Friday 25 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 23 వ భాగం



సాంఖ్యంలో 24 తత్వాలు, ప్రకృతి నుండి పంచ భూతాలవరకూ లెక్కింపబడ్డాయి. ప్రపంచానికి ప్రకృతియే కారణమంటారు. మనస్సు, ఇంద్రియాలు ప్రకృతి నుండే వచ్చాయని అది సత్వ రజస్తమో గుణాలను కలుపుతుందని, చరాచర వస్తు ప్రపంచమూ దాని నుండే వచ్చిందని అంటారు. ఇక జీవంతో ఉన్నవాడు పురుషుడే. అతడు ప్రకృతితో సంబంధం లేకుండా ఉండగలడు. అతడు కార్యాలలో మునిగి తేలడు. కాని ఇతని సన్నిధానం వలన ప్రకృతి, అన్ని కార్యాలను నిర్వహిస్తుంది. జీవుడు ఈ 24 లను (పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు మొదలైనవి) నిశితంగా గమనించి వాటిని తొలగించుకుని, పై మూడు గుణాలకు సమతౌల్యం తీసుకొని రాగలిగితే ప్రకృతి నుండి విడివడి కేవలం పురుషునిగా ఉండగలగడమే కైవల్యమని, లేదా మోక్షం అంటారు. ఇది వారి సిద్ధాంతము.


వీరి పురుషుడు వేదాంతులు చెప్పే నిర్గుణమైన ఆత్మతో; ప్రకృతి - మాయతో సమానము, కాని మన వేదాంతము, ఆత్మయే పరమాత్మయని లేదా బ్రహ్మమని, ప్రపంచము కనబడుతున్నట్లుగా ఉంటుంది, మాయవల్ల కల్పనగా ఉందని అంటుంది. ఇక మాయ లేదా ప్రకృతి అన్నిటికీ కారణమైనపుడు ఆత్మ, జ్ఞానంతో ఉన్న పురుషుడు, ఒక్కరు కాదా? పెక్కు ఆత్మలుంటాయా?


మీమాంసకులున్నట్లుగానే సాంఖ్యులు కూడా ఈశ్వరుని అంగీకరించరు. కాని వేదాంతులేమంటారంటే సగుణ బ్రహ్మయైన ఈశ్వరుడు తన ఆధీనంలో మాయ నుంచుకొంటాడని, నిర్గుణ బ్రహ్మము మాయతో కలిసినపుడు ఈశ్వరుడై ప్రపంచ ప్రవర్తకుడౌతున్నాడని చెబుతుంది. పురుషుని కెట్టి సంబంధం లేదని, అతడుండడం వల్లనే ప్రకృతి, ఈ నాటకం ఆడుతోందని సాంఖ్యులు చెప్పే మాట సబబుగా లేదు.


నిష్కామ కర్మయోగం వల్ల చిత్తశుద్ధిని పొంది ఈశ్వరుణ్ణి భక్తితో భజించి ఏకాగ్రతతో జ్ఞానం విచారించి చేస్తే, ప్రకృతి బంధంనుండి విముక్తులు కావచ్చని వేదాంతులంటారు. కర్మకాండను ఈశ్వరుణ్ణి విడిచి కేవలం విడువదగిన 24 తత్త్వాలను విచారణ చేస్తేనే విముక్తి ఎట్లా సిద్ధిస్తుందని వేదాంతులంటారు.


No comments:

Post a Comment