Sunday 18 October 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (58)



ఈ కృష్ణుడు ఆ రాముడని తెలిసినా కౌగలించుకోడానికి సందేహిస్తాడు. పుష్ప కోమలమైన ఆ శరీరమెక్కడ? తన శరీరమెక్కడ? అని సందేహిస్తాడు. అందుచేత మల్లయుద్ధంలో తన శరీర స్పర్శను అతనికి కల్గించి ఆసందాన్నియ్యాలని భావించాడు కృష్ణుడు. అతని లీలలలో అనేకాంతరార్థాలు దాగి ఉంటాయి.


పరమేశ్వరుడు కూడా తన దివ్య శరీర స్పర్శ యొక్క రుచిని అర్జునునకు యుద్ధం చేసి చూపించాడు. 


రోజులు గడుస్తున్నాయి. ఎవరు గెలుస్తారో తేలడం లేదు. ద్వారం దగ్గరగా నున్న యాదవులెంత కాలం వేచియుంటారు? తమకేమైనా ప్రమాదం ముంచుకు వస్తుందని ద్వారకు తిరిగి వచ్చారు. మానవుల నైజాన్ని గమనించారా? 


ఇట్లా 21 రోజులు యుద్ధం సాగింది. జాంబవంతుడలిసిపోయాడు. నీలమేఘశ్యాముని స్పర్శ వల్ల ఒక అలౌకికానందాన్ని పొందుతున్నాడు జాంబవంతుడు. తనకున్న బలం ఆ రామచంద్రమూర్తి ప్రసాదించిందేనని రామ, రామ అంటూ కీర్తించాడు. ఇంతవరకూ మరొక అవతారాన్ని పిడిగ్రుద్దులతో సత్కరించడమా?


రామనామశక్తి యున్నా ఈ తన్నులు తినడమేమిటి? శత్రు స్పర్శ, సుఖాన్ని కల్గిస్తోందేమిటి? అని ఆలోచించాడు.


ఇక కృష్ణుడు ఈ ఆట చాలించాలనుకున్నాడు. జాంబవంతుని జ్ఞానోదయం కలిగించాడు. 


ఏమిటేమిటి? నా ఉపాసనమూర్తితో ఇంతవరకూ యుద్ధమా? రాముడే కృష్ణుడు కదా అంటూ పాదాభివందనం చేసాడు. కృష్ణుడు కరుణించాడు.

No comments:

Post a Comment