Wednesday 3 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (190)


వినాయకుని లీలలలోని ఔచిత్యం


శ్రీరంగం యొక్క స్థల పురాణం సరిగా నాకు గుర్తులేదు. ఇది వైష్ణవ క్షేత్రం కనుక వినాయకుని పేరు, అతని లీలలను వారు వర్ణించి యుండకపోవచ్చు. ధర్మవర్మ అనే చోళరాజు, రామునకు సమకాలికుడు. ఇక్కడ మూలస్థానానికి ముందున్న వసారా ధర్మవర్మ పేరుతో ఉంది. ఇక్ష్వాకు రాజుల కుల దైవాన్ని ఇక్కడ ప్రతిష్టించాలని ఘోర తపస్సు చేశాడు. అతని తపః ఫలంగా విశ్రాంతికై విభీషణుడు దీని నిక్కడ ఉంచగా అది స్థిరంగా ఉండిపోయిందని విన్నట్లు గుర్తు. కానీ విఘ్నేశ్వరుడే ఈ లీలను ప్రదర్శించాడని లోకంలో ప్రచారంలో ఉంది. ఇట్లా శైవ వైష్ణవ శాఖల సంగమంగా ఉంది కథను, ఇంకా వింటే నిజమనిపిస్తుంది.


విభీషణుడు బెదిరిస్తూ ఉంటే వినాయకుడు ఱాతికోట నెక్కాడని విన్నాం కదా! విభీషణుడు తనని తరిమి తరిమి నెత్తిపై దెబ్బ కొట్టాడు కదా! దీనికి దృష్టాంతంగా ఆ కొండపై నున్న విఘ్నేశ్వర మూర్తి తలపై దెబ్బ తగిలినట్లుంది. ఇట్లా కొండపై విఘ్నేశ్వరుడుండదం అఱుదు. ఇందులో ఒక తత్త్వం దాగియుంది. మూలాధారం, సహస్రారంతో చేరిందనే యోగపరమైన అర్ధమూ వస్తుంది.  


రంగనాథునకు, గణపతికి ఇంకొక సంబంధం ఉంది. అగస్త్యుని కమండులువును కాకి రూపమెత్తి తిరగబడినట్లు చేసాడని విన్నాం. అగస్త్యుడు ఈ కాకిని తరుముతూ పరుగెత్తాడట. అప్పుడా కాకి, బ్రహ్మచారి రూపం ధరించింది. విభీషణుని కథలోనూ బ్రహ్మచారియే. అగస్త్యుడూ ఒక దెబ్బ కొట్టాలని పరుగెత్తాడు. కొట్టబోయేముందు బ్రహ్మచారి రూపంలో ప్రత్యక్షమయ్యాడు గణపతి. నీ తలమీద దెబ్బ కొడదామని అనుకున్నాను. ఓహో! నువ్వా అన్నాడు. అపుడు తన తలమీదే కొట్టుకున్నాడట. ఈ కథ జరిగిన తరువాత వినాయక భక్తులు తమ తలమీద కొద్దిగా కొట్టుకునే ఆచారం వచ్చింది. ఇది పూజలో ఒక అంగమైంది.

No comments:

Post a Comment