Tuesday 2 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (189)



దక్షిణాన్ని చూసే ముగ్గురు దేవతలు


దక్షిణామూర్తి రూపంలో, నటరాజు రూపంలో పరమేశ్వరుడు, దక్షిణవైపు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు గణపతి, విష్ణువును ఆవైపు చూస్తున్నట్లు ప్రతిష్ఠించాడు. దక్షిణామూర్తి ధ్యానమూర్తిగా, అచంచలంగా ఉన్నట్లు కన్పిస్తాడు. నటరాజు, నిరంతరం నృత్యం చేస్తున్నట్లుగా జగత్తును ఆనంద డోలికలలో ఊపుతున్నట్లుగా ఉంటాడు. మహావిష్ణువు పడుకొన్న రూపంలో, ఒరిగిన రూపంలో సమాధి స్థితిలో ఉన్నట్లుంటాడు. యోగనిద్రలో ఉన్నట్లుంటాడు. దీనిని సమాధి స్థితి అని నొక్కి చెప్పకుండా యోగ నిద్ర అని ఎందుకు చెప్పినట్లు? విష్ణువు, అనేక ఇంద్ర జాలాలను ప్రదర్శిస్తూ ఉంటాడు. అవి మనకర్ధం కావు. అతని సమాధి స్థితిలో సృష్టికార్యం నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యం? మనం కలలో ఎందరినో వ్యక్తులను సృష్టిస్తూ వినోదిస్తూ ఉంటాం. అందువల్ల ఈ ప్రపంచం అతని కలవంటిదన్నారు. నిద్రలోనే కలలు వస్తాయి. అందువల్ల సమాధిని కూడా నిద్రకాని నిద్రయని అన్నారు. మరొకటి, సమాధిలో నిటారుగా యోగి కూర్చొని యుంటాడు. ఇతడు ఇక్కడ వంగి విశ్రాంతి తీసుకొన్న రూపంలో సాక్షాత్కరిస్తాడు. అయితే మన నిద్రకు, అతని నిద్రకు తేడాను చూపించడం కోసం అతనిది యోగనిద్రయని అన్నారు.


విఘ్నేశ్వరుని చేతి మహిమ వల్ల, అతని గొప్ప ఆలోచనల వల్ల శివునకు దేనిని అన్వయిస్తున్నామో విష్ణువునకూ అదే. అందుకే అతడు రంగరాజు. వైష్ణవ క్షేత్రాలలో ఇది ప్రముఖమైంది, ప్రధానమైంది. ప్రతిష్ఠ జరిగినచోటు శ్రీరంగం.

కొంచెం భిన్నంగా చెప్పానేమో! రంగరాజు ఉండడం వల్ల అది శ్రీరంగంగా పిలువబడలేదు. ఆ ప్రదేశం రంగం అవడం వల్ల దానినతడు పరిపాలించడం వల్ల అతడు రంగరాజయ్యాడు. ఇక్ష్వాకుల కాలంలో అతని పేరు నారాయణుడే, లేక విష్ణువే! లేదా అనంతశాయి కావాలి. వినాయకుడు అతనికై రంగాన్ని సృష్టించాడు కనుక అతనికి రంగరాజని పేరు వచ్చింది, ఇది కావేరీ తీరంలోనే.

రంగం అంటే నాటకాలు ప్రదర్శించే స్థలం. దానిని ప్రజలు చూస్తారు. రంగస్థలిలో, ఆ గొప్ప నటుడు, ప్రపంచమనే నాటకాన్ని నడుపుతున్నాడు. ఆ నాటకాన్ని ఎక్కడ ప్రదర్శించాలి, రంగంలోనే. నటరాజు చూపించే నృత్యం, చిదంబరంలోనే. దానిని సభయని అంటారు. చిత్ సభ, మామూలు జనులు దీనిని కనకసభయని పిలుస్తారు. అక్కడ సభ ఎట్లాగో ఇక్కడ రంగం అట్టిది.

నా తండ్రికి ఒక సభయుండగా యోగనిద్రలోనున్న నా మేనమామ యైన విష్ణువకు సభ యుండవద్దాయని వినాయకుడు భావించాడు. ఇతడు యోగనిద్రలో ఉండే నాటకాన్ని నడుపగలడు. ఇద్దరు చేసే పనులు ఒకటియైనా పేర్లతో కొంత తేడా ఉంటే రమ్యంగా ఉంటుందని రంగమని, విష్ణు సన్నిధికి పేరు పెట్టాడు. అందుకే అక్కడ ప్రతిష్ట.

No comments:

Post a Comment