Sunday 7 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (194)

 

కేవలం నాస్తికులు మినహా నూటికి 99 మంది భగవంతుని పట్ల ప్రేమ కలవారే. అట్టి ప్రేమ, నిష్పలం కాదు. ఈ రాగభక్తి అన్ని దేశాలలో అన్ని కాలాలలో మంచి ఫలితాన్ని ఈయకపోదు. కాని అది ఇచ్చే ఫలం కొద్దిగానే ఉంటుంది. మనం పెట్టిన పెట్టుబడి తక్కువగా ఉన్నపుడు రాబడి కూడా దానికి తగ్గట్లే అంతంతమాత్రమే ఉంటుంది.


కాని పూజా నియమాలు, మంత్రాలు, స్తోత్రాలు, కర్మకాండ, శారీరక పవిత్రత, ఆచారాలు మొదలైనవి అన్నీ భగవంతుని పట్ల ప్రేమ ఉన్నా లేకపోయినా పనిచేస్తాయి. ఇట్లా నియమాలను పాటించడం వల్ల ఈశ్వరుని పట్ల అనురాగం వృద్ధి పొందుతోంది.


ప్రాపంచిక, ఆధ్యాత్మిక సౌభాగ్యం వృద్ధి పొందాలంటే మనస్థితి గతులను బట్టి భగవత్ ప్రేమను చూపించాలి. తీవ్రమైన అనురాగ భక్తి కలవారి పట్ల అతడు దయ చూపిస్తాడు. మిగిలిన వారు అనురాగాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. స్తోత్ర, మంత్ర పఠనాదులను ఎల్లా చేయాలో అట్టి నియమాలనూ పూర్వులందించారు.


ఇక వైధీభక్తిలో కొన్ని నియమాలు, పద్ధతులు భిన్న భిన్న దేశాలలో రకరకాలుగా ఉన్నాయి. అవి వారి మతానుసారంగా ఉంటాయి. వేదమంత్రాలను, దానిననుసరించి ఆగమ పూజకు అధిక శక్తి యుంటుందని భగవత్ నిర్దేశముంది. మంత్ర పఠనాదుల ద్వారా క్రియా కలాపానికి భారతభూమి చాలా అనుకూలమని, మంచి ఫలితం ఉంటుందని భగవానుని అభిప్రాయము. ఎట్లా ఎందుకుందని అంటే ఏమీ చెప్పలేము. స్విట్జర్లాండును చక్కని వాతావరణంతో నింపి సహారా ఎడారిని భగభగా మండేటట్లు ఎందుకు చేసాడంటే ఏం చెప్పగలం? సమాధానం చెప్పలేకపోయినా ఉన్న పరిస్థితిని అంగీకరించక తప్పదు.


ఈ భూమి కర్మభూమిగా ప్రసిద్ధం. కర్మ అంటే శాస్త్ర కర్మమని, అందువల్ల మంత్రాలుంటాయని అర్థం. అందువల్లనే ఆత్మలింగం గాని; రంగనాథ విగ్రహం కాని భారతదేశంలోనే ఉండాలని వినాయకుడు తలిచాడు. లంకకే కాదు, అన్ని దేశాలకూ ఈ దేశంలో పూజించడం వల్ల లాభమని భావించాడు. అట్టి లీలలు చూపాడు. 


ఉభయ కావేరుల మధ్యలో ముఖ్యమైన విష్ణు క్షేత్రాలున్నాయి. ప్రసిద్ధమైన శివ, విష్ణు ఆలయాలు కావేరీ తీరంలో చోళప్రాంతంలో ఉన్నాయి.

No comments:

Post a Comment