Wednesday 7 August 2024

శ్రీ గరుడ పురాణము (258)

 


నదిని నమ్ముకొని ఒక చోట వుండిపోవాలనుకోవడం తెలివైన పనికాదు. అది అతిగా నిండినా పూర్తిగా ఎండినా ముప్పు తప్పుడు. అలాగే గోళ్ళతో కొమ్ములతో వుండే జంతువులనూ ఆయుధాన్ని ధరించి తిరిగేవారినీ, రాజ పరివారాన్నీ విశ్వసించి ఉండిపోకూడదు.


నదీనాంచనఖీ నాంచ శృంగిణాం శస్త్రపాణి నాం ! 

విశ్వాసోనైవ కర్తవ్య స్త్రీ షు రాజకులేషు చ -- 

(ఆచర... 109/14)


*అర్ధనాశం మనస్తాపం గృహేదుశ్చరితానిచ

పంచనం చాపమానం చ మతిమాన్ న ప్రకాశయేత్


(ఆచార... 109/15)


ఈ ప్రపంచంలో దోషం లేని వంశం. రోగ పీడితులు కాని మనుషులు, దుఃఖితులు కాని వారు, అహంకారాన్ని గెలువగలిగిన ధనవంతులు, దుర్జనుల వల్ల దెబ్బతిననివారు ఉండరు.


*అవమానమును, ధన నష్టమును ప్రకాశము చేయరాదందరు అనే నీతిచంద్రిక సూక్తికి కూడ గరుడ పురాణమే మూలము (శ్లో 109/15)

ఎచ్చోటనైతే వ్యక్తికి గౌరవం లభించదో, ఆదరించేవారుండరో, బంధుబాంధవులు లేరో, విద్యా లాభ అవకాశమే వుండదో అచ్చోటును వీలైనంత వేగం వదలిపోవాలి.


ధనసంచయం చేసేవాడు దానినెంత వఱకు రక్షించగలడో కూడా ఆలోచించుకోవాలి. రాజులు, చోరులు దాని జోలికి రాకుండా కాపాడుకోగలగాలి. అప్పుడైనా ప్రాణాలను పణంగా పెట్టి కొండొకచో అన్యాయానికి ఒడిగట్టి సంపాదించిన సొమ్ము వానితో పరలోకానికి వెళ్ళదు కానీ తత్సంపాదనకై వాడుచేసిన పాపాలు వానిని నరకం దాకానూ మరుజన్మల లోనూ కూడా అనుసరిస్తాయి. కాబట్టి అధర్మం, లోభం పనికిరావు. సాధారణంగా ఇటువంటి అధార్మికులూ, లోభులే మరుజన్మలో కడుపారగ కూడుగానీ తలదాచగ గూడు కానీ చలినాపగవలువలుగానీ లేని దరిద్రులుగా, రోగులుగా జీవనాన్ని గడుపుతుంటారు. వీరంతా దానం, ధర్మం లేని ఒకనాటి శ్రీమంతులే. మనం ఇటువంటి వారు మనను యాచిస్తున్నపుడు మనకొక హెచ్చరిక చేస్తున్నారని అర్ధం చేసుకోవాలి. 'ఓయి మానవులారా, మీరు అన్యాయాలు చేసి, దానాలు చేయకుండా బతికేస్తే వచ్చే జన్మలో మాలాగే అడుక్కుతినాలి'


శిక్షాయంతి చయాచంతే దేహీతి కృపణా జనాః | 

అవస్థేయమదానస్యః మా భూదేవం భవానపి ॥


(ఆచార --- 109/25)


No comments:

Post a Comment