. అలాగే దైవజ్ఞులు, వేదజ్ఞులు, పాలకుడు, సజ్జనులు, జలసమృద్ధి అనగా నీటివసతి లేనిచోటకూడా నిలువరాదు.


(అధ్యాయం 10)


Sunday 11 August 2024

శ్రీ గరుడ పురాణము (261)

 


విద్యార్జన, ధనసంగ్రహం, పర్వతారోహణం, అభీష్టసిద్ధి, ధర్మాచరణం - ఈ అయిదింటినీ ఓపికగా క్రమక్రమంగా సాధించుకోవలసి వుంటుంది.

దేవపూజనాదిక కర్మలూ, బ్రాహ్మణులకిచ్చే దానమూ, సద్విద్య మంచిమిత్రుడూ ఇవి మానవునికి జీవిత పర్యంతమూ సహాయకారులవుతాయి. బాల్యకాలంలో విద్యనీ, యువావస్థలో ధనాన్నీ అనుకూలవతియైన పత్నినీ సంపాదించుకోలేని వారు సుఖవంతమైన జీవితాన్ని గడపలేరు.


విద్యార్జన ఒక ఉపాసన. ఆ ఉపాసనా కాలంలో మనిషికి భోజనాన్ని గురించిన ఆలోచనరాకూడదు. విద్య కోసం, అవసరమైతే, గరుత్మంతుని వలె, ఎంత దూరమైనా పోవాలి. వీలైనంత వేగంగా పోవాలి.


శుష్కతర్కం వల్ల ఎవరికీ ప్రయోజనముండదు. సిద్ధాంత స్థాపనము కేవలం తర్కమాత్రాన జరగదు. ధర్మం కూడా తర్కము ననుసరించి వుండదు. పరిస్థితులను బట్టి ధర్మం మహర్షులచే ఆదేశింపబడుతుంది.


తర్కేఽ ప్రతిష్ఠాశ్రుతయో

విభిన్నాః నాసావృషిర్యస్య మతం న భిన్నం ।

ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం

మహాజనోయేన గతః సపంథాః ॥


(ఆచార...109/52)


ఆకారం, సంకేతం, గతి, చేష్ట, మాట, కనులు, ముఖము - మనిషి యొక్క అంతః కరణ వీటి ద్వారా బయటపడిపోతూనే వుంటుంది. వీటిని బట్టి అవతలివాని అసలు రంగుని కనుగొని అవగతం చేసుకోగలిగిన వాడే నిజమైన విద్వాంసుడు. జంతువులలో గుఱ్ఱానికీ, ఏనుగుకీ ఈ శక్తి కొంత వఱకూ వుంటుంది." (అధ్యాయాలు (అధ్యాయలు - 108, 109)


నీతిసారం


సూతుడు శౌనకాది మహామునులకు ఇంకా ఇలా చెప్పాడు, “మహామునులారా! సునిశ్చితార్థాన్ని వదిలేసి అనిశ్చిత పదార్థాలను సేవించేవాడు రెండింటికీ చెడతాడు.


వాగ్వైభవం లేని వ్యక్తి యొక్క విద్య, పిరికివాని చేతిలోని ఆయుధంవలెనే వానికి పనికిరాదు. అంధుని భార్య యొక్క అందమూ అంతే.


సుందర భోజ్య పదార్థాల కలిమీ, వాటిని అరిగించుకొనే శక్తీ, రూపవతియగు భార్యా, ఆమెను అన్ని విధాలా సంతృప్తి పఱచగలిగే శక్తీ, ధనమూ, వైభవమూ, దానం చేసే బుద్దీ - ఇవన్నీ గొప్ప తపస్సును చేసిన వారికే లభిస్తాయి.


వేదానికి ఫలం అగ్నిహోత్రం; విద్య యొక్క ఫలాలు శీలమూ, సదాచారము; స్త్రీ వల్ల లాభం రత్యానందం, పుత్రప్రాప్తి; అలాగే ధనం వుండేది దానానికీ, భోగానికీ.


