Sunday 22 November 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (91)

అనంతాచార్యులనే వారు అద్వైతాన్ని ఖండిస్తూ న్యాయభాస్కరం వ్రాయగా న్యాయేందు శేఖరం వ్రాసి శాస్త్రిగారు ఖండించారు. సూర్యుని మాదిరిగా వెలుగుతుందనే అర్ధంలో వారు న్యాయ భాస్కరం వ్రాయగా అతడస్తమిస్తే చంద్రుడే ప్రకాశిస్తాడు, చల్లని వెన్నెలను ప్రసారిస్తాడు. విద్వాంసుల హృదయం చల్లబడుతుంది కనుక న్యాయేందు శేఖరం మన శాస్త్రిగారు వ్రాసేరు. దానిని ఈశ్వర ప్రసాదంగా భావించారు. మనస్సులో చంద్రుడు, ఈశ్వరుడు ఉండాలి కనుక పుస్తకానికి ఆ నామముంచారు. ఈ పుస్తకంపై ప్రతి సంవత్సరమూ అద్వైత సభ జరుపుతారు. మా మఠానికి చెందిన పరమ గురువులీ ఏర్పాటు చేసారు. వారే ఆరవ చంద్రశేఖరేంద్ర సరస్వతి. వీరు 1894లో ఈ సభను స్థాపించారు. ఈ పుస్తకం పై పరిశోధన చేసేవారికి ప్రతి ఏటా బహుమతినిస్తారు. ఇది ఈ పుస్తకం యొక్క గొప్పదనం.


ఇక్కడ తర్క శాస్త్రానికి, గణపతికి ఉన్న సంబంధాన్ని వివరిస్తాను. తర్క శాస్త్రం కార్యకారణ విచారణ చేస్తుంది. ఈ నియమాలను న్యాయమని అంటారు. ఇందు కొన్ని పోలికలుంటాయి. లోకోక్తులూ ఉంటాయి ఉదాహరణకు కాకి, తాటి చెట్టు మీద వ్రాలితే తాటిపండు పడిందని దానినే కాకతాళీయ న్యాయమని అంటారని తెలుసు కదా!


చెవిదుద్దు, మంగలసూత్రము స్త్రీల సౌభాగ్య చిహ్నాలు. పూర్వకాలంలో నిరాడంబరంగా ఉండేవారు కనుక ఆ చెవి దుద్దు, మెడలో కట్టిన తాళి తాటాకులతో ఉండేవి. తాటాకును నేడు ధరించికపోయినా, వజ్రాన్ని ధరించినా ఆ పదాన్ని గుర్తు చేస్తూ వజ్ర తాటంకాలని నేటికీ వ్యవహారంలో ఉంది. శ్యామలా నవరత్నమాలలో అమ్మవారు తాళీపలాశ తాటంకం అని పేర్కొనబడింది. తాటాకుతో చుట్టబడి కర్ణాభరణంగా ఉందని అర్థం. మంగళ సూత్రంలోని బిళ్ళ కూడా తాటాకుతోనే ఉండేది. అందువల్ల మంగళసూత్రాన్ని తాళియని వ్యవహరిస్తారు. గణపతి గురించి చెబుతూ మిగతా విషయాలను ప్రస్తావించాను. ఇక పుస్తకంలోని గణపతిని పేర్కొంటాను.

No comments:

Post a Comment