Wednesday 2 February 2022

శ్రీ హనుమద్భాగవతము (148)





భక్తుల సర్వస్వమైనవాడు, భక్త సులభుడైన శ్రీరామచంద్రుడు సుగ్రీవునితో ఇట్లు పల్కెను.


శ్లో|| ఆర్తో వా యది వా దృక్తః పరేషాం శరణం గతః |

అరిః ప్రాణాన్ పరిత్యజ్య రక్షితవ్యః కృతాత్మనా ||

వినిష్టః పశ్యత స్తస్య రక్షిణః శరణం గతః | 

ఆనాయ సుకృతం తస్య సర్వం గచ్ఛేదరక్షితః || 

ఏవందోషో మహానత్ర ప్రపన్నా నామరక్షణే | 

అస్వర్గ్యం చాయశస్యం చ బలవీర్యవినాశనమ్ ||


(వా. రా. 6-18-28-81)


సఖుడా! నీవు నీతి యుక్తమైన సుందరవచనమును పల్కితివి; కాని శత్రువు దుఃఖితుడై తన శత్రువులను శరణు జొచ్చినచో పరిశుద్ధ హృదయముగల శ్రేష్ఠుడైన పురుషుడు తన ప్రాణములను సహితము త్యజించి వానిని రక్షింపవలయును. శరణాగతుడగువాడు రక్షణమును పొందక రక్షకుడు చూచుచుండగానే నశించినచో అతడు రక్షకుని సకల పుణ్యములను తనతో తీసికొని వెళ్ళగలడు. ఇట్లు శరణాగతుని రక్షింపనిచో మహత్తరమైన దోషము సంభవించునని చెప్పబడినది. శరణన్న వానిని త్యజించుట స్వర్గ సౌఖ్యములను, సుయశమును నశింపజేయును. మనుష్యుని బలవీర్యములను హరింపజేయును.


బ్రహ్మహత్యలను గావించినవాడైనా నన్ను శరణుజొచ్చిన వానిని నేను విడువజాలను. ఏ క్షణమున జీవుడు నన్ను శరణువేడునో, ఆ క్షణముననే వాని పాపము జీవుడు నన్ను శరణులన్నియు నశించిపోవును. వానరరాజా! సుగ్రీవా!


శ్లో॥ సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే ! 

అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ |


(వా.రా. 6–18–88) 


నన్ను శరణుజొచ్చి పరిశుద్ధహృదయముతో నేను నీవాడనని పల్కినవానిని నేను సర్వప్రాణులనుండి నిర్భయునిగా ఒనరించెదను. ఇది నావ్రతము. 

No comments:

Post a Comment