ధనం ఉండాలి కానీ అనర్ధాన్ని తెచ్చి పెట్టే ధనం అభిలషణీయం కాదు. మణిని కోరుకోవచ్చు. కాని పాముపడగపై నున్న మణి కోసం పాకులాడకూడదు కదా!


అగ్నిహోత్రం కోసం హవిష్యాన్నాన్ని తక్కువ స్థాయి వాని వద్ద నుండి కూడా గ్రహించవచ్చు. బాలకుని వద్ద నుండైనా సుభాషితాన్ని ఆలకించి ఆదరించాలి. స్వర్ణము అపవిత్ర స్థానంలో వున్నా చేజిక్కించుకోవచ్చు. అలాగే నీచవ్యక్తి వద్ద శ్రేష్ఠ విద్య వుంటే నిస్సంకోచంగా ఆ విద్యను నేర్చుకోవచ్చు.


రాజుతో స్నేహం మంచిదికాదు. స్త్రీ శిశువులు మాత్రమే జనించే కుటుంబము యజ్ఞయాగాదులు చేసైనా పుత్ర సంతానాన్ని పొందవలసి వుంటుంది.


Friday 9 August 2024

శ్రీ గరుడ పురాణము (260)

 


స్వప్నం వల్ల నిద్రపై విజయం లభింపదు. అనగా కలల వల్ల నిద్ర చెడుతుందే గానీ తీరదు. కామంతో స్త్రీని గెలుచుకొనుట అసాధ్యం. ఇంధనంతో అగ్నిని తృప్తిపఱచలేము. మద్యంతో దాహాన్నీ తీర్చలేము. స్త్రీకి సౌకర్యాలను కలిగిస్తున్నకొద్దీ ఆమెకు కోరికలు పెరిగిపోతుంటాయి. కఱ్ఱముక్కలను వేస్తున్న కొద్దీ అగ్ని మరింత రాజుకుంటుంది కదా! నదులు తనలో కలుస్తున్న కొద్దీ సముద్రునికి దాహమూ అలాగే పెరిగిపోతుంటుంది.


ప్రియవచనాలు, కోరికల సిద్ధి, సుఖాలు, పుత్రులు - ఇలాంటివన్నీ వస్తున్నకొద్దీ ఇంకా కావాలనే అనేవారే తప్ప ఇక చాలు అనేవారుండరు.


మోక్షమనేది వనాలలోనో పర్వతాల పైననో మాత్రమే దొరకదు. తనకు ధర్మశాస్త్రాలు విధించిన కర్మను తత్పరతతో దైవార్పణంగా చేస్తూ, గౌరవంగా బతకడానికి చాలినంత మాత్రమే ధనాన్నార్జిస్తూ, శాస్త్ర చింతనపై రక్తినీ, తన భార్యపై మాత్రమే అనురక్తినీ పెంచుకుంటూ జితేంద్రియుడై, అతిథిసేవానిరతుడై జీవనాన్ని గడిపే సత్పురుషుడు ఆయువు తీరినంతనే స్వంత ఇంటినుండే మోక్షపదాన్ని చేరుకోగలడు.


స్వర్గం ఎక్కడో ఆకాశంలో మాత్రమే ఉందనుకోడానికి లేదు. సత్కర్మ నిరతుడైన పురుషునికి తన లోగిట్లోనే అనుకూలవతి, సుందరి, సముచితాలంకార భూషిత, ఆరోగ్యవంతురాలు అయిన భార్యా, ఎవరినీ యాచించకుండా పీడించకుండా బతుకు జరిగే వెసులుబాటూ వుంటే అదే భాగ్యము, అదే స్వర్గము.


