Sunday 27 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 25 వ భాగం

 

జడమైన ప్రకృతియే ప్రపంచానికి కారణమని సాంఖ్యులన్నట్లు, న్యాయ వైశేషికాలు ప్రపంచానికి అణువులే కారణమంటాయి. కనుక వైదిక మత విరుద్ధములున్నారు శంకరులు.


ఇక బౌద్ధులకు, జైనులకు వేదము లేదు, వేదాధ్యయనమూ లేదు. కర్మకాండలు లేవు, వర్ణాశ్రమాలసలే లేవు. ఈశ్వరునే వారు కాదన్నారు. మన ధర్మ శాస్త్రాలలో ఉన్న సామాన్య ధర్మాలను వారు స్వీకరించారు. సత్యం, అహింస, అస్తేయం (దొంగతనం లేకుండుట) బ్రహ్మచర్యం, అపరిగ్రహం (అవసరాన్ని మించి ప్రోగు చేయకుండా ఉండడం) మొదలైన వాటిని గ్రహించి ఇవి అందరికీ అని అన్నారు. మనుష్యులలో పరిపక్వతను గ్రహించకుండా తీవ్రంగా అందరికీ ఈ ధర్మాలను విధించారు. జైన మతంలో భిక్షువులవలంబించే మహావ్రతము ఉంది. సామాన్యులకు తక్కువస్థాయి అను వ్రతం ఉంది. ఆ మతంలో వర్ణాశ్రమ ధర్మం లేకపోవడం వల్ల సామాన్య జనులు, ఈ అనువ్రతాలను అవలంబించలేకపోయారు. శరీరాన్ని బాధపెట్టడం వల్ల (శ్రమ) కర్మలను చేయమంటుంది. అందుకే వారిని శ్రమణులంటారు.


ఇది నిశ్చయమని మనమేమీ చెప్పనవసరం లేదని, ఎవరి అంతటవారే విచారించాలని కొద్దిగా తత్త్వాన్ని బుద్ధుడు అందించాడు. ఆ చెప్పినది, తరువాత వచ్చిన వారికి భిన్న భిన్నంగా తోచి వైభాషికమని, సౌతాంత్రికమని, యోగాచారమని, మాధ్యమికమని నాల్గు మార్గాలైంది. రెండు ప్రధాన భేదాలుగా మహాయాన హీనయానములున్నాయి. యోగాచారం, మాధ్యమికం, మహాయానం పరిధిలోనికి రాగా; సౌతాంత్రికము, వైభాషికము హీనయాన పరిధిలోనికి వస్తాయి. ఇదంతా వాద వివాదాలతో ఉంటుంది.


బుద్ధుడు వేదంలో కొంతయే చెప్పాడని అన్నాను. ఉపనిషత్తులనుండి మాయనే గ్రహించాడు. కాని ఆ మాయకు ఆధారమైన సత్యాన్ని గ్రహించలేదు. కనుక సచ్చిదానందుడైన పరబ్రహ్మము చేరుట లక్ష్యంగా బౌద్ధము చెప్పదు. ఈ మాయనుండి, మాటిమాటికీ మారే జగత్తునుండి విముక్తులై శూన్యస్థితిని అందుకోవడమే నిర్వాణమని, లేదా మోక్షమని అంటుంది. ఉన్నదానిని లేదంటూ ధ్యానం వల్ల ఎట్లా తెలిసికోగలం? బ్రహ్మానందముండగా అంతా శూన్యమవడం ఎట్లా? నిత్య వ్యవహారంలోనే బ్రహ్మానంద మనుభవించామని అంటాం కదా! ఇక సమాధిలో అనుభవించిన వారికి ఎట్లా లేదని చెప్పగలం?


No comments:

Post a Comment