Tuesday 29 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 27 వ భాగం



కర్మలు, అణు స్వరూపాలై, ఆత్మలో చొచ్చుకొని ఆత్మను బంధిస్తాయని; బంధాలను త్రెంపుకొంటే ఆత్మకు విముక్తియని, ఆకాశం చివర భాగంలో సంతోషంతో ఉంటుందని అంటారు. అణుస్వరూపాలుగా ఆత్మలో కర్మలు ప్రవేశించడాన్ని అడ్డుకోవాలని, అందుకై తీవ్రవ్రతాలను అనుసరించాలని అంటారు.


అహింసకు ఈ మతం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. దాన ధర్మాలకూ అంతే. ప్రాపంచిక జీవితంపై తీవ్ర ద్వేషంతో ఉంటుంది. సిద్ధాంతాలు బాగుండవచ్చుగాని సామాన్యులకు అందుబాటులో ఉండవు. అందువల్ల దానిని అనుసరించువారే దానిపై తిరుగుబాటు చేస్తారు. మన మతంలో గృహస్థాశ్రమానికి, పురుషార్థాలకు తగిన స్థానం ఉంది, అందర్నీ ఉన్నత స్థితిని చేరుకోవడానికి రకరకాల మార్గాలను సూచించింది. పరిపక్వమైన మనస్సులు కానివారికి అట్టి బౌద్ధ జైనాలు సంతృప్తి నీయలేదు. అపరిపక్వమైన పండు చెట్టునుండి పడితే రుచికరంగా ఉంటుందా? సామాన్యులు ఆ సిద్ధాంతాలను ఆచరించడం సాధ్యం కాదు కనుక ఈ దేశం నుండి అవి పోవడమో, లేదా ఈ దేశపు ఆచారాలకై మరల వారు మ్రొగ్గు చూపడమో జరిగింది.


భగవత్ తత్త్వం 


కర్మ సిద్ధాంతం గురించి కొంత మాట్లాడుకుందాం. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. కారణానికి కార్యం ఉంటుంది. దీనినుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. మంచి చెడు కర్మలకు తగిన ఫలముంటుంది. శరీరం పోయినా జీవుడు మరొక శరీరం దాల్చి గత జన్మలకు తగిన ఫలాన్ని పొందవలసిందే. ఈ చక్రం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. మీమాంస, బౌద్ధ, జైనాలు, ఈ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఈశ్వరుడు మాత్రం ఫలదాత కాదంటారు. ఇదీ చిత్రం.


No comments:

Post a Comment