Wednesday 30 March 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 28 వ భాగం



కర్మ జడం కదా! తగిన ఫలాన్ని అది ఎట్లా ఈయగలదు? వేదాన్ని నమ్ముతూ కర్మ, తనంతట తానే ఫలాన్నిస్తుందని, ఈశ్వరుడవసరం లేదని ఒకవైపు మీమాంసకులనగా; వేదాలను కాదని కర్మ, ఎట్లా ఫలాన్నిస్తుందో బౌద్ధ జైనాలు వివరించలేదు. కర్మ ప్రకారం మరల పుట్టుక ఉందంటారు. కనుక వీరు పునాది లేని సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అంతా శూన్యమని అంటూనే, అంతా నిరంతరం మార్పు చెందుతోందని అంటూ ఫలానా కర్మలు, ఫలానా ఫలాన్ని ఇస్తాయని బౌద్ధులెట్లా నిర్ణయించగలరు? అంతా మాయయని కొట్టివేయకుండా దీనినంతటినీ నడిపే గొప్ప మనస్సు (మహత్తు) లేదా ఈశ్వరుడన్నాడని వేదాంతులంటారు.


వేదాంతులు బ్రహ్మమే సత్యమని చెబుతూ మాయా సిద్ధాంతాన్ని బౌద్ధుల నుండి తీసుకొన్నారని వేదాంతులను ఇతరులక్షేపిస్తారు. వారొక భేదాన్ని తప్పక గుర్తించాలి. మాయవల్ల బ్రహ్మము ప్రపంచంగా కన్పిస్తోందని ఈశ్వరుడు తన ఆధీనంలో మాయ నుంచుకొని ఫలాలనందిస్తాడని వేదాంతులంటారు. మరొక విధంగా చెప్పాలంటే నిర్గుణ బ్రహ్మము, నిష్క్రియ బ్రహ్మము మాయాశక్తితో కలిసి ఈశ్వరుడగుచున్నాడని, సగుణ బ్రహ్మము (ఈశ్వరుడు) ప్రపంచ వ్యవహారాలను నడిపిస్తున్నాడని అద్వైతులంటారు. సగుణ బ్రహ్మము నుండి నిర్గుణ బ్రహ్మము వైపు పయనించడమే అద్వైత లక్ష్యం. అందువల్ల మాయతో కూడిన సగుణ బ్రహ్మము యొక్క అనుగ్రహం కావాలని, జ్ఞాన మార్గానికి వెళ్ళడానికి ముందు భక్తితో ఈశ్వరుని భజించాలని అద్వైతం అంటుంది. ఇట్లా బౌద్ధానికి ఇది భిన్నం.


మరొక భేదం ఉంది. మాయ అంటే కేవలం అబద్ధం కాదు. దానిని అత్యంత అసత్ అనలేదు. నిర్గుణ బ్రహ్మమే అసలైన సత్యం. దీని మధ్యలో ప్రాతిభాసిక సత్యం ఉంది. అనగా సత్యమని భ్రమింపచేసి అసత్యమని నిరూపించుట. ఇది ఎండలో ముత్యపు చిప్ప, వెండిగా కనబడే స్థితి. ఈ మాయాలోకాన్ని ప్రాతిభాసిక సత్యమన్నారు. ఇది జ్ఞానంలో కనుమరుగై పోతుంది. కనుక ప్రాతిభాసిక సత్యం కేవలం అసత్ కాదు. అట్లాగే జగత్తు అసత్యం కాదు. ఇది మిథ్య. అనగా తాత్కాలికంగా సత్యంగా కనబడేది.


No comments:

Post a Comment