Saturday 26 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 24 వ భాగం



అఖండ చైతన్యమైన బ్రహ్మమే ప్రపంచానికి కారణమని ఉపనిషత్తులంటాయి. కాని జడమైన ప్రకృతియే కారణమని సాంఖ్యం అంటుంది. ఈ ప్రధానమైన భేదాన్ని మనసులో పెట్టుకొని సాంఖ్యం, వైదిక సంప్రదాయానికి చెందినదని శంకరులన్నారు.


వేదాంతుల మాదిరిగానే, సాంఖ్య పురుషుడు (ఆత్మ) నిష్క్రియుడు. కాని ఇతని తృప్తికోసం ప్రకృతి సృష్టిస్తోందని సాంఖ్యమంటుంది. ఇది వేదాంతానికి, బుద్ధికి రుచించనిమాట. అనుభవించుట యనేది ఒక క్రియ కాదా? పురుషుడు నిష్క్రియుడైతే తనంతట తాను ప్రకృతి వ్యవహరించగలదా? సమాధి సుఖాన్ని పొందినవారు, పురుషుడైన ఆత్మ, పనికి కారకుడు కాదని, అతడనుభవించబడడని అంటారు. ఒకమూల పురుషుడు, కర్త కాదంటూ అనుభవించడం సబబుగా ఉందా?


చిత్తాన్ని అదుపులో ఉంచేది యోగపద్ధతి. సమాధి స్థితి, ఎట్లా పట్టుబడుతుందో చెబుతుంది. ఇది అష్టాంగాలలో ఉంటుంది. దీనిని అనుసరించేవారు నేటికీ ఉన్నారు. లాభాలను పొందుతున్నారు. దీనిలో ఈశ్వరుడున్నాడు. మిగిలినదంతా సాంఖ్యాన్ని అనుసరిస్తుంది. కనుక సాంఖ్యంలోని లోటుపాట్లు, ఇందులోనూ ఉంటాయి. చరాచర వస్తు ప్రపంచాన్ని నడిపేవాడు ఈశ్వరుడనే మాటను, ఫలదాతయనే మాటనూ పలుకకుండా అతడు శుద్ధుడని, దుఃఖాలంటనివాడని, అభ్యాసకునకు ఆదర్శప్రాయుడని, చితైకాగ్రతకు దోహదం చేస్తాడని వీరు అంటారు.


న్యాయ, వైశేషిక మతాలు కేవలం బుద్ధి గమ్యాలు. తర్కంపై న్యాయం ఆధారపడింది. బ్రహ్మ సత్యమని, మాయ, జీవులనే తొడుగులు తొడిగిందని జ్ఞానం వల్ల ఆ ముసుగులును తొలగించాలని, బ్రహ్మముతో ఐక్యం కావాలని వేదాంతం చెప్పగా పై రెండు మతాలు జీవులు, ప్రపంచమూ సత్యమేయని, ముసుగులంటూ ఏమీ లేవని ఒక్క పరమాత్మ అనుటకు పెక్కు ఆత్మలని అంటాయి. వైశేషిక సిద్ధాంతము, న్యాయ మతాన్నే అనుసరిస్తుంది. చరాచర వస్తువులలోనున్న విశేషాన్ని గుర్తిస్తుంది. అనగా ప్రత్యేకతను. దీని మత ప్రకారం జగత్తు, జీవభావం జ్ఞానం వల్ల పోదని, చరాచర వస్తు ప్రపంచం అంతా అణువులతో నిర్మితమైందని, అవి విభజించడానికి వీలు లేవని, అణువుల కలయిక వస్తూత్పత్తి మొదలైన విషయాలనందిస్తుంది. శరీరము ప్రపంచమూ అంతా అణువులతో నిర్మింపబడిందే, ఆత్మయే చైతన్య స్వరూపమని తెలిసి, జీవన మరణ ప్రవాహం నుండి విముక్తులు కావాలని చెబుతుంది. సాంఖ్యంలో ఏ లోటుపాటులున్నాయో, ఈ వైశేషికంలోనూ అవే ఉన్నాయి. కర్మనాశన మెట్లా? వాదప్రతివాదాలతో సంబంధ విముక్తి ఎట్లా?


No comments:

Post a Comment