Monday 6 December 2021

శ్రీ హనుమద్భాగవతము (94)



తదనంతరము దశాననుడు అమిత భయంకరముఖములు గల రాక్షసస్త్రీలకు ఆదేశమిస్తూ ఇట్లా పలికాడు. “నిశాచర స్త్రీలారా ! ఆదరముతో గాని, ప్రలోభమునగాని, భయమునైన గాని, మఱి ఎట్లైనా సీత నాకు అనుకూలమవునట్లు ప్రయత్నించకు. ఒక నెలదినములలో ఈమె మనస్సు మార్చుకుంటే మహారాజుభోగములను అనుభవింపగలదు. లేనిచో మరణించి నాకు ఉదయమున ఫలహారము కాగలదు.


రావణుడు మరలిపోగానే వాని కోరిక ప్రకారము భయము గొల్పు రాక్షసస్త్రీలు శ్రీజానకీ దేవిని అనేక ప్రకారముల భయపెడుతూ బెదరించడం ఆరంభించారు. ఈ దృశ్యమును గాంచి శ్రీ పవనాత్మజుడు మిగుల కోపించాడు. ఈ రాక్షస స్త్రీల ఇప్పుడే సంహరించాలి అని సంకల్పించాడు; కాని నీతి నిపుణుడు మేధావియైన హనుమ శ్రీరాముని కార్యము సంపూర్ణం ఒనరించవలెనని సహనము వహించాలి.


దుష్టలైన ఆ రాక్షసస్త్రీలు పతీవియోగముచే దుఃఖించుచున్న సీతా దేవిని బాధించుటను త్రిజట అనే రాక్షస స్త్రీ చూసి వారిని వారిస్తూ ఇట్లు పలికింది. “అధమనిశాచర స్త్రీలారా ! నిశ్చయముగా మీకు చెడుకాలము దాపురించినది. లేనిచో విూరు జగన్నాయకుడైన శ్రీ రాముని అర్థాంగిని ఇట్లు బాధించెడివారలు కారు. నా నిద్రావస్థలో ఇంతకుమునుపే ఒక భయంకరస్వప్నమును గాంచాను. ఆ స్వప్నములో దశకంఠుని సహితముగా సకల రాక్షసవంశ వినాశమును, శ్రీ సీతారామ చంద్రుల సమాగమమును చూసాను”. త్రిజట పలికిన పలుకులు ఆలకించి రాక్షసస్త్రీలు భయవిహ్వలలై ఆ స్వప్న వృత్తాంతమును సాంగోపాంగముగా చెప్పవలసినదిగా ఆమె అడగటం ఆరంభించారు. 


No comments:

Post a Comment