స్వభావసిద్ధంగానే ధర్మ విరుద్ధంగా పతికి ప్రతికూలంగా వుండే స్త్రీలు దానానికీ మానానికీ శాస్త్రాలకీ శస్త్రాలకీ లొంగరు. (వారితో బ్రతకవలసిరావడమే నరకం)


న దానేన న మానేన నార్జవనే న సేవయా |

న శస్త్రేణ న శాస్త్రేణ సర్వథా విషమాః స్త్రియః ||


(ఆచార ... 109/45)


Thursday 8 August 2024

శ్రీ గరుడ పురాణము (259)

 


పీనాసివాని ధనం యజ్ఞాలకు ఉపయోగపడదు (వాడు చేయడు కాబట్టి) బ్రాహ్మణులను చేరదు (వాడివ్వడు కాబట్టి) చివరికది చేరేది రాజును (లాక్కుంటాడు కాబట్టి) లేదా దొంగను. (దోచుకుంటాడు కాబట్టి).


విద్యను నిరంతరం అధ్యయనమో, అభ్యాసమో చేసుకుంటూ వుండకపోతే దానిని మరిచిపోతాం. శక్తి కూడా అంతే.


దొంగని క్షమించడంగాని చిన్న శిక్ష వేసి ఊరి మీదికి వదలి వేయడంగాని కూడదు. వానికి సరైన శిక్ష మరణదండనే. దుష్టుడైన మిత్రుని దూరంగా వుంచాలి. ఎదురైతే పలకరించి ఎలాగో పారిపోవాలి. అదే వానికి శిక్ష. స్త్రీకి సరైన శిక్ష ఆమెను తన శయ్యపై కాకుండా వేరే ఒంటరిగా పడుకోబెట్టడం. బ్రాహ్మణునికి శిక్ష వానిని దేనికీ పిలవక పోవడమే.


పనిని పెంచడం ద్వారా భృత్యునీ, దుఃఖం కలిగించే సంఘటన వచ్చినపుడు బంధు బాంధవులనూ, విపత్కాలంలో మిత్రునీ, ఐశ్వర్యం నష్టమైపోయినపుడు స్త్రీనీ జాగ్రత్తగా గమనించక్కరలేకుండానే వారి రంగులు బైటపడతాయి.


జానీయాత్ ప్రేషణే భృత్యాన్ 

బాంధవాన్ వ్యసనాగమే । 

మిత్రమాపది కాలే చ 

భార్యాంచ విభవక్షయే ॥


(ఆచార ...109/32)


స్త్రీకి పురుషుని కన్నా రెండింతలు ఆహారమూ, నాల్గింతలు బుద్ధి, ఆరింతలు ఓపికా, ఎనిమిది రెట్లు కామ వాంఛా వుండాలనీ, వుంటాయనీ పెద్దలంటారు.


Wednesday 7 August 2024

శ్రీ గరుడ పురాణము (258)

 


నదిని నమ్ముకొని ఒక చోట వుండిపోవాలనుకోవడం తెలివైన పనికాదు. అది అతిగా నిండినా పూర్తిగా ఎండినా ముప్పు తప్పుడు. అలాగే గోళ్ళతో కొమ్ములతో వుండే జంతువులనూ ఆయుధాన్ని ధరించి తిరిగేవారినీ, రాజ పరివారాన్నీ విశ్వసించి ఉండిపోకూడదు.


నదీనాంచనఖీ నాంచ శృంగిణాం శస్త్రపాణి నాం ! 

విశ్వాసోనైవ కర్తవ్య స్త్రీ షు రాజకులేషు చ -- 

(ఆచర... 109/14)


*అర్ధనాశం మనస్తాపం గృహేదుశ్చరితానిచ

పంచనం చాపమానం చ మతిమాన్ న ప్రకాశయేత్


(ఆచార... 109/15)


ఈ ప్రపంచంలో దోషం లేని వంశం. రోగ పీడితులు కాని మనుషులు, దుఃఖితులు కాని వారు, అహంకారాన్ని గెలువగలిగిన ధనవంతులు, దుర్జనుల వల్ల దెబ్బతిననివారు ఉండరు.


