Thursday 15 July 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (51)

ఆంజనేయుడు - ఉత్తమ దూత


దూతగ వచ్చినవాడు పంపినవాని సందేశాన్ని పూసగుచ్చినట్లు చెప్పవలె గాని తన అభిప్రాయాలను వానికి జత చేయరాదు. సహజంగా "అదిగో పులి అంటే ఇదిగో తోక" అన్నట్లుగ మాట్లాడే మనస్తత్వం కలవారే ఎక్కువ. ఆ విధానం పనికిరానిది. వాస్తవిక దృశ్పథం ఎంతో అవసరం మాట విలువ తెలిసి మసలుకోవాలి. మంచికి ఉపయోగించాలి. ఆది పుణ్య ఫలితాన్నిస్తుంది.


ఆ మాట నేర్పు కలవాడు కాబట్టే వాయుసూనుడు మొదటి చూపులో రామునికి ఆత్మీయుడయ్యాడు. అలాగే ఇచట సీతా మాతయు ఆత్మబంధువు వలె చూచింది మారుతిని. వీడలేక, వీడలేక గుండె దిటవు చేసుకుని వీడ్కోలు చెప్పింది. సాగర లంఘనానికి సిద్ధమయ్యాడు. అంతలోనే తన కార్యం అసంపూర్తిగనున్నట్లు తోచింది. తాను వచ్చుటలోని ప్రధానాంశం చూచుట, సంభాషించుట జరిగినది. ఇక యీ లంకను గురించిన విశేషాలు తెలుసుకోవాలి? సముద్రతీరాన గల దీని ఉనికి తెలిసికోనిదే వెళ్ళుట సమంజసం కాబోదు.


రాక్షసులు సామ, దాన, భేద, దండోపాయాలలో మొదటి మూడింటికి లోబడరు. తామసులైన యీ రాక్షసులపట్ల సామం పనికిరాదు, సకల సంపదలతో తులతూగే వీరియెడ దానం పనికి రాదు, బలపరాక్రమోపేతులగుట భేదం పనికిరాదు. ఇక వీరియెడ దండోపాయమే తగినది. పరాక్రమ ప్రకటనమే సరైనదని నాకు తోచుచున్నది. పూర్వకార్య విరోధం లేకుండగ అనేక కార్యాలను సాధించువాడే- కార్యసాధకుడు, సమరుడనిపించుకొనును, శత్రుపుల బలాబలాలను బేరీజు వేసుకొనుటకు యీ అవకాశం ఉపయోగించుకోవాలి. వానరులు, రాక్షసుల యుద్ధ విధానంలో గల తేడాలు తెలుసుకొనుట మంచిది. అంతేకాక నా బాహుబలంతో శత్రు సేనను కొంతవరకు రూపుమాపిన మిగిలినవారిని సంహరించుట సుగ్రీవాంగద రామ లక్ష్మణులకు తేలికైన పని. రావణునికి తమ శక్తి సామర్థ్యములను తెలియచేసినట్లయి- కనువిప్పు కలిగించ గలదేమో! దూతయినవాడు అన్ని కోణాలనుండి తన ప్రభువు కార్యాన్ని సాధించగలగాలి. తానే ముందుగా శతృవును కవ్వించి, కదనానికి రప్పించి కాలుని పన్నిధానానికి పంపాలి. అందుకు తగిన విధానం రావణునికి అత్యంత ప్రీతిపాత్రమైన అశోక వన విధ్వంసనం. 

No comments:

Post a Comment