Tuesday 17 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (86)



అట్టి ఉగ్రత్వం తిరిగి ఆమెలో ప్రవేశించకూడదని విగ్రహంలోని ఉగ్రకళలను గ్రహించి తాటంకాలలో ఉంచారు. అంటే కర్ణాభరణాలుగా, అవి యంత్ర రూపంలో ఉంటాయి. వాటిని ఆమెకు అలంకరంగా ఉంచారట.


తాటంకం, సౌభాగ్యానికి గుర్తు, శంకరులు, సౌందర్యలహరిలో ఒక ప్రశ్న వేసారు. అమృతం త్రాగినా దేవతలు ప్రళయకాలంలో నామరూపాలు లేకుండా ఉన్నారేమిటి? ఒక్క పరమేశ్వరుడే నిలబడడానికి కారణం ఏమిటి? ఆపైన విషపానం చేసిన వాడుండడేమిటి? అని ప్రశ్న వేసుకొని, ఇదంతా నీ తాటంకాల మహిమయమ్మా, 'తవజనని తాటంక మహిమా' అన్నారు.


ఇట్లా ఉగ్ర కళలను తాటంకాలలో బంధించి, పాతివ్రత్యానికి చిహ్నమైన తాటంకాలనమర్చి ఎదురుగా కొడుకైన గణపతిని ప్రతిష్ఠించారు.


గణపతికి జంబుకేశ్వరంతో, సంబంధం ఉంది. జంబు అంటే నేరేడు. నేరేడు ఫలాలంటే స్వామికి ఇష్టం. ఒక స్తోత్రంలో 'కపిత్థ జంబూఫల సార భక్షితం' అని ఉంది. నేరేడు పండును సుబ్రహ్మణ్య స్వామి, అవ్వైయార్ అనే కవయిత్రికి ఇచ్చాడని, ఆమె గణపతి భక్తురాలని కథ.


శంకరుని అవతారమైన శంకరులు, శివపార్వతులకు ప్రీతిపాత్రుడైన వినాయకుణ్ణి ప్రతిష్ఠ చేయడంలో ప్రత్యేకత ఉండాలి.


పరాశక్తి యొక్క కోపాన్ని తగ్గించగల శక్తి గణపతికే ఉంది. అతనికి శక్తి ఉందంటే ఏదో మంత్రాన్ని ఉపయోగిస్తాడనో, ఏదో చేసి పరాశక్తిని మారుస్తాడని కాదు. పరాశక్తి యొక్క చూపు పడితే చాలు. ఆమె కంటికి ఇతడు ప్రీతి పాత్రుడు ప్రేమ మూర్తి. అతని మనస్సూ గొప్పదే. వాగీశది దేవతలు ఇతనిని అర్చించి విజయాన్ని పొందారు కదా!

No comments:

Post a Comment