*అవమానమును, ధన నష్టమును ప్రకాశము చేయరాదందరు అనే నీతిచంద్రిక సూక్తికి కూడ గరుడ పురాణమే మూలము (శ్లో 109/15)

ఎచ్చోటనైతే వ్యక్తికి గౌరవం లభించదో, ఆదరించేవారుండరో, బంధుబాంధవులు లేరో, విద్యా లాభ అవకాశమే వుండదో అచ్చోటును వీలైనంత వేగం వదలిపోవాలి.


ధనసంచయం చేసేవాడు దానినెంత వఱకు రక్షించగలడో కూడా ఆలోచించుకోవాలి. రాజులు, చోరులు దాని జోలికి రాకుండా కాపాడుకోగలగాలి. అప్పుడైనా ప్రాణాలను పణంగా పెట్టి కొండొకచో అన్యాయానికి ఒడిగట్టి సంపాదించిన సొమ్ము వానితో పరలోకానికి వెళ్ళదు కానీ తత్సంపాదనకై వాడుచేసిన పాపాలు వానిని నరకం దాకానూ మరుజన్మల లోనూ కూడా అనుసరిస్తాయి. కాబట్టి అధర్మం, లోభం పనికిరావు. సాధారణంగా ఇటువంటి అధార్మికులూ, లోభులే మరుజన్మలో కడుపారగ కూడుగానీ తలదాచగ గూడు కానీ చలినాపగవలువలుగానీ లేని దరిద్రులుగా, రోగులుగా జీవనాన్ని గడుపుతుంటారు. వీరంతా దానం, ధర్మం లేని ఒకనాటి శ్రీమంతులే. మనం ఇటువంటి వారు మనను యాచిస్తున్నపుడు మనకొక హెచ్చరిక చేస్తున్నారని అర్ధం చేసుకోవాలి. 'ఓయి మానవులారా, మీరు అన్యాయాలు చేసి, దానాలు చేయకుండా బతికేస్తే వచ్చే జన్మలో మాలాగే అడుక్కుతినాలి'


శిక్షాయంతి చయాచంతే దేహీతి కృపణా జనాః | 

అవస్థేయమదానస్యః మా భూదేవం భవానపి ॥


(ఆచార --- 109/25)


Tuesday 6 August 2024

శ్రీ గరుడ పురాణము (257)

 


అధికారంలో వున్నవాడికైతే సాయపడడానికి ఆపరిచిత వ్యక్తులు కూడా అత్యుత్సాహంతో ముందుకు వస్తారు. చిటికెలో మిత్రులయి పోతారు. అదే వ్యక్తి పదవీచుత్యుడైతే, అసమర్థుడని తేలిపోతే పరిచయస్తులు కూడా పలకరించరు. స్వంతవారే శత్రువులా చూస్తారు. (తరువాత తెలుగులో వచ్చిన అధికారాంతమునందు చూడవలెరా ఆయయ్య సౌభాగ్యముల్ అనే సుభాషితానికి గరుడపురాణమే మూలం కావచ్చు.)


నిజమైన మిత్రుడెవరో ఆపదవచ్చినపుడే తెలుస్తుంది. అలాగే యుద్ధంలో వీరత్వమూ, ఏకాంతంలో శుచితా, వైభవం క్షీణించినపుడు పత్నీ, దుర్భిక్షంలో అతిథి ప్రియత్వం నిగ్గు తేలతాయి. అనగా వారి అసలు రంగులు బైట పడతాయి.


వృక్షం క్షీణఫలం త్యజంతి విహగాః 

శుష్కం సరః సారసా నిర్ద్రవ్యం 

పురుషంత్యజంతి గణికా భ్రష్టం నృపం మంత్రిణః । 

పుష్పం పర్యుషితం త్యజంతి మధుపాః

దగ్ధం వనాంతం మృగాః సర్వః కార్యవశా 

జ్జనోహరమతే కస్యాస్తి కో వల్లభః ॥


(ఆచార...109/9)


ఎవరికి యెవరు? చివరికి యెవరు? పళ్ళ కాపు ఆగిన చెట్టుని పిట్టలు వదిలిపోతాయి. సరస్సు ఎండిపోవడం మొదలవగానే అక్కడ వాలేని ఇక వాలవు. వేశ్యలు ధనాన్ని పిండేసిన తరువాత విటుని ఇక తమ గుమ్మం తొక్కనివ్వరు. వాడిన, మాడిన పూలపై తుమ్మెదలు వాలడం మానుకుంటాయి. కాలిన అడవిని జంతువులన్నీ త్యజిస్తాయి. ఇవన్నీ వేరే ఆశ్రయాలను వెతుక్కుంటూ పోతాయి. కాబట్టి మునులారా! ఈ వ్యావహారిక జగత్తులో ఎవరూ ఎవరికీ ఏమీ కారు.


లుబ్ధమర్ధ ప్రదానేన శ్లాఘ్యమంజలి కర్మణా। 

మూర్ఖం ఛందాను వృత్త్వా చ యాథాత థ్యేన పందితం ॥ 

సద్భావేన హి తుష్యంతి దేవాః సత్పురుషాః ద్విజాః। 

ఇతరేఖాధ్యపానేన మానదానేన పండితాః ॥


(ఆచార... 109/10,11)


లోభికి ఏదో రూపంలో ధనాన్నిస్తే తెగ ముచ్చటపడిపోతాడు. ఆ రకంగా వాడి మనసును గెలుచుకోవచ్చును. అలాగే అంజలించి ఉదారచిత్తులనూ, పొగడ్తలతో మూర్ఖులనూ, తాత్త్వికచర్చ ద్వారా విద్వాంసులనూ, మంచి మనసు చేత, ఉన్నతాలోచనల చేత దేవతలనూ సజ్జనులనూ ద్విజులనూ మన్చి చేసుకోవచ్చును. అన్నపానాలతో సామాన్యులనూ, మాన సమ్మానాలతో పండితులనూ ఆకట్టుకోగలము. 


Monday 5 August 2024

శ్రీ గరుడ పురాణము (256)

 


వర్ణం కోసమొక వ్యక్తినీ, గ్రామం రక్షించబడవలసి వస్తే తప్పనిసరైతే ఒక కుటుంబాన్నీ, మహానగరాన్ని కాపాడవలసి వస్తే జనపదాన్నీ త్యాగం చేయవచ్చు. ఆత్మరక్షణ కోసమైతే గ్రామం, నగరం, దేశం, దేనినైనా పరిత్యజించవచ్చును.


త్యజేవేశం కులసార్టే గ్రామస్వార్థ కులం త్యజేత్ | 

గ్రామం జనపదస్యార్దే ఆత్మారే పృథివీం త్యజేత్ ||


(ఆచార - 109/2) 


దుష్టచరిత్రుని ఇంటిలో ఉన్డడం కన్నా నరకంలో నుండుటయే మేలు. ఎందుకంటే నరకం పాపాలను దగ్ధం చేస్తుంది.


బుద్దిమంతుడెప్పుడూ ఒక పాదాన్ని పూర్తిగా స్థిరంగా మోపిన తరువాతే రెండో కాలెత్తుతాడు. నేల విడిచి సాము చేయడు. అంటే ఒక చోటుని వదలిపోవునపుడు ఇంకొక దానిని సిద్ధం చేసుకొన్నాకనే కదలాలి.


దుష్టజనులచే పరివ్యాప్తమైన దేశాన్నీ, ఉపద్రవగ్రస్తమైన నివాసభూమినీ, మాయానియైన మిత్రునీ ఏ మాత్రం సంకోచించకుండా, ఆలస్యం చేయకుండా వదిలేయాలి.


పీనాసి వాడి చేతిలో పడిన ధనమూ, అత్యంత దుష్టుడూ, కోపిష్టి వద్ద నున్న జ్ఞానమూ, గుణంగానీ శౌర్యంగానీ లేనివానికి గల సౌందర్యమూ, ఆపద వేళలో మొగం చాటేసే మిత్రుడూ ఎందుకూ పనికిరారు.


Sunday 4 August 2024

శ్రీ గరుడ పురాణము (255)

 


చెప్పిన పనిని అక్షరాలా మనసా చేసేవాడే సేవకుడు, మొలకెత్తే విత్తనమే విత్తనం, ప్రియంగా సంభాషించేదే భార్య, తండ్రినీ తల్లినీ, వృద్ధులైనా పూజించి పోషించేవాడే కొడుకు, గుణవంతునిగా ధర్మప్రవృత్తితో బతికేవాడి బతుకే నిజమైన బతుకు. ఇలా కాని వాళ్ళు బతకడం భూమికి బరువు.


సాభార్యా యా గృహేదక్షా సాభార్యా యా ప్రియం వదా ।

సాభార్యా యా పతి ప్రాణా సా భార్యా యా పతివ్రతా ॥ (ఆచార... 108/18)


ఇలాంటి పతివ్రతయు, పైగా సుందరి, మంగళప్రదకార్యాలు చేయునది, ధర్మపరాయణ, శృంగార సుఖం కోసం కాకుండా పుత్ర సంతానం కోసం మాత్రమే సంగమాన్ని కోరుకొనేది యగు భార్య లభించినవాడు దేవేంద్రుని వలె వెలుగొందుతాడు.


అలాకాకుండా ఎగుడుదిగుడు కన్నులది, పాపిని, కలహప్రియ, పరపురుషులపై ఆసక్తి కలదియైన భార్యకు దొరికిపోయినవాడు ఎన్ని వున్నా, అన్నీ వున్నా దరిద్రుడే. ఇలాంటి వాడు పెళ్ళయిన స్వల్పకాలంలోనే వృద్ధావస్థను చేరుకుంటాడు.


దుష్టపత్ని, దుష్టమిత్రుడు, పొగరుబోతుభృత్యులు గలవాడు సర్పమున్న గృహంలో నివసిస్తున్నట్లే లెక్క. వానికి సుఖం వుండదు. శాంతీ వుండదు.


దుష్టసాంగత్యాన్నొదిలేసి, మంచివారితో కలసిమెలసి తిరుగుతూ రాత్రింబవళ్ళు వీలైనంతవఱకు పుణ్యాన్నే సంపాదిస్తూ భగవంతుని నిత్యత్వాన్నీ మనయొక్క అనిత్యత్వాన్నీ తలుస్తూనే జీవించాలి.


వేశ్యాలంపటంలో పడరాదు. అల్పమైన చదువున్నవాడూ బలహీనుడూ మహాశక్తిశాలిగా రూపొందవచ్చు, పచ్చికృతఘ్నుడని ప్రజలంతా అనేవాడు కూడా మంచివాడై పోయి నమ్మదగిన వ్యక్తిగా పేరొందవచ్చు, అగ్ని చల్లగా కావచ్చు, మంచుని ముట్టుకుంటే వేడిగా తగలవచ్చు. కాని వేశ్యకు పురుషునిపై ప్రేమ రాదు.


సూతుడిలా కొనసాగించాడు. నీతిసారాన్ని మునులకీయసాగాడు. ధనాన్ని సంపాదించాలి కాని, దాన్ని తనకూ, స్త్రీలకూ, పిల్లలకూ ఆపదవచ్చినపుడు వాడుకోవడానికి చాలినంతవఱకే దాచుకోవాలి.