Saturday 6 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (193)



పూజలో ఒక క్రమపద్ధతి - భక్తితో పూజ


రెండు రకాల భక్తిలున్నాయి. ఒకటి వైధీభక్తి. రెండవది రాగభక్తి. శాస్త్రప్రకారం నియమ నిష్ఠలను పాటిస్తూ సాగేది వైధీభక్తి, రాగభక్తిలో భక్తుడు తన ఇష్టం వచ్చినట్లు భక్తితో కీర్తిస్తాడు.


దీనినే అనురాగ భక్తియని అంటారు. ఈనాడెట్టి నియమాలను పాటించరు కనుక తమకు రాగభక్తి ఉందని భావిస్తారు. ఇట్టిది రాగభక్తి కాదు. భగవంతుని గురించి ఊట మాదిరిగా పెల్లుబికే భక్తి కావాలి. భగవంతునకు సంపూర్ణ శరణాగతిని చూపించాలి. అన్ని బంధాలను త్రెంచుకొని, భగవంతుని పట్లనే కాదు, సమస్త జీవులపట్ల ప్రేమను చూపించగలగాలి.


శాస్త్ర ప్రకారం వైధీభక్తి కూడా ప్రేమతో కూడినదే. ఏదో యాంత్రికంగా సాగేది కాదు. కాని శాస్త్ర నియమాలను పాటించాలి. అందు ప్రధానంగా ప్రేమ ఉండాలి. ముందు ఆత్మ పూజ చేసుకుని తర్వాత విగ్రహాన్ని పూజించాలి. ఆత్మపూజ అంటే ఏమిటి? పూజ చేసేవాని శరీరమే దేవాలయం, పూజ చేసేవాడు పూజించే భగవంతుడు వాడిన పుష్పాలను తీసివేసి కొత్త పుష్పాలతో పూజ చేయునట్లుగా అజ్ఞానమనే నిర్మల్యాన్ని తీసివేయాలి. అట్లాగే తాను పూజచేసేవాడినని పూజింపబడే వేరని అనే భేదభావనను తీసి వేయగలగాలి. పైవాడే నేను అనే సో హం భావనతో సాగాలి: 


దేహోదేవాలయః ప్రోక్తో జీవో దేవః సనాతనః

త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సో హంభావేన పూజయేత్


అతడే మనమౌతూ ఉండగా అతనిపట్ల ప్రేమరహితంగా ఉండగలమా? చాలామందితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటాం. అట్లాగే మనకు మనమే దగ్గరగా ఉండమా?

ఈ శ్లోకం చదువుతూ ఉన్నపుడు ఆ తక్కువ సమయంలో అతని పట్ల ప్రేమ కలిగి యుంటాం. అతడు మనమనే భావన కొంతకాలమే ఉంటుంది. మేమట్లా ఉండిపోగలమని ఎవరైనా బీరాలు పలికితే అవి వట్టి మాటలని భావించండి. ఇక నియమాలకు కట్టుబడనిది రాగభక్తిగా చెలామణి అవుతుంది.


No comments:

Post a Comment