Monday 12 August 2024

శ్రీ గరుడ పురాణము (262)

 


రాజుతో స్నేహం మంచిదికాదు. స్త్రీ శిశువులు మాత్రమే జనించే కుటుంబము యజ్ఞయాగాదులు చేసైనా పుత్ర సంతానాన్ని పొందవలసి వుంటుంది.


వివేకవంతుడు తన వంశంలోని వారందరినీ భగవద్భక్తులతో కలిసివుండేలా చేస్తాడు. పిల్లలను విద్యాధ్యయనంలో మగ్నులను చేస్తాడు. శత్రువులను ప్రమాదాలలో ముంచుతాడు. తనకిష్టులైన వారిని ధర్మమార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాడు.


భృత్యులనూ, ఆభరణాలనూ వేటికి తగినచోట్లలో వాటినుంచాలి. చూడామణిని కాలికి పెట్టుకోలేము కదా! కాబట్టి భృత్యుని కరుణించవచ్చు కాని నెత్తికెక్కించుకోరాదు. మనస్వియైన మనుజుడు పూలగుత్తి వలె నరుల తలలపైనైనా వుండాలి లేదా అడవిలోనే రాలిపోవాలి. మణీలక్కా కొండొకచో కలిసే వుండవచ్చు. స్వచ్ఛంగా స్వయం ప్రకాశ మానంగా వుండే మణిని లక్క సహాయంతో ఆభరణాలలో అమరుస్తారు. అయినా దేని విలువ దానిదే. గుఱ్ఱం, ఏనుగు, ఇనుము, కఱ్ఱ, రాయి, బట్ట, ఆడది, మగవాడు, నీరు - ఇవన్నీ కలిసి ఒకే చోట వుండవచ్చు కాని దేని విలువ దానిదే.


అర్థం వల్ల సాధారణంగా వచ్చే అనర్థాలు దైవానుగ్రహమున్న వానికి రావు. కాబట్టి దేవుని పూజించాలి.


కొన్ని కొన్ని పరిస్థితుల్లో సిగ్గు లేదా బిడియము లేదా మొగమాటము పనికిరావు. డబ్బు రావలసిన చోట, ప్రయోగాలలోను, కార్యసిద్ధి ప్రయత్నంలోను, భోజన వేళ, సంసార వ్యవహారంలోను లజ్జను పరిత్యజించాలి.


ఎటువంటి ఊరనుండాలో ఎవరు చొప్పడకున్నట్టి ఊరు చొరకూడదో వినండి*.


ధనినః శ్రోత్రియోరాజా నదీ వైద్యస్తు పంచమః ।

పంచయత్ర న విద్యంతే నకుర్యాత్ తత్ర సంస్థితం ॥


(ఆచార ...110/26)


* కనీసం పదేళ్ళ కిందటిదాకా ప్రతి తెలుగు నోటా పలుకబడిన గల సుమతి పద్యం 'అప్పిచ్చు వాడు వైద్యుడు'కి గరుడ పురాణమే మూలం - అను)


దానధర్మాలు లేనిచోట, రాకపోకలు కనబడని చోట, అనుచితాచారులను భయపెట్టి ఆపే యంత్రాంగం పని చేయని చోట, ప్రజలు సిగ్గుని చిన్నప్పుడే వదిలేసిన చోట అది ఎంత రమ్యమైన గ్రామమైనా, నగరియైనా - ఒక్క రోజైనా నిలువరాదు. అలాగే దైవజ్ఞులు, వేదజ్ఞులు, పాలకుడు, సజ్జనులు, జలసమృద్ధి అనగా నీటివసతి లేనిచోటకూడా నిలువరాదు.


(అధ్యాయం 10)


No comments:

Post a